Saturday, November 27, 2010

ఎందుకున్నామిక్కడ?

ఒక జూలో... ఒక తల్లి ఒంటె, ఒక పిల్ల ఒంటె రెండూ సేదతీరుతున్నాయి. ఉన్నట్టుండి పిల్ల ఒంటెకు ఒక సందేహం రావడంతో.... 'అమ్మా..మన పొట్టలో నీటి తిత్తి ఎందుకు ఉంటుంది?' అని అడిగింది తల్లిని.
'మనం ఎడారి జంతువులం కదా... నెలలు నెలలు నీళ్లు దొరక్కపోయినా బతకడానికి మన పొట్టలో నీటిని దాచుకుందుకు దేవుడు నీటి తిత్తిని ఏర్పాటు చేశాడు' అని సమాధానమిచ్చింది తల్లి.
'మరి మన కాళ్లు పొడుగ్గా....పాదాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి?' ఇంకో సందేహాన్ని లేవనెత్తింది పిల్ల ఒంటె. ' ఇసుకలో నడిచేందుకు వీలుగా అలా ఉన్నాయి. మన కాళ్లు, పాదాలు ఇలా ఉండడం వల్లే ఇతర జంతువుల కన్నా చురుగ్గా, హాయిగా ఎడారిలో తిరగ్గలం మనం' గర్వంగా చెప్పింది తల్లి.
'మరి మన కంటి రెప్పల వెంట్రుకలెందుకు పొడుగ్గా ఉంటాయి చూపుకి అడ్డం పడేలా?' బుంగమూతితో ప్రశ్నించింది పిల్ల ఒంటె.
'పిచ్చి తల్లి.... కంటిరెప్పల వెంట్రుకలు అలా పొడుగ్గా ఉండబట్టే ఎడారిలో వీచే గాలికి ఇసుక మన కంట్లో పడకుండా రక్షణ ఉంటుంది' అనునయంగా వివరించింది తల్లి ఒంటె.
'ఓహో.. ఎడారిలో ఉండడానికి దేవుడు మన శరీరంలో ఇన్ని ఏర్పాట్లు చేస్తే... మరి మనం ఈ జూలో ఎందుకున్నామమ్మా....?' అమాయకంగా అడిగింది పిల్ల ఒంటె.

***

ఇవ్వాళ ఎందరికో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనుషులుగా మనం నేర్వాల్సిందేమిటి, నేర్చుకున్నదేమిటి, చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి, మనుషులుగానే స్థానభ్రంశం చెందుతున్నామా....
పిల్ల ఒంటెకున్న పాటి తెలివి కూడా మనకు లేకుండా పోతోందే!

నాన్నకో లేఖ

ఏదో పని మీద కొడుకు గదిలోకి వెళ్లిన తండ్రికి స్టడీ టేబుల్ మీద కొడుకు రాసిన ఉత్తరం కనిపించింది. ఏంటా అని తీసి చదవడం మొదలుపెట్టాడు తండ్రి..


డియర్ డాడ్...
ఈ విషయాలన్నీ మీకు చెప్పాలంటే బాధగానే ఉంది. కాని చెప్పక తప్పడం లేదు. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. రోజూ ప్రతి చిన్న విషయానికి నువ్వూ, అమ్మా పోట్లాడుకోవడాలు, అరుచుకోవడాలు.. నన్ను చాలా డిస్ట్రర్బ్ చేస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతోంది. దాన్ని బయట వెదుక్కునే ఆరాటంలో ఉన్నాను. నన్ను ప్రేమగా చూసుకోవడానికి నా కన్నా పెద్దదైన ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సరదాలు, అల్లర్లు పంచుకోవడానికి ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులు ఉండనే ఉన్నాయి. చదువు సంధ్యలు, భవిష్యత్ బెంగలు.. గట్రా మరిచిపోయి ఆనందంగా... గాల్లో తేలిపోవడానికి కొకైనూ అందుబాటులో ఉంది. 
వీటన్నిటినీ అనుభవిస్తూ.... 
హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను డాడీ.... .
నా కోసం వెదకొద్దు.


పిఎస్:  డాడీ.... పైన నేను రాసిన విషయాలన్నీ నా స్టడీ టేబుల్ సెంటర్ డ్రాలో ఉన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని మార్కులకన్నా భయంకరమైన విషయాలు. అవన్నీ అబద్దం . నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మంచి, చెడుల విచక్షణ నాకుంది. విచక్షణను అందించేదే కదా...విజ్ఞానం. మరి దీనికి మార్కులు కొలమానమా డాడీ....? ఇది అర్థం చేసుకున్నాక, మీ కోపం తగ్గాక కాల్ చేయండి. 
క్షణంలో మీ ముందుంటాను.
లవ్ యూ డాడీ....  
మీ అబ్బాయి

లక్ష్యాల బాటలో...

మనసులో ఏదో లక్ష్యం అంకురిస్తుంది. చాలా మందిలో ఆ లక్ష్యం సాకారం కాకుండా అలాగే ఉండి పోతుంది. కొందరిలో అది పెరిగి పెరిగి ఒక మహావృక్షమైపోతుంది. తన చుట్టూ ఉండే ఎందరికో నీడగా, ఒక అండగా నిలబడుతుంది. కానీ, అన్ని లక్ష్యాలూ ఆ స్థాయికి చేరుకుంటాయా అంటే లేదు. వినడానికి చేదుగా అనిపించవచ్చేమో కానీ, అత్యధిక లక్ష్యాలు వైఫల్యాలనే మూటకట్టుకుంటాయి. అందుకు ఒకటా రెండా? కారణాలు అనేకం.
అనుకోకుండా రోడ్డు మీద కలసిన ఒకతను నా స్నేహితుడికి ఎవరి గురించో చెబుతున్నాడు. అవే వీ నేను పట్టించుకోలేదు గానీ, మాటల మధ్యలో ఆ వ్యక్తి గురించి చెబుతూ 'ఆయనో వాయుపుత్రుడులే' అన్నాడు. ఆ మాటకు అర్థమేమిటో నాకేమీ బోధపడలేదు. నేనలా దిక్కులు చూస్తూ ఉండిపోయాను. వారి సంభాషణ ముగిసిపోతున్న సమయంలో"ఇందాక ఎవరినో మీరు వాయుపుత్రుడు అన్నారు.


ఆమాటకు అర్థం ఏమిటండి? అన్నాను. ఆయన ఫక్కున నవ్వి " కాస్త గుట్టుగా ఉంచడానికి ఆ మాట వాడతాను. వాయుపుత్రుడు అంటే గాలి మనిషండి. నేను చెప్పే వాడి ధోరణే అది. గాలివాటంగా ఎటు పడితే అటు కొట్టకుపోతుంటాడే తప్ప ఎక్కడా స్థిరంగా ఉండడు'' అన్నాడు. "ఒక లక్ష్యం అంటూ లేని వాడు గాలి మనిషి కాక మరేమవుతాడు?''అంటూ లోలోన నా మనసు గొణుక్కుంటోంది. ఏమైనా ఈయన భలే తమాషా మనిషిలే అనిపించింది. అయితే, ఈ నిలకడలేని తనాన్ని గురించి ఎవరినైనా ప్రశ్నిస్తే వారి నుంచి వచ్చే సమాధానాలు తమాషాగా మాత్రం ఉండవు.


అనుకుంటే మాత్రం?
"ఏమేమో అనుకున్నాను. ఎంతో సాధించాలనుకున్నాను. కానీ, ఏమయ్యింది? వరదల్లో ఊళ్లు కొట్టుకుపోయినట్లు, కాల ప్రవాహంలో ఏళ్లు గడిచిపోయాయి. కానీ, నేను అనుకున్న వాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేరలేదు. బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోతుంటే నేను మాత్రం ఏంచేయగలను? అందుకే ఇక ఏమనుకునీ ప్రయోజనం లేదని తేల్చేసుకుని జీవితం ఎటు తీసుకు వెళితే అటు వెళ్లిపోవ డానికే నిర్ణయించుకున్నాను.''అంటూ కొందరు కొండంత నిర్లిప్తతను వ్యక్తం చేస్తుంటారు. అయితే,ఎంతసేపూ "అనుకున్నానూ అనుకున్నానూ'' అనడమే కానీ అనుకున్నది నె రవేరడానికి చేసిందేమిటి? ఆ చేసింది ఏ స్థాయిలో? అని ప్రశ్నించుకుంటే చాలా సార్లు సరియైన సమాధానమే రాదు.


అపజయానికి వేయి దారులు
అయినా అనుకోవడంతోనే అంతా అయిపోదు కదా! ఒక లక్ష్యంగా అనుకోవడానికి ముందు మన పరిమితులు, మన శక్తి సామర్థ్యాల మీద చాలా సార్లు మనకో అంచనాయే ఉండదు. ఎన్ని వనరులు సమకూర్చుకోవాలి? ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి? ఎంత సేపూ విజయావకాశాల మీదే తప్ప మునుముందు ఎదురయ్యే ప్రమాదాల గురించిన అంచనా లేకపోతే ఎలా?నిజానికి మనిషిని నిలబెట్టేందుకు వచ్చే విజయానికి ఒకే దారి ఉంటుంది.


పడగొట్టాలని చూసే అపజయానికి మాత్రం వేయి దారులు ఉంటాయి. వాటిని నిరోధించడంలో ఏ కాస్త అప్రమత్తంగా ఉన్నా అపజయమే మిగులుతుంది. ఈ విషయంలో మానసిక వేత్త ఆండ్రే మౌరిస్ కొంత భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. " చాలా మంది తాము అనుకున్నది నెరవేరలేదని చెబుతారేగానీ, వాస్తవానికి వారు వాటి గురించి అంత బలంగా అనుకున్నదే లేదు'' అంటాడు. ఈ మాటలు లక్ష్యం వెనుకున్న మూలాల్నే నిలదీస్తుంది. మన సంకల్పాలు చాలా సార్లు ఇంత బలహీనంగా ఉంటున్నాయా? అనిపిస్తుంది.


అంతే స్థిరంగా...
జీవితంలోని కొన్ని సంఘటనలు ఒక్కోసారి మనసును అమితంగా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావాల్లోంచే బలమైన కోరికలు అంకురిస్తాయి. ఈ కోరికలే కొందరిలో క్రమంగా విస్తరిస్తూ లక్ష్యాలుగా మారతాయి. ఒక దశలో కోరికలు వేరు, లక్ష్యాలు వేరు అనిపించేంత వ్యత్యాసం ఈ రెంటికీ మధ్య ఏర్పడుతుంది. వాస్తవానికి కోరికలు ఎప్పుడూ ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని అశ్రయించే ఉంటాయి.


కోరికలెప్పుడూ స్వీయ సుఖాన్నే కోరుకుంటాయి. ఆ సుఖం దక్కకపోతే చతికిలబడతాయి. లక్ష్యాల గురి వేరు. అవి వ్యక్తిగత గుడారాల్లో ఇమడలేవు. తమ కుటుంబానికి ఆవల ఉండే మిగతా వారి కోసం అంటే సామాజిక హితానికే అవి పాటుపడుతూ ఉంటాయి. ఒత్తిళ్లకూ, గాయాలకూ అవి చలించవు. అవి ఏ త్యాగానికైనా వెనుకాడవు.


రెట్టింపు శ్రమ
మనో విశ్లేషకుడు జాన్ కాపర్ పాయ్స్ " లక్ష్యం అంటే అది సుఖ సౌఖ్యాలకూ, ప్రశాంతతకూ బద్ధ శత్రువు'' అంటాడు చలోక్తిగా. దీనికి కొంచెం భిన్నంగా అబ్దుల్ కలామ్, లక్ష్యాలను కలలుగా చెబుతూ " కలలంటే నిద్రలో వచ్చేవి కావు. నిద్ర పట్టకుండా చేసేవి'' అంటాడు. నిజానికి ఒక విశాలమైన లక్ష్యాన్ని సాధించాలంటే రెట్టింపు శ్రమ అవసరమవుతుంది.


లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఎవరైనా సాధారణ శ్రమతోనే సరిపెడితే వారు అపజయాన్నే మూటగట్టుకుంటారు. అయితే, లక్ష్యాన్ని గాఢంగా ప్రేమించేవారు సహజంగానే రెట్టింపుగా శ్రమిస్తారు. అది వారికి ఆనందంగా ఉంటుందే తప్ప శ్రమగా అనిపించదు. లక్ష్యం మీద ప్రేమ లేకుండా ఎంతసేపూ లక్ష్య సాధనతో వచ్చే ఫలితాల మీద ధ్యాస ఉండే వారికే శ్రమ భారమనిపిస్తుంది. భారంగా చేసే పనులేవీ ఆశించిన ఫలితాల్ని సా«ధించలేవు.


ప్రవాహమై...
పరిమితులు, అవరోధాలు మన గమనానిక్ని నిరంతరం అడ్డుపడుతూనే ఉంటాయి. అవరోధాలన్నీ పూర్తిగా వ్యక్తిగతంగానో పూర్తిగా సామాజికంగానో ఉండవు. చాలా సార్లు అవి ఈ రెండింటి మిశ్రమంగా ఉంటాయి.అందుకే అవరోధాలను అధిగమించడం అన్నది ఆ రెండింటి పట్ల మనకున్న అవగాహన మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.


లక్ష్యసాధనలో కొన్నిసార్లు అవరోధాలు ఏర్పడవచ్చు. నిజానికి అవరోధాలు, ప్రతిష్ఠంభనలు తాత్కాలికంగా ఉండేవే. ప్రతిష్ఠంబనను ఓటమి అనుకోవడం నిద్రను మరణం అనుకోవడమే. లక్ష్యసాధనలో గాయాలు అత్యంత సహజం. ఆ గాయాలు భౌతికమైనవే కావచ్చు. మానసికమైనవే కావచ్చు ఏదో ఒక స్థాయిలో అవి ఉంటాయి. తిరోగమనానికైనా పురోగమానికైనా గాయమే సరిహద్దుగా ఉంటుంది. కొందరు గాయపడితే తక్షణమే లక్ష్యం నుండి వైదొలగిపోతారు. కొందరేమో గాయాలతో పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగిపోతారు. నిజానికి నీరు లోయల్లోంచి పయనించినట్లు విజయం గాయాల్లోంచే పయనిస్తుంది.

.-బమ్మెర

Friday, November 19, 2010

అమూల్య సమయం

wealth-means
ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఓ ఏడాది పరీక్ష తప్పి న విద్యార్థిని అడగాలి. ఒక నెల విలువ తెలియాలంటే ఉద్యో గిని అడగాలి, ఒక గంట విలువ తెలియాలంటే ప్రేయసి కోసం తహతహలాడే ప్రేమికుడిని అడగాలి. ఒక నిమిషం విలువ తెలియాలంటే బస్సు మిస్సయిన ప్రయాణికుడిని అడగాలి. ఒక క్షణం విలువ తెలియాలంటే పోటీలలో రజతంతో సరిపెట్టుకున్న క్రీడాకారుడిని అడగాలి...ఇప్పటికే ప్రతి క్షణం ఎంతో విలువైనదని మీకు తెలిసుంటుంది. అందుకే మనకు ఏవిధంగానూ ఉపయోగంలేని పనులను తో, మాటలతో సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఇలా పనికిరానివి, పక్కన పెట్టాల్సిన పనుల జాబితాను సిద్దం చేసుకుంటే ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవచ్చు.


కాలం చాలా విలువైనది. పోతే తిరిగిరాదని నేడు కొత్తగా చెప్పక్కర్లే దు. కానీ కొంతమంది యువతీయువకులు తమ అమూల్యమైన సమయాన్ని అనవసర విషయాలకు వెచ్చిస్తున్నారు. ముఖ్యమైన పనుల ను వాయిదా వేస్తూ పనికిరాని వాటికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చదువుకున్న యువతీ యువకులే ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తున్నారు. వారికి ఇష్టమైన కార్యక్రమాల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా అందుకోసం ఎంతో సమయాన్ని కేటాయించే వీరు అవసరమైన విషయాలకొస్తే మాత్రం తమకు తీరిక లేదంటూ చెబుతుంటారు కొంతమంది. ఒక జాబితా తయారు చేసుకుంటే అసలు మన జీవితంలో ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామో తెలుసుకుకోవచ్చని కొంతమంది శాస్తవ్రేత్తలు అంటున్నారు.


లెక్క తేల్చారు...
ముపె్ఫై సంవత్సరాల జీవితంలో ఏడు సంవత్సరాలు సద్వినియోగం చేసుకుంటే చాలా గొప్ప అని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఏంటీ ఆశ్చ ర్యంగా ఉందా? అవును వారానికి 168 గంటలలో టీవీలు చూడడం, స్నానాదులు, షికార్లు చేయడం వంటి పనులు మినహాయించి 60 గంట లు సద్వినియోగం చేసుకుంటే ఎంతో సమయం సద్వినియోగం చేసుకు న్నట్టేనని శాస్తవ్రేత్తలు అంటున్నారు. అసలు ఒక ఏడాదిలో ఫోనులో మాట్లాడే సమయం మూడు నెలలకు మించి ఉంటుందని నిపుణులు లెక్కతేల్చారు. ఇటువంటి విషయాలను పరిశీలించినప్పుడు పనికిరాని వాటికి ఎంత సమయం ఇస్తున్నామో అర్థమవుతుంది. అందుకే వేటికి ఎంతసమయం కేటాయించాలో తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకు ఎంతో ఉంది.


రూపొందించుకోవాలి...
Dali-Persistence-of-Timeఏదైనా పని ఉన్నప్పుడు వాయిదాలు వేయడం కొంతమంది కుర్రకారు ఎంతో ఇష్టంగా చేసే పని. అయితే ముఖ్యమైన పనులన్నీ పక్కనపెట్టి కొ న్ని టీవీ ఛానల్స్‌లో వచ్చే ఏమాత్రం ఉపయోగంలేని కార్యక్రమాలను చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపడం వృథాగా చెప్పవచ్చు. అసలు ఒక వారంలోని సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారో ఒ జాబితాను తయారు చేసుకుంటే అసలు ఎంత సమయం సద్వినియోగం చేసుకుం టున్నారో వారికి తెలిసిపోతుంది. టీవి వీక్షించేందుకు, సర్ఫింగ్‌ / చాటిం గ్‌, తిండికి, ప్రయాణం, కాలేజీకి లేదా ఆఫీసుకు, బయట గడిపేందుకు, స్నేహితులతో షికార్లకు, చదువుకు లేదా ఆఫీసులో చేసే పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారో ఒక లిస్ట్‌ తయారు చేసుకోవాలి. అలాగే ఆయాపనులు చేస్తున్నప్పుడు మీరు పొందే చిరాకు, ఆనందం, అలసట, ఉత్సాహం, తప్పు చేస్తున్నామనే భావన... వంటి భావోద్వేగాలను కూడా గమనించాలి. మనం వారంలో ఎంత ఖర్చుచేస్తామో పట్టిక తయారు చేసే విధంగానే సమయానికి కూడా పట్టిక రూపొందించుకోవాలి.


మీరే తేల్చుకోవచ్చు...
సరదాగా మీ పనులన్నీ ఒక జాబితాగా తయారు చేయండి. అప్పుడు సమయం వృధా చేస్తున్నారని ఎవరూ మీకు చెప్పక్కర్లేదు. ఆ జాబితాను చూస్తే మీమీద మీకే సిగ్గేస్తుంది. ఇంకా చెప్పాలంటే అసహ్యమేస్తుంది. అందరూ అసహ్యించుకునే బదులు ఏం మార్చుకుంటారో మీరే తేల్చుకో వచ్చు. అనవసర విషయాలకు ఎంతటి అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నారో వాటివల్ల జీవితంలో ఎంత సమయం పనికిరాకుండా పోతుందో ఒక అంచనాకు రావచ్చు. ఇవన్నీ తెలుసుకున్న యువతీ యు వకులు తాము అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించు కుంటారని శాస్తవ్రేత్తలు తెలియజేస్తున్నారు. అలాగే తమ తరువాత తరానికి ఆదర్శంగా ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకునేలా మారతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇక వెంటనే మీ సమయ జాబితాను ప్రారం భించండి మరి.

Sunday, November 7, 2010

శంఖారావాలూ ... ఈలారావాలూ

'నాన్నా ... అర్జెంటుగా ఒక వంద శంఖాలు పట్టుకురా'
'శంఖాలా ... శంఖాలేమిటమ్మా?'
'అయ్యో శంఖాలు తెలియదా? శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదంటారు చూడు. ఆ శంఖాలురా' నాయనమ్మ తల దూర్చింది.
'అబ్బా ... ఆ సామెతలన్నీ వాళ్లకేం తెలుస్తాయి? నువ్వుండు. నేను చెపుతా. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పూరిస్తాడే అది రా అబ్బాయ్' తాతగారు కల్పించుకున్నారు.
'ఐ లవ్ యు' అని రాసి బీచిల దగ్గర అమ్మేవీ ఇవీ ఒకటేనా నాన్నా? వాటిల్లోనుంచి అంత శబ్దం వస్తుందా?'
'ఉండు ఊది చూపెడతా' ఎక్కడ్నించో ఒక బుజ్జి శంఖం తీసుకొచ్చి ఊదాడు ఆ అమ్మాయి తమ్ముడు.
తండ్రి ఉలిక్కిపడ్డాడు. తల్లి పరిగెత్తుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు గాభరాగా తొంగి చూశారు. అంత చిన్న శబ్దానికే అంత రెస్పాన్స్ రావటం చూసి ముగ్ధురాలయింది ఆ అమ్మాయి.

'నాన్నా మరిచిపోకు సాయంత్రం వచ్చేటపుడు తప్పకుండా తీసుకురా' మరీ మరీ చెప్పింది. కాని నాన్న తేలేదు. అమ్మా తేలేదు. అక్కా తమ్ముళ్లే కష్టపడి కొన్ని శంఖాలు పోగేసి, కొంతమంది పిల్లల్ని రప్పించి ఒక టేప్‌రికార్డర్ ముందు కూర్చున్నారు. ఒక్కొక్క శంఖం ఊదడం, అది ఎందుకు ఊదారో కారణం చెప్పడం ... చాలాసేపు సాగింది ఆ తతంగం.
శంఖాలు తక్కువై పిల్లలు ఎక్కువవడంతో కాసేపయ్యాక విజిల్స్ కూడా బయటకి తీశారు. శంఖారావంలో ఈలలు వేయొచ్చా అని కొందరు సందేహించారు. కాని ఆ పేపర్ యాడ్‌లో శంఖారావం పూరించండి అంటూ ఈల బొమ్మే వేసి ఉండడంతో ఈలారావాలకు వాళ్లు కూడా అంగీకరించారు.
ఎలాగైతేనేం క్యాసెట్ సిద్ధమైంది. ఈ లోగా దీపావళి సెలవు వచ్చేసింది. సత్యభామ దుష్టసంహారం గావించిన రోజు. అంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది? అనుకున్నారు పిల్లలు.
టేప్‌రికార్డర్ ఆన్ చేసి దానికి మైక్ కనెక్షన్ ఇచ్చారు. ఇంట్లో, వీధిలో, షాపులో, స్కూల్‌లో, ఊర్లో, టౌన్లో, రాష్ట్రంలో, దేశంలో ... తమకు తెలిసిన మొత్తం అవినీతిపరులందరి పేర్లూ వరసాగ్గా వినబడసాగాయి శంఖ ఈలారావాల మధ్య.
వెంటనే ఏం జరిగిందో తెల్సా! ఆ వీధిలోనూ, పేటలోనూ ఉన్న పెద్దవాళ్లందరూ పిల్లల కోసం తెచ్చిన బాణాసంచా మొత్తం టపటపామని కాల్చి పారేశారు. అందుకే మీకెవరికీ ఆ పేర్లు వినిపించలేదు. అయినా ప్రకటన ఇచ్చిన ప్రభుత్వానికి గాని, మనకు గాని వాళ్ల పేర్లు తెలియకపోతేగా!

స్నేహంతోనే ముందంజ

'వీడికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువయ్యారు... అందుకే చదువు తక్కువయ్యింది. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్‌తో కబుర్లే గానీ చెప్పిన మాట ఒక్కటీ పట్టించుకోడు కదా......' అంటూ తమ పిల్లల గురించి కంప్లెయింట్ చేసే తల్లిదండ్రులను చాలామందిని చూస్తూనే ఉంటాం.

స్నేహితులు ఎక్కువగా ఉంటే పిల్లలకు చదువు ధ్యాస తక్కువగా ఉంటుందని, ఆటలపైనే మోజుంటుందని చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. కానీ ఇటీవలి అధ్యయనాలు ఇందుకు విరుద్ధమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. బడికి వెళ్లే పిల్లలకు ఎంత ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉంటే చదువులో వాళ్లు అంత ముందంజలో ఉంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అధ్యయనకారులు.

పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఇట్టే ఫ్రెండ్‌షిప్ చేసేస్తారు. ఇంటి చుట్టుపక్కల, బంధువుల పిల్లలు ఇలా వారి జాబితా పెద్దదే. వయసుతో పనిలేకుండా తమ కన్నా పెద్దవాళ్లతో కూడా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్లూ ఉంటారు. అయితే ఒకే స్కూల్‌లో, ఒకే క్లాస్‌లో చదువుతున్న పిల్లల మధ్య ఉన్న స్నేహం వారి అభ్యున్నతికి మరింత బాగా సహకరిస్తుందంటున్నారు

కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా విట్‌కోవ్. స్కూల్‌కి సంబంధించిన పనులు, హోమ్‌వర్క్, పాఠాల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, టీచర్లు చేయించే యాక్టివిటీస్.... ఇలా వీళ్లకి ఒకే రకమైన లక్ష్యాలు, ఇబ్బందులు ఉంటాయి. వీరంతా ఒకే రక మైన వాతావరణంలో పెరగడం, చదువుకోవడం వల్ల ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకోగలుగుతారు.

సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. కంప్లీట్ చేయాల్సిన పనులు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కాబట్టి చదువులో ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం సులువవుతుంది. వారి మిత్రబృందంలో సభ్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతారు.

అందరికీ ఒకే సమస్య రావడం వల్ల దాని గురించి అందరూ చర్చిస్తారు. అలాంటి చర్చల వల్ల పిల్లల మానసిక పరిణతి పెరుగుతుంది. సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం అలవడుతుంది. చదువులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. తద్వారా ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు.

అందుకే ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం ఉండొద్దని పిల్లల్ని గిరిగీసి కూర్చోపెట్టవద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. సో! ఇకనుంచీ మీరు కూడా మీ పిల్లల స్నేహాన్ని ప్రోత్సహించండి. అలాగని చెడ్డ స్నేహాలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండండి మరి.

Monday, October 25, 2010

' అబద్ధం ' చాలా చిన్న బలమైన పదం.

అబద్ధం...నేటి నిజం!

అబద్ధం చెప్పటం కొందరికి ప్రాణావసరం. మరి కొందరికి సరదా. ఇంకొందరికి ఒక జీవన విధానం. తరచి చూస్తే- మన చుట్టూ అనేక అబద్ధాలు. రోజూ వీటిలోనే మనం బతుకుతూ ఉంటాం. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వ్యక్తి ఎవరూ ఉండరు. అసలు మనం ఎందుకు అబద్ధం చెబుతాం? దానికి కారణాలేమిటి? ఈ విషయాలను డోరతి రో- 'వై వుయ్ లై' అనే పుస్తకంలో కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు.


"అవతల వ్యక్తులను మోసం చేయటానికి ఉపయోగించే పదాలను కాని, చర్యలను కాని అబద్ధాలు అని మనం పిలుస్తాం. చాలా సార్లు మనం ఇతరులకు వాస్తవం చెప్పం. అబద్ధం చెబుతాం. కొన్ని సార్లు మనకు మనమే అబద్ధం చెప్పుకుంటాం. అబద్ధం అనే పదం చాలా చిన్నదే. కాని ఇది చాలా బలమైన పదం.


ప్రయోగిస్తే మనసులోకి సూటిగా దిగుతుంది. అందుకే ఎక్కువ మంది ఈ పదాన్ని ఉపయోగించటానికి ఇష్టపడరు. భాషాపరంగా చూస్తే అబద్ధానికి కచ్చితమైన అర్థం ఏదీ లేదు. వివిధ సమాజాల్లో దీనిని విభిన్నరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక సారి రోమ్ విశ్వవిద్యాలయంలో ఫెరారీ కంపెనీ ప్రెసిడెంట్, ఫియట్ కంపెనీ ఛైర్మన్ ల్యూకా కార్డిరో-మోంటిజీమోలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. "నేను స్కూల్లో ఉన్నప్పుడు కాపీ చేయటంలో ప్రపంచ ఛాంపియన్‌నని చెప్పొచ్చు.


ఈ విషయంలో నాకు ఎవరూ పోటీ ఉండేవారు కాదు. తెలివైన వారి పక్కన కూర్చోవటానికి ఏదో ఒక మార్గం వెతికేవాడిని. వారి దగ్గర కూర్చుని అంతా కాపీ కొట్టేవాడిని'' అని ల్యూకా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఈ అంశం గురించి ఫ్రాంక్స్ ఎక్స్ రోకా అనే పాత్రికేయుడు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక వ్యాసం రాశాడు. 'అమెరికాలో విద్యార్థులు ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి ఉపయోగించుకుంటూ ఉండొచ్చు.


కాని పక్క విద్యార్థుల నుంచి కాపీ కొట్టి.. దానిని తమ సొంత ప్రతిభగా ప్రదర్శించుకోరు. ఇది చాలా గర్హించదగ్గ విషయం''అని ఆ వ్యాసంలో వ్యాఖ్యానించాడు. అంతేకాదు 'ఇటలీలో కాపీ చేయటాన్ని ఒకరి పట్ల విశ్వాసానికి, విద్యార్థుల మధ్య బంధానికి చిహ్నంగా భావిస్తూ ఉండొచ్చు. చాలాసార్లు మోసగాళ్లు జీవితంలో పైమెట్టు ఎక్కలేకపోవచ్చు


. కానీ కాపీరాయుళ్ల మాత్రం పైకి వస్తారనటానికి నిదర్శనాలు ఉన్నాయి' అని ల్యూకాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం లేపాయి. ఇటలీకి చెందిన అనేకమంది మేధావులు ఈ వ్యాఖ్యలను ఖండించారు...


ఎందుకు?
అబద్ధం ఆడి తప్పించుకు పోవచ్చని చాలామంది భావిస్తూ ఉంటారు. చాలా మందికి ఈ అలవాటు చిన్నప్పుడే అబ్బుతుంది. కొందరు చెప్పే అబద్ధాలు ఇట్టే తెలిసిపోతాయి. అవి అబద్ధాలని మనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం- మనకు మనం అబద్ధం చెప్పుకోవటం.


ముందుగా ఒక విషయాన్ని నిజమని నమ్మటం మొదలుపెట్టి దానిని ఇతరులకు చెప్పటం మొదలుపెడతారు. అది బయటకు వస్తుందేమోననే భయంతో- వాస్తవాన్ని కప్పిపుచ్చటానికి మరొక అబద్ధం చెబుతారు. అది అబద్ధమనే అనుమానం రాకుండా ఉండటానికి ఇంకొకటి చెబుతారు. ఇలా ఒక వలను అల్లుతారు.


కొందరు మంచి పని చేయటం కోసం అబద్ధం చెప్పామనో.. ఒక ఉన్నతమైన విలువను కాపాడటం కోసం అబద్ధం చెప్పామనో కూడా చెబుతూ ఉంటారు. కాని చాలాసార్లు అవతల వ్యక్తులు వీటిని గుర్తిస్తారు.అయినా భయం వల్లనో, గౌరవం వల్లనో బయటకు చెప్పరు.


మౌనమే నీ భాష..
కుటుంబ జీవితం ఒక పెద్ద అబద్ధాల పుట్ట. అయితే కొందరు చాలాసార్లు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతారు. అలాంటి సమయాల్లో మౌనమే పెద్ద ఆయుధంగా మారుతుంది. "ఎంత తక్కువ మాట్లాడితే- పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి'' అనే సిద్ధాంతాన్ని కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.


సాధారణంగా కుటుంబంలో అతి శక్తివంతమైన వ్యక్తి అబద్ధాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు- మౌనాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మా ఇంట్లో మా అమ్మకు ఏదైనా విషయం చెప్పటం ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండిపోతుంది.


నన్ను ఏదైనా విషయంలో శిక్షించాలన్నా.. నేను విమర్శలు చేస్తున్నప్పుడు అడ్డుకోవాలన్నా ఆమె ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. మా ఇంటికి సంబంధించిన చాలా రహస్యాలు ఇప్పటికీ నాకు తెలియదు. ఎప్పుడైనా రహస్యాల వైపు సంభాషణలు మళ్లినప్పుడు- అమ్మ మౌనం వహిస్తుంది. కొన్నిసార్లు అబద్ధం కూడా చెబుతుంది. ఆ విషయం ఆమెకు కూడా స్పష్టంగా తెలుసు.


'పిల్లలకు అన్ని చెప్పలేం కాబట్టి అబద్ధం చెప్పినా పర్వాలేదు' అని ఆమె నమ్ముతుంది... ఎవరికైనా చెప్పవచ్చు కానీ..
మనకు మనం అబద్ధాలు చెప్పుకోవటం మొదలుపెట్టినప్పుడు వాస్తవానికి దూరంగా జరిగిపోవటం మొదలుపెడతాం. తెలియకుండానే కళ్లకు గంతలు కట్టేసుకుంటాం. "కొందరికి కొంత కాలం పాటు మనం అబద్ధాలు చెప్పవచ్చు. కాని ఆ తర్వాత అది సాధ్యం కాదు. అయితే మనకు మనం ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూ బతికేయవచ్చు'' అంటాడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిమన్ హోగర్ట్.


కొత్త జీవులను కనుక్కోవటానికి జీవ శాస్త్రవేత్త తన అధ్యయనాలను కొనసాగించవచ్చు. కొత్త రసాయనాలను కనుగొనటానికి రసాయన శాస్త్రవేత్త పరిశోధనలు చేయవచ్చు. కాని మనుషుల్లో కొత్త రకం ప్రవర్తనను కనిపెట్టడం చాలా కష్టం. మన చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాని మనం మాత్రం తరతరాలుగా ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం...


మనకు తెలుసు..
అబద్ధం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ప్రతిరోజూ మనకు అనేక మంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటంలో వ్యక్తులు, సంస్థలు అనే తేడా కూడా ఏమీ లేదు. చాలాసార్లు ఇలాంటి అబద్ధాల వలన మనకు హాని కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం- ప్రతి కంపెనీ తన వార్షిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.


కంపెనీ సైజు పెరిగే కొద్దీ వార్షిక నివేదిక కూడా ఆకర్షణీయంగా తయారవుతూ ఉంటుంది. దీనిలో షేర్‌హోలర్డ్స్‌ను ఆకట్టుకొనే అంశాలెన్నో ఉంటాయి. ఈ నివేదికలు చదవటానికి చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అయితే ఈ భాష వెనక అనేక అబద్ధాలను కప్పిపెడతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం.


2007వ సంవత్సరపు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ వార్షిక నివేదికను 2008, ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేశారు. "రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ (ఆర్‌బీఎస్) చాలా బాధ్యతాయుతమైన కంపెనీ. మా అధ్యయనాల ఆధారంగా షేర్‌హోల్డర్స్‌కు లాభదాయకమైన వాటిని ఎంపిక చేస్తాము..'' అని ఉంది. కాని ఆ ఏడాది షేర్ హోల్డర్స్‌కు తెలియకుండా ఆ బ్యాంకు రిస్కుతో కూడిన అనేక పెట్టుబడులు పెట్టింది.


చివరకు బ్యాంకు దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం సాయంతో తిరిగి కోలుకుంది. దీని ఆధారంగా చూస్తే- సాధారణంగా ఇలాంటి నివేదికల్లో బయటకు చెప్పేది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొకటి ఉంటుందని తేలుతుంది. 
వై వుయ్ లై
రచయిత్రి: డోరతి రో
ప్రచురణ: ఫోర్త్ ఎస్టేట్, లండన్
ధర: రూ. 350
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోను దొరుకుతుంది

Sunday, October 24, 2010

పట్టు దలే పేట్టుబడి...


 గమనించారో లేదో, సాధారణ వ్యక్తుల అసాధారణ విజయాల ద్వారా కేవలం వారికి సుఖ సంతోషాలే కాదు, మానవ కళ్యాణం కూడా జరుగుతూ వస్తుంది. ఫోర్డు కల సాకారమై మనకి కార్లు, రోడ్లు.ఎడిసన్ కలలు సాకారమై మనకో కొత్త ప్రపంచం, సరికొత్త జీవితం. స్వామినాథన్ గమ్యాల సాకారంతో మనదేశంలో హరిత విప్లవం. రైట్ బ్రదర్స్ కలలు నిజమై మానవ జాతికి రెక్కలొచ్చినాయి.ధీరూభాయ్ ధర్మమా అని మన లోని కొన్ని లక్షల మంది సామాన్యులకు మనమూ విజేతలవగలమనే స్ఫూర్తి, ధైర్యం వచ్చినాయి.ఇలా అందరి సొంత విజయాలు వారికే పరిమితం కాకుండా మన జీవితాల్లో కూడా పెనుమార్పులు తెచ్చినాయి. నిజానికి వీరెవ్వరూ మానవజాతి కళ్యాణానికి నడుంబిగించి రంగ ప్రవేశం చేయలేదు. తమ కలలను.. జీవించాలనే తపనతో కార్యోన్ముఖులైనారు.

ఫలితమేమిటంటే వారి విజయాలు మానవ విజయాలుగా మారినాయి. గొప్ప విషయం కదా ! ఈకోవకు చెందిన మరో వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు. మనందరికి ఎంతో మాన్యుడు, స్ఫూర్తిదాత. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి. ఆయన ఎవరో కాదు మన అబ్డుల్ కలామ్ గారు.బాల్యంలో కూటికి, గుడ్డకి, స్కూలు ఫీజుకి అన్నింటికీ అనునిత్యం యుద్ధం. ఓర్పు, చిరునవ్వు, స్వశక్తిపై, తన కలలు గమ్యాలపై అపారమైన నమ్మకం. ఇవే కాక ఎంతో పాజిటివ్ థృక్పధం. జీవన పోరాటంలో ఇవీ ఆయన ఆయుధాలు. ఫలితంగా విజయ పరంపర. భారత్‌లోని అత్యున్నత పురస్కారం భారతరత్న తన సొంతం చేసుకున్న మహోన్నతుడు...రాకెట్ సైన్సులో అసామాన్యమైన ప్రతిభ కనబరిచి. అంతటితో ఆయన విజయ ప్రస్థానం ఆగలేదు. మన దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉత్త రాష్ట్రపతి కాదు.. మనందరం ఎంతో అభిమానించి, ప్రేమించి, గౌరవించిన రాష్ట్రపతిగా. మనదేశ చరిత్రలో అంతటి ప్రేమాభిమానాలు పొందిన మరో రాష్ట్రపతి లేడంటే అతిశయోక్తి కాదేమో !అబ్దుల్ కలామ్ గారు నావలను నిర్మించే జైనుల్లాబుద్దీన్ కుమారుడు. రామేశ్వరం సొంత ఊరు. బీద కుటుంబం అయినప్పటికి తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆ బీదరికపు బాధలను మరుగుపర్చాయి.

కలాంలో మేలైన భావసంపద, మంచి చెడుల గురించి అవగాహన, సద్భుద్ధి, పరోపకారం, సద్భుద్ధులను, జ్ఞానఖనిని తల్లిదండ్రులు ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ జ్ఞాన ఖనే తన స్వ గ్రామంలోని మాస్క్ స్ట్రీట్ నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దాకా నడిపించింది.సామాన్యంగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు అపారమైన సంపద తరతరాలకి సరిపడా డబ్బుదస్కాలు వదిలి వెళ్లాలనుకుంటారు కాని ఎందరు తల్లిదండ్రులు సద్భుద్ధి, జ్ఞాన సంపద పరోపకారం లాంటి గుణగణాలను తమ పిల్లలకు తమ వారసత్వంగా ఇస్తారో ఆలోచించాల్సిన విషయమే!! ముఖ్యంగా నేటి కాలమాన పరిస్థితుల్లో సంపదే సర్వస్వంగా భావించే నేటి సమాజంలో దానిని పొందేందుకై అన్ని అడ్డదారులు బాహాటంగా తొక్కే తల్లిదండ్రులకు భావి కలామ్ ఎలా లభిస్తారు ? మరి దేశం మాటేమిటి ?? కలామ్ గారికి చిన్నప్పటి నుంచి ఒక గొప్ప కల ఉండేది. నేడు మనలాంటి వారికి అదో సర్వసామాన్య కలలా గోచరించవచ్చు. కాని దేశపుటంచున ఒక కుగ్రామంలో బీదరికంలో కొట్టుమిట్టాడుతూ, దినపత్రికలు అమ్మే కుర్రవానికి. తానో పైలట్ కావాలనుకోవటం చాలా పెద్ద కలే కదా !!

సముద్రపుటొడ్డున నిలిచి, ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులను చూస్తూ. ఏదో ఒకనాడు తనూ అలా ఎగరాలనే కలలు కనేవాడు కలామ్. ఈ కలలే ఆయన భావి జీవితానికి మార్గదర్శకాలైనాయి. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు కలామ్. ఇదంత సులభంగా జరగలేదు. తన సోదరి బంగారు నగలు ఆయన చదువుకి పెట్టుబడిగా మారాయి. డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉండేదంటే మాంసాహారం నుంచి పూర్తి శాకాహారానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే లక్ష్మీ కటాక్షం తర్వాత కూడా పూర్తి శాకాహారిగా, ధూమ మద్యపానాలకు దూరంగా ఉండి పోయాడు కలామ్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ లభించినా ఆకాశయానం కోరిక తీరలేదు. తనకెంతో ఇష్టం, జీవిత గమ్యమైన ఎయిర్‌ఫోర్సు పైలట్ ఉద్యోగం లభించలేదు. నిరాశ నిస్పృహలతో రిషికేష్ వెళ్లాడు కలామ్. అక్కడేమైన జవాబులు దొరుకుతాయేమోననే ఆలోచనతో. అక్కడ ఒక ఆశ్రమంలో స్వామి శివానంద బోధించిన బోధ తనెప్పుడు మరువలేనిది.

"ఏవైనా కోరికలు హృదయాంతరాల్లో జనించినవైతే అవి నిర్మలంగాను, ఎంతో బలమైనవిగాను ఉంటే, వాటికి ఎంతో గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతిరాత్రి ప్రకృతిలో పయనించి, తిరిగి ఉదయం జాగృతమైన మెదడులోకి ప్రవేశిస్తుంది. కాస్మిక్ తరంగాలతో ఎంతో బలోపేతమై.. ఈ ప్రక్రియ వల్ల మన కోరికలు సాకారమవుతాయి. ఇది నిత్యం. ఇది సత్యం కనుక నీ విషయంలో కూడా నీ కోరికలు నెరవేరుతాయి... తప్పకుండా.. ఎంత తప్పకుండా అంటే.. ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా ప్రతి ఏడు వచ్చే వసంత కాలంలా...''

దీన్నే మరో విధంగా చెప్పాడు వాల్ట్ డిస్నీ మహాశయుడు.. "నీ కంటూ కలలుంటే, అవి తప్పక నెరవేరుతాయని..'' కుదుటపడ్డ మనసుతో తిరిగి వచ్చిన కలామ్, 1958 వ సంవత్సరంలో భారత డిఫెన్స్ మినిస్ట్రీలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా చేరాడు. నెలకి 250 రూపాయల వేతనం. నేడు ఈ మొత్తానికి ఏమంత విలువ లేనప్పటికీ ఆరోజుల్లో అది మంచి వేతనమే. తాను ఎంతగానో కాంక్షించిన ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం పొందలేకపోయినప్పటికి దానికి సంబంధించిన శాఖలోనే పనిచేస్తున్నందుకు కాస్తో కూస్తో తృప్తిగా ఉండేది కలామ్‌కి.. అక్కణ్ణుంచి కలామ్ జీవితం ఎక్కలేని ఎత్తుల్లేవు.. ఎగరలేని ఆకాశపుటంచుల్లేవు. భారత దేశపు మొట్టమొదటి స్పేస్ మిషన్ టీమ్‌లో ఒక సభ్యుడు కలామ్. రాకెట్ నిర్మాణంలో ప్రావీణ్యుడు.

ఆనాడు రుషికేష్‌లో స్వామి శివానంద్ ప్రవచనం భవిష్య వాణి నిజమైనాయి. కలామ్ కలలు, కోరికలు సత్యమైనవి. ఆయన హృదయాంతరాళం నుంచి బయలుదేరినవి. వీటిని ప్రకృతి, పంచభూతాలు దీవించి అవి సాకారమయ్యే దిశగా కలామ్‌ని నడిపించినాయి. కలామ్ నేతృత్వంలో రూపుదిద్దుకొన్న భారత్ గైడెడ్ మిసైల్ ప్రొగ్రామ్ మనదేశానికి శక్తిని గౌరవ మర్యాదలే కాకుండా కలామ్‌కి ఎంతో పేరు ప్రతిష్టలనార్జించినాయి. అత్యున్నత పదవి, అత్యున్నత పురస్కారం, ప్రజల గుండెల్లో అపారమైన ప్రేమాభిమానాలు. ఎక్కడ రామేశ్వరంలోని అతి బీద కుర్రవాడు..! ఎక్కడ భారత దేశపు రాష్ట్రపతిగా, భారత రత్నగా వెలుగొందిన డాక్టర్ అబ్దుల్ కలామ్..!! ఒకే జీవితం. కలలని, గమ్యాలను బట్టి సాగే జీవన యానం. మన కలామ్ గారి జీవిత కథ, జీవన యాత్ర మనను ఉత్తేజ పరిచి, కొందరినైనా ఆకాశపు అంచులను తాకేలా ప్రోత్సహిస్తుందా???

మన తల్లిదండ్రుల ద్వారా మనం పొందిన పెంపకం, మనం పుణికి తెచ్చుకున్న విలువలు, సంస్కారం మీద ఆధారపడ్డ విషయం ఇది. కేవలం ధనార్జన కోసమే జీవితాన్ని అడ్డదారులు తొక్కించకుండా, సన్మార్గంలో, మంచి విలువలతో కూడా పేరు ప్రఖ్యాతులు, వాటితో పాటు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. మన జీవిత కాలంలోనే. ఇది సాధ్యమే. మనందరికీ అందుబాటులో ఉన్న మార్గమనేనని పదేపదే చెప్పేవే. మనం గత 12 వారాలుగా ముచ్చటించుకుంటున్న జీవిత గాథలన్నీ. పెద్ద పెద్ద కలలు కనటం, వాటిని జీవిత గమ్యాలుగా మార్చుకోవటంతో నే ఇటువంటి ప్రస్థానం మొదలయ్యేది.

"ఏవైనా కోరికలు హృదయాంతరాల్లో జనించినవైతే అవి నిర్మలంగాను, ఎంతో బలమైనవిగాను ఉంటే, వాటికి ఎంతో గొప్ప విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతిరాత్రి ప్రకృతిలో పయనించి, తిరిగి ఉదయం జాగృతమైన మెదడులోకి ప్రవేశిస్తుంది''. 
- ఎజి కృష్ణమూర్తి

Tuesday, October 5, 2010

అరవై అంటే నలభై... * శోభా ఎట్ సిక్స్‌టి. అరవై ఏళ్లు దాటిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ఈ పుస్తకం.

అంతర్జాతీయంగా మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఇంగ్లిషు రచయిత్రులలో శోభా డే ఒకరు. మోడల్‌గా, ఎడిటర్‌గా, కాలమిస్ట్‌గా, రచయితగా- విశేష అనుభవం గడించిన శోభా డే రాసిన తాజా పుస్తకం- శోభా ఎట్ సిక్స్‌టి. అరవై ఏళ్లు దాటిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీనిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు....

"నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు- ఎప్పుడో ఒకప్పుడు నాకు కూడా అరవై ఏళ్లు వస్తాయని ఊహించలేదు.
అది దాదాపు అసాధ్యమైన విషయం అనుకున్నా. 60 ఏళ్లు.. అంటే ముసలి అయిపోయినట్లే.. చనిపోవచ్చు కూడా.. అయితే 60 అంకె నన్ను ఎప్పుడూ భయపెట్టలేదు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఆ ఆలోచనే ఎప్పుడూ రాలేదు. నా బుర్రలో మిగిలిన విషయాలు ఉండేవి తప్ప- వార్థక్యం గురించి ఎప్పుడైనా ఆలోచించలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

పదాహారేళ్లు ఉన్నప్పుడు ఇరవై వచ్చిన వాళ్లు కూడా వయస్సు మీద పడినట్లు కనిపిస్తారు. మరి అరవై ఏళ్లు వచ్చినప్పుడు? అని మీరు అడగవచ్చు. నా వరకూ- 60 ఏళ్లు రావటం భయంకరమైన అనుభవం కాదు. ఒక విధంగా చూస్తే చాలా సంతృప్తినిచ్చే విషయం.

అరవై ఏళ్లు వచ్చినప్పుడు- నేను ఆనందపడ్డానని మాత్రం చెప్పను. అలాగని నిరాశ, నిస్పృహలు మాత్రం చెందలేదు. కొంత ప్రశాంతంగా అనిపించింది. నేను సీనియర్ సిటిజన్ అనే భావన నాలో వచ్చి చేరింది. ఇంకా నా తల మీద బోలెడంత జుట్టు ఉంది (ప్రతి ఇరవై రోజులకు ఒక సారి రంగు వేసుకుంటా.. కాని అది వేరే సంగతి). నా ముప్ఫై రెండు పళ్లకి వచ్చిన ఢోకా లేదు

. కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో కొద్ది భాగాన్ని గుండెపోటు రాకుండానే ఎక్కగలిగాను. నా కళ్ల చుట్ట్టూ వలయాలు, మొహం మీద, మెడ మీద ముడతలు పడిఉండచ్చు. అయితే ఏంటి? ఈ ఆలోచన రాగానే నాకు నవ్వొచ్చింది. నా మూడ్ మారింది. "ఎప్పుడూ నవ్వుతూనే ఉండు..ఇది జీవితంలో మరో అధ్యాయం. దీనిని ఎలా నడుపుతావనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది

సమాజంలో ఉన్న కట్టుబాట్లు, ఇతర అంశాలకు తల వంచితే- భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుంది. నిన్ను నువ్వు సానుకూల దృక్పథంతో చూసుకుంటే- పరిస్థితులు మెరుగుగా ఉంటాయి..'' అని నాకు నేనే భరోసా ఇచ్చుకున్నా. ఈ భరోసా నా ఒక్కదానికి మాత్రమే కాదు. నా వయస్సులో ఉన్న మహిళలందరికి కూడా. నిరాశ చెందాల్సిన అవసరమేమీ లేదు.

"అరవై అంటే నలభై..'' అని గట్టిగా అనుకున్నా. చాలామంది మహిళలకు వయస్సు ఒక పెద్ద ఉచ్చు. వయస్సు మీద పడిన మహిళలను మన సమాజం చాలా ఘోరంగా చూస్తుంది. పురుషులకు ఈ సమస్య ఉండదు. ఒక మహిళ విలువను మనం ఆమె రూపురేఖల ఆధారంగా నిర్ధారిస్తాం.ఈ ప్రయాణం ఆధారంగా చూస్తే అరవై ఏళ్ల మహిళకు ఉండే విలువ తక్కువ.

ఇటీవల కాలంలో ఇరవై ఐదేళ్లు ఉన్న మహిళలు కూడా వయస్సు మీదపడటం వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. "మీకేం సమస్యలున్నాయి?'' అని వాళ్లని అడిగా. జుట్టు రాలిపోవటం, కళ్ల చుట్టూ వలయాలు, చలాకీగా ఉండలేకపోవటం, పొట్ట- ఇలాంటి సమస్యలు చెప్పారు. వాళ్లు చెబుతున్న మాటలను నేను నమ్మలేకపోయాను. నా కళ్లకు వాళ్లు అప్సరసల్లా కనిపిస్తున్నారు.

మరి వారు తమ గురించి తాము అంత తక్కువగా ఎందుకు అనుకుంటున్నారు? బహుశా- ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే వివిధ రంగాల్లో విజయం సాధిస్తున్న వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. అందువల్ల 25 ఏళ్లు ఉన్నవారు కూడా మధ్యవయస్కుల్లా మధనపడుతూ ఉండచ్చు.

"సిగ్గు పడకుండా, జీవితాన్ని అనుభవించండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే సమయం ఇదే. ప్రతి వారానికి ఒక సెక్స్ బ్రేక్ తీసుకోండి. దానిని రొమాంటిక్‌గా, మరిచిపోలేని అనుభవంగా మార్చుకోండి..''
సెక్స్‌ను ఆనందించండి...
మన సంస్కృతి సంప్రదాయాల పరంగా చూస్తే- వృద్ధులకు శృంగార వాంఛలు ఉండకూడదు. శృంగార ఆలోచనలను దరిచేరనివ్వకూడదు. సెక్స్‌ను మనం పునరుత్పత్తికి సాధనంగా మాత్రమే చూస్తాం. దానిని ఒక అందమైన అనుభవంగా పరిగణించం. పిల్లలు పుట్టిన తర్వాత ( అంటే పునరుత్పత్తి తర్వాత) శృంగార వాంఛలను తగ్గించుకోవాలని చెబుతారు.

ఇది నా దృష్టిలో చాలా పొరపాటు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం, శృంగారం పట్ల ఒక సానుకూలవైఖరి ఉన్నంత కాలం, సమాజంలో కట్టుబాటు కుంగదీయనంత కాలం- 60వ దశకంలో కూడా ఆనందంగానే గడపవచ్చు. అర్థం చేసుకొని ఆనందించే భార్య లేక భర్త ఉంటే ఇంకా మంచిది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నవారైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ఒకరి శారీరక, మానసిక అవసరాలు మరొకరికి తెలియటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. అంతే కాకుండా శృంగారంలో తాను ధీరుడినని రుజువు చేసుకోవాల్సిన అవసరం భర్తకు కాని.. తాను భర్తను అన్ని విధాలుగా సుఖపెట్టలేకపోతున్న భావన భార్యకు కాని ఉండదు. అందువల్ల ఎటువంటి ఆందోళన లేకుండా ఆనందించటానికి ఈ వయస్సు పనికొస్తుంది. నాకు తెలిసిన కొందరు దంపతులు- పెళ్లైన కొత్తలో కన్నా- 50 ఏళ్లు దాటిన తర్వాతే శృంగారంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నామని చెబుతూ ఉంటారు.

చాలాసార్లు రుతుక్రమం ఆగిపోయిన తర్వాత- మహిళలు తమలో ఉన్న శృంగారభావనలను వెలికి తీయగలుగుతారు. గర్భం వస్తుందనే భయం లేకపోవటం వల్ల శృంగార అనుభూతులను ఆనందించగలుగుతారు. ఎక్కువ మందితో సంబంధాలు లేని దంపతులు- అరవై, డెబ్బైలలోనే ఎక్కువగా శృంగార భావనలను అనుభవించగలుగుతారని, ఆరోగ్యంగా కూడా ఉంటారని సర్వేలు చెబుతున్నాయి

అయితే ఈ వయస్సులో ఉన్నవారికి- "మన పిల్లలు చూస్తే ఎలా భావిస్తారు? మనవలు ఎలా ఫీల్ అవుతారు? ఈ వయస్సులో సెక్స్ కోర్కెలు కలగడం అసహజం కదా..'' వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈ వయస్సులో ఉన్నవారికి ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది.

రోజూ ఏదో ఒక పని కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండవు. అయితే భార్యాభర్తల్లో శారీరకంగా అనేక మార్పులు వచ్చి ఉండచ్చు. భార్యలు పెళ్లిఅయిన కొత్తలో ఉన్నంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. భర్తలకు బట్టతలలు వచ్చి ఉండచ్చు. అయినా దంపతుల మధ్య ప్రేమ ఉంటే- అది ఈ లోపాలన్నింటిని కప్పివేస్తుంది.

సంప్రదాయానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే సమాజాలు వృద్ధుల్లో సెక్స్ వాంఛలను హర్షించవు. వారికి అటువంటి భావనలు కలుగుతున్నాయనే విషయాన్నే తట్టుకోలేవు. అయితే- ఆ వయస్సులో సెక్స్ వాంఛలు ఎందుకు ఉండకూడదు? మనవలు పుట్టినంత మాత్రాన వారిలో వాంఛలు ఇంకిపోవాలా? పాశ్చాత్య సమాజాలు ఈ విషయం మీద భిన్నంగా ఆలోచిస్తాయి

. అక్కడ ఇతరులకు సంబంధించిన అంశాలపై జడ్జిమెంట్స్ ఇవ్వరు. ఒక వేళ వృద్ధులు సెక్స్‌ను అనుభవిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో ఈ విషయం గురించి మాట్లాడటానికే ఎవరూ ఇష్టపడరు. ప్రస్తుతం మనమున్న సమాజంలో పిల్లలకు పెళ్లిళ్లు అయిన తర్వాత- మహిళలు సెక్స్‌కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడితే చిత్రంగా చూస్తారు. పురుషులు మాట్లాడితే- వారిని కామ వాంఛితులుగా ముద్రవేస్తారు.

అయితే సమాజం ఏదో అనుకుంటుందని మధురమైన అనుభూతులను వదులుకోవటం సరైనది కాదు. కొందరు మహిళలకు నిజంగానే సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవచ్చు. అలాంటి వారి భావనలను కూడా మనం గౌరవించాలి....

నేను పైన చెప్పిన అనుభవాలను కోల్పోతున్నామనే భావన ఉన్నవారికి మాత్రం నేను ఇచ్చే సలహా ఒకటే. సిగ్గు పడకుండా, జీవితాన్ని అనుభవించండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే సమయం ఇదే. ప్రతి వారానికి ఒక సెక్స్ బ్రేక్ తీసుకోండి. దానిని రొమాంటిక్‌గా, మరిచిపోలేని అనుభవాలుగా మార్చుకోండి..

Monday, October 4, 2010

ఆ తబలా కుర్రాడు * Child Tabla Show at CWG 2010 Delhi

ఆదివారం ఢిల్లీలో కామన్‌వెల్త్‌గేమ్స్ ప్రారంభోత్సవంలో అందరినీ ఆకర్షించిన దృశ్యం ఏమిటో మనందరికీ తెలుసు. రింగు రింగుల జుట్టుతో తబలా వాయించిన ఏడేళ్ల బుడతడు. అచ్చు తబలా విద్వాంసుడు జాకీర్‌హుస్సేన్‌లా జుట్టు ఊపుకుంటూ బుల్లి చేతులతో తబలా వాయిస్తుంటే క్రీడాభిమానులంతా ఆసక్తిగా తిలకించారు.

'ఎవరీ కుర్రాడు, భలే తమాషాగా వాయిస్తున్నాడే' అంటూ దేశవ్యాప్తంగా టీవీలలో కార్యక్రమం చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంకేముంది..? ఒక్క రోజులోనే మినీ సెలబ్రిటీ అయిపోయిన ఆ కుర్రాడి పేరు కేశవ్. పాండిచ్చేరికి దగ్గర్లోని ఆరవిల్లిలో ఉంటున్న కేశవ్ కుటుంబీకులంతా కళాకారులే.

తల్లిదండ్రులు గోపిక, ప్రఫుల్ల మహనుకర్. "పుట్టుకతోనే వాడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పాటలు, వాయిద్యాలు వినిపించినా సరే వినాలంటాడు. వాడు ఇప్పుడు రెండో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓ ప్రైవేటు ప్రోగ్రామ్‌లో తబలా ప్రదర్శన ఇచ్చాడు. ఇంత చిన్న వయసులోనే తబలా చాలా సహజంగా వాయిస్తున్నాడని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.

మాకు చాలా సంతోషమేసింది..'' అంటూ కేశవ్ తల్లి గోపిక మురిపెంగా చెప్పుకొచ్చారు. కామన్‌వెల్త్‌గేమ్స్ ప్రారంభోత్సవంలో "రిథమ్స్ ఆఫ్ ఇండియా'' పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న పలు వాయిద్యాలను ప్రదర్శించారు. "నేనొకసారి ఆరవిల్లికి వెళ్లినపుడు అక్కడ కేశవ్ ప్రోగ్రామ్ చూశాను. ఆ కుర్రాడి హావభావాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కామన్‌వెల్త్‌గేమ్స్‌లో ఈ కుర్రాడితో తబలా ప్రదర్శనపెడితేఎంతో బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.

వెంటనే ఎంపిక చేశాం. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవంలో కేశవ్ తబలా వాయిస్తుంటే దేశప్రజలందరూ ముచ్చటపడ్డారు...'' అని 'రిథమ్స్ ఆఫ్ ఇండియా క్రియేటివ్ హెడ్ చెప్పారు. కేశవ్‌కు సైకిల్ తొక్కడమన్నా, గిటార్ వాయించడమన్నా చాలా ఇష్టమట. 

Keshav Tabla 7 Year old Child Tabla Show at CWG 2010 Delhi | 

2nd Std Student

Child Prodigy Delights Spectators

He was selected to play by CWG creative head Bharat Bala; “It runs in the family,” says the boy's mother
Audiences across the country were charmed when they saw cherubic seven-year-old Keshav expertly drumming his fingers on the tabla with a wide grin on his face and bobbing his curly head with obvious enjoyment while performing at “Rhythms of India,” the opening event of the Commonwealth Games (CWG) opening ceremony here on Sunday.Latest Top News Videos Follow Us alagukanthavel.blogspot.com

video

Keshav stays in Auroville near Puducherry.

Selected by Bharat Bala

He was selected to play by CWG creative head Bharat Bala, who said: “I spotted him in a show at Auroville at Puducherry. I was conceiving ‘Rhythms of India,' the first item of the Commonwealth Games opening ceremony, when I saw him perform.

“The event had folk drummers from all over the country so I thought it would be interesting to have a boy perform alongside them.”

“He is a natural”

Keshav's mother Gopika said: “He is a natural. Besides, it runs in the family which has musicians and artists. Keshav is also the grandson of artist Prafulla Dahanukar.”

According to Ms. Gopika, her son performs as and when he feels like it and nobody forces him.

“We are aware of his talent, but we also want him to have a normal childhood.

“Music is something spontaneous for him and he performs with a lot of passion.”

The prodigy tabla player's first performance was in February this year when he played at a private gathering.

Keshav who is in Class II, enjoys cycling and playing the guitar as well.


Short clips of Keshava on the tabla in concert with Nadaka and Gopika - Hornby island BC May 2010

కలలను నిజంచేస్తూ వారికి గృహాన్ని నిర్మించి ఇవ్వడం ఓ గొప్ప అనుభూతి - దేవినా హేమ్‌ దేవ్‌..

పులిని అడవిలోనే చూడాలి 
సంపన్న కుటుంబంలో పుట్టిన దేవినా హేమ్‌ దేవ్‌.. చిన్నతనం నుండి తనకంటూ కొన్ని ప్రత్యేకతలను సంతరిం చుకుంది. ఇంట్లో వారందరూ గొప్ప గొప్ప వ్యాపారాల్లో వున్నా సరే ఎటువంటి అవగాహన లేని నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.ఇద్దరు పిల్లల తల్లి అయినా తన జీవితాన్ని సాహసవంతంగా గడిపేందుకు మక్కువ చూపు తోంది. బిజినెస్‌, పిల్లలు, కుటుంబం వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూనే తన అభిరుచులన్నిటికీ సమయం కేటాయించు కుంటోంది. ఓ మహిళగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇతర అభిరుచులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న దేవినా గురించి...
కుటుంబ నేపథ్యం...
devinaకుటుంబంలోని అందరూ పెద్ద పెద్ద వ్యాపారా నిర్వహణలో వున్నారు. దేవినా తండ్రి ‘బ్యాండ్‌ బాక్స్‌’ను 1968లో స్థాపించారు. నేడు అది ప్రముఖ సంస్థగా వెలుగొందుతోంది. కానీ దేవినా మాత్రం వారసత్వంగా వచ్చిన సంస్థ నిర్వహణా బాధ్యతలను వదలుకుంది. తనకు ఇష్టమైన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.. ‘ఇంటిని డిజైన్‌ చేయడం అనేది ఒక గొప్ప కళ. అందరూ తమ కలల ఇంటిని చాలా గొప్పగా ఊహించుకుంటారు. అటువంటి కలలను నిజంచేస్తూ వారికి గృహాన్ని నిర్మించి ఇవ్వడం ఓ గొప్ప అనుభూతి’ అని దేవినా చెబుతు న్నారు.

మొదటి అనుభవం నుండి...

మొదట నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఎన్నో చేదు అనుభవా లను ఎదుర్కొన్నారు. వాటి నుండి ఎన్నో విలువైన పాఠాలు కూడా నేర్చుకు న్నారు. ‘ప్రారంభించడమే కాదు వాటికి సంబంధించి అన్ని బాధ్యతలను చూసు కోవాలన్న విషయాన్ని నేను నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ఒక వెంచర్‌ను నిర్మించిన తర్వాత గ్రహించాను. ఇప్పుడు మెటీరియల్‌ దగ్గరి నుండి పూర్తయిన తర్వాత దానికి వేసే పెయింటింగ్‌ వరకు మొత్తం అన్నీ దగ్గరుండి చూసు కుంటున్నాను’ అని అంటోంది.

చిన్న స్థాయి నుండి...
దేవినా మొదట సిటీ వెలుపల తన నిర్మాణాలను చేపట్టి విజయం సాధించింది. అనంతరం పూర్తి స్థాయిలో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు నిర్ణయించు కుంది. ‘మొదటి నిర్మాణం పూర్తి అయిన తరువాత ఇక అపార్ట్‌మెంట్స్‌ నిర్మిం చాలని నిర్ణయం తీసుకున్నాను. సిటీలో కొంత భూమిని కొనుగోలు చేశాను.అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని మొదలు పెట్టేశాము. మధ్యలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలింది. ఏం చేయాలో తోచలేదు. కానీ నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు. నష్టపోకుండా వుండేందుకు వాటిని అమ్మకుండా సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌గా చేయా లని నిర్ణయించుకున్నాను’ అని తన బిజినెస్‌ సంబంధించి ఎదుర్కొన్న సంఘట నలను దేవినా గుర్తు చేసుకుంటారు.

నచ్చింది చేయడం...
దేవినా ప్రతి రోజూ యోగా, ధ్యానం చేస్తుంది. ఆనందంగా, ఆరోగ్యంగా వుండ టానిి ఇవి ఎంతో ముఖ్యం అని ఆమె చెబుతుంది. ఆమెకు సినిమాలు చూడ టం అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి రోజుకు మూడు సినిమాలు చూస్తారు. మరో సారి వారాల వరకు వాటి జోలికి వెళ్లరు. ఈ సందర్భంగా ఓ సారి జరిగిన సం ఘటనను ఆమె గుర్తుచేసుకుంటూ ‘కార్‌ పార్కింగ్‌ చేసి మాల్‌లో వుండే థియే టర్‌లోకి వెళ్లాను..వరుసగా మూడు సినిమాలు చూసి బయటికి వచ్చి కార్‌ పార్కింగ్‌ దగ్గరికి వెళ్లాను. అన్ని గంటలు వెళ్లి వుట్టి చేతులతో వస్తున్న నన్ను చూసి అక్కడి వాచ్‌మెచ్‌ విచిత్రంగా చూశాడు. చాలా నవ్వొ చ్చింది అతని స్థితికి’ అని నవ్వేస్తారు.

అయినా తన పనికి ఏ రోజూ ఆటంకం కలగనివ్వనని చెబుతున్నారు. ‘నా బాధ్య తలు నాకు తెలుసు..సినిమాలు చూసినా, ఏ పనీ చేయ కుండా ఆలోచిస్తూ వున్నా నా పనులన్నీ చేసేస్తాను.అన్నిట ికన్నా నాకు చాలా ముఖ్యమైంది నా కుటుంబం. ఆ తరు వాతే ఇంకేమైనా.. ఎక్కువ సమయం వారికే కేటాయిస్తాను. ఇక తరువాత నా బిజినెస్‌. నాకు ఇష్టం కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాను. దానికి కూడా తగినంత సమయం కేటా యిస్తాను. ఎన్ని పనులున్నా వాటన్నిటినీ సమన్వయం చేసు కోవడం చిన్నతనం నుండి మా ఇంట్లో వాళ్ళని చూసి నేర్చు కున్నాను’ అని దేవినా అంటున్నారు.

ఇతర వ్యాపకాలు...
దేవినా తన స్నేహితురాలితో కలిసి ఓ మేనేజ్‌మెంట్‌ ఫర్మ్‌ను కూడా నిర్వహిస్తోంది. దాని పేరు హోప్‌స్కాచ్‌. దీని ద్వారా చిన్నపిల్లల పుట్టినరోజుల వంటి కార్యక్రమాలను వీరు నిర్వ హిస్తారు.కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు, అతిథుల ను ఆహ్వానించడం వంటివన్నీ చూసుకుంటారు.‘ఓ తల్లిగా వుండటం వలన పిల్లలకు నచ్చిన విధంగా కార్యక్రమాలను నిర్వహించగలుగుతున్నా... ప్రస్తుతానికి చిన్న పిల్లలవి మాత్రమే చేస్తున్నాం.. తొందరలోనే అన్ని రకాల కార్య క్రమాలు నిర్వహించే స్థాయికి వెళ్లేందుకు ఆలోచిస్తున్నాము’ అని చెబుతున్నారు.
childrens
పులలను చూడటం అంటే ఇష్టం...
దేవినాకు చాలా ఇష్టమైనది పులలను దగ్గరి నుండి చూడటం.. వాటిని గమనించడం... అదీ జూలో కాదు... అడవిలో.. ట్రిప్‌లో భాగంగా దేవినా తన సోదరితో కలసి అభయారణ్యాల్లో ట్రెకింగ్‌కి వెళ్లారు. ఈ ట్రిప్‌ ఐదు రోజుల పాటు సాగించారు. అడవిలో అక్కడి స్థానిక గిరిజనుల సాయంతో వారు 15 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. చిరు త పులులను చాలా దగ్గరి నుండి చూడగలిగారు. ఇంకా ఎలుగుబంటి వంటి జంతువులను కూడా చూశారు. ‘అడవి లోపలికి వెళ్లేందుకు సరైన మార్గం కూడా లేదు. స్థానికులు ప్రమాదకరం అని చెప్పినా వెనక్కి వెళ్లాలని అనిపించలేదు. అక్కడి స్థానిక గిరిజన నాయకుడి సాయంతో మార్గం చేసు కుంటూ కాలా నడకన వెళ్లి చూశాం. ఎంతో అద్భుతం.. ఆ అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేను...’ అంటూ తన అను భవాలను ఆమె చెబుతోంది.

చిన్నతనం నుండి..
‘నాకు 12 సంవత్సరాల వయసు వున్నప్పుడు ఆఫ్రికా వెళ్లాం.. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా అడవి లో ట్రిప్‌ వేస్తుంటాం’ అని చెప్పారు. ‘అదే ఇప్పటికీ కొనసా గుతోంది. ఈ సంవత్సరం మా కుటుంబ సభ్యులందరం కలిసి రెండు ట్రిప్స్‌ వేశాం. ఒకటి బాందవ్‌ఘర్‌, రెండవది కబినీని చూశాం.వీటిలో భాగంగానే ట్రెకింగ్‌కి కూడా వెళ్లాం’ అని చెబుతున్నారు.

Sunday, October 3, 2010

గాడ్ అండ్ డెవిల్ * చైనా మహోన్నత విప్లవకారుడిగా, మహాసారథిగా, దుష్ట దైవాంశ సంభూతుడిగా అమరుడైన మావో జేడోంగ్ మనోగత చిత్రణ ...

చైనాలో రాజులు పోయాక మావో దేవుడయ్యాడు. జనచైనా వచ్చాక నిర్దయుడయ్యాడు. జనం కోసం ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ’, తన కోసం ‘కల్చరల్ రెవల్యూషన్’ తెచ్చాడన్న పేరుపడ్డాడు. అతడు మంచివాడయ్యాడు. చెడ్డవాడయ్యాడు. స్ర్తీలకు వంటింటి పొగగొట్టాలనుంచి విముక్తి ప్రసాదించాలన్నాడు. కఠిన నిర్ణయాలలో కారుణ్యం తగదన్నాడు. చైనా మహోన్నత విప్లవకారుడిగా, మహాసారథిగా, దుష్ట దైవాంశ సంభూతుడిగా అమరుడైన మావో జేడోంగ్ మనోగత చిత్రణే ఈ ‘నేను’!

పొలం నుంచి ఇంటికి వెళుతుంటే దారి మధ్య మసక వెలుగులో క్వింగ్ సామ్రాజ్యం మటి ్ట పెళ్లలై రాలిపడి వుంది!
‘‘పీడ విరగడైందిరా పిల్లోడా, మీ నాయనకు చెప్పు నేనిక పన్లోకి వెళ్లనని’’ - రైతు కూలీల గుంపులోంచి ఒక పెద్దాయన నా మీదికి మురిపెంగా పాలకంకి విసిరాడు.
గడ్డిమోపులు తలపై మోసుకుంటూ నా పక్కగా, నన్ను దాటి వెళుతున్న వారు - ‘హమ్మయ్య... బరువు దిగింది’ అని అనుకోవడం వారి నిట్టూర్పులతో కలిసి నాకు వినిపిస్తోంది. గిట్టల నుంచి రేగుతున్న గోరువెచ్చని గోధూళి... అలసిన ముఖాలను, మనసులలోని బాధల్ని కడిగేస్తోంది! చైనాలో రెండు వేల ఏళ్లకు పైగా కొనసాగిన ఎనిమిది రాజవంశాల పరంపరలోని క్వింగ్ పాలకుల వెన్నెముకలను - సాధారణ ప్రజలు, సిపాయిలు కలిసి గునపాలతో పెకిలించారట!!

అంటే... నేను మళ్లీ బడికి వెళ్లొచ్చా?
చదువుకున్న యువకులు దండ్లు దండ్లుగా వీధుల్లో చేరి ఊపుగా పాటలు పాడుతున్నారు. చిన్నారులను రెండు చేతులతో మృదువుగా పట్టి లేపి, గాలిలోకి విసిరి ‘జనచైనా వర్థిల్లాలి’ అని నినదిస్తున్నారు. వాళ్ల దగ్గర కాసేపు ఆగాను. డాక్టర్ సన్‌యత్‌సేన్ విప్లవ దళాలు... మంచూ వంశస్థుల సింహాసనాన్ని కాళ్లతో ఒక్క తోపు తోశాయట!
అంటే... ఇప్పుడు నేను మా ఊరు షావ్షాన్‌లోని చిన్నబడి నుంచి హునాన్ ప్రావిన్సు రాజధాని ఛాంఘ్షాలోని పెద్దబడికి వెళ్లి చదువుకోవచ్చా?
కవాతు గీతం వినిపిస్తోంది.
‘నీదే చైనా... నీదే చైనా... నీదే చైనా’’.
గూట్లో దాచిన పలకను తీసి, ఉమ్మితో శుభ్రంగా తుడిచి ముందు నా పేరు రాసుకున్నాను. తర్వాత నా బడి పేరు.
మావో సే టుంగ్, ఛాంఘ్షా సెకండరీ స్కూల్!

పిల్లలకు అన్నీ అప్పటికప్పుడు జరిగిపోవాలి. బహుశా ఆడవాళ్లకు కూడానేమో! పిల్లలు, స్త్రీలు అని ఏముంది? పరాధీనంలో ఉండేవారెవరైనా - పంజరం కదిలిన ప్రతిసారీ ఎవరో తలుపు తెరుస్తున్నారన్న ఆశతో రెక్కల్ని టపటపలాడించే పక్షుల్లా - తక్షణ స్వేచ్ఛను కోరుకుంటారు.

ఎరస్రైన్యం... శత్రుదేశాల గుండెలపై పన్నెండు వేల కిలోమీటర్ల దూరం ధడధడమని ‘లాంగ్‌మార్చ్’ జరిపి భూస్వామ్య కబంధనాల నుంచి రైతులను విడిపించినప్పుడు, చైనా విప్లవాన్ని కర్షకులు సారవంతం చేసినప్పుడు, ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ’ కోసం చైనా కమ్యూనిస్టు పార్టీ నడుము వంచినప్పుడు, ‘సాంస్కృతిక విప్లవం’ ఉవ్వెత్తున దేశాన్ని కుదిపినప్పుడు ... ఇలా చైనాలో జరిగిన ప్రతి మార్పులో, ప్రతి మలుపులో... చైనా మహిళ తన చేతిలోని గరిటెను విసిరి కొట్టేసినట్లు, ఉద్యోగం చేస్తున్నట్లు, నచ్చినవాడిని నిర్భయంగా పెళ్లి చేసుకుంటున్నట్లు విముక్తి కలలు కనే ఉంటుంది. నేనూ అలాగే ఛాంష్షూలోని పెద్దబడిని కలగన్నాను. నియంత పాలకుల నుంచి ప్రజలు, నియంత పెద్దల నుంచి పిల్లలు, నియంత భర్తల నుంచి స్ర్తీలు నిరంతరం స్వేచ్ఛను కాంక్షిస్తూనే ఉంటారు.

రివల్యూషనరీ ఆర్మీలో చేర్చడానికి స్కూళ్లకొచ్చి పెద్ద పిల్లల్ని తీసుకెళుతున్నారు. నేను ఛాంఘ్షా బడిలో ఉన్నాను. ‘‘నువ్వూ వెళ్లాలి సే టుంగ్. నవై చెనా ఆవిర్భావం కోసం నీ పలకా బలపాలను పక్కన పడేసి, కలుపును ఏరే పనిలో పడాలి’’ అన్నాడు నా తండ్రి. రాచరికపు అవశేషాలపై సన్‌యత్‌సేన్ నాయకత్వంలోని ‘కొమిటాంగ్’ పార్టీ ఆవిర్భవించడం వెనుక నేను బిగించిన పిడికిలి కూడా ఉందనుకుంటే ఎంత గర్వం!

ఐదేళ్ల తర్వాత మళ్లీ దేశంలోని విద్యార్థులంతా ఏకమయ్యారు. అప్పటికి నా డిగ్రీ పూర్తయింది. హ్యునాన్‌లోని ఫస్ట్ ప్రొవిన్షియల్ నార్మల్ స్కూల్ ప్రొఫెసర్ యాగ్ ఛాంగ్జీ తన వెంట నన్ను బీజింగ్ తీసుకెళ్ళారు. పెకింగ్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా ఆయనకు ఉద్యోగం వచ్చింది. అదే యూనివర్శిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా నాకూ ఉద్యోగం ఇప్పించారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. వర్సెయిల్స్ ఒప్పందం ప్రకారం - చైనాలో జర్మనీకి ఉన్న హక్కులను జపాన్‌కు మార్చే సమమయంలో దేశంలోని ఉడుకు నెత్తురు కుతకుతలాడింది. విద్యార్థులు పెద్ద ఉద్యమంగా పెకింగ్ చేరుకున్నారు. వారికి నగరాలలోని కార్మికులు తోడయ్యారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘‘కానీ ఏం లాభం? రాజకీయ పునరుజ్జీవనాన్ని సాధించుకున్న చైనా సామాజిక విప్లవాన్ని విస్మరించింది. స్ర్తీల విషయంలోనైతే ఇంకా మధ్యయుగాల నాటి న్యాయాన్నే పాటిస్తున్నాం’’ అని లి డెఝావో ఆవేదన చెందారు. యూనివర్శిటీ లైబ్రరీలో ఆయన నా క్యూరేటర్. నా భవిష్యత్ ఆలోచనలను మలిచింది ఆయనే.
లీ డెఝావోతోపాటు ఛెన్ డ్యుగ్జీ, హ్యూషీ, జియాంగ్ జువాన్‌టాంగ్‌లు - బీజింగ్ యూనివర్శిటీలో నేను పార్ట్‌టైమ్ స్టూడెంట్‌గా ఉన్నపుడు - నాకొక సైద్ధాంతిక వ్యక్తిత్వాన్ని ప్రసాదించారు.

అప్పట్లో ఘ్జావో అనే యువతిని చైనా ఫ్యూడల్ వివాహ సంప్రదాయాలు పొట్టన పెట్టుకున్న హృదయ విదారక సంఘటన ఒకటి నా ముద్దను నాకు మింగుడు పడనివ్వలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఘ్జావో ఆత్మహత్య చేసుకుంది. సమాజం - పుట్టినిల్లు - మెట్టినిల్లు అనే త్రిభుజాకారపు ఇనుప తెర ల్లో చిక్కుకున్న స్ర్తీ బయటికి వచ్చే దారి లేక అసహాయంగా మగ్గిపోవడమన్నది వివాహ వ్యవస్థలోని అవలక్షణంగా నాకు కనిపిస్తుంది. కోరుకున్న వ్యక్తిని జీవితభాగస్వామిగా ఎంచుకునే అవకాశాన్ని స్ర్తీకి ఇవ్వలేని సమాజం ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఎత్తులు ఎదిగితే మాత్రం నాగరికం అవుతుందా? గృహ బానిసత్వంలో మగ్గుతున్న స్ర్తీలు తమ వంటింటి పొగగొట్టాలనుంచి వదిలే దట్టమైన శోకాలను, శాపాలను జాతీయ స్థూల ఉత్పత్తికి సూచికలనుకుంటే ఎలా?


చైనాలో మగవాళ్లు మూడు ఆధిక్యతలకు లోబడి జీవిస్తుంటారు. రాజకీయం, కుటుంబం, మతం... మగవాడి పక్కలో పడుకుని వాడిని ఎటూ కదలనివ్వక, మీద కాళ్లేస్తాయి. రాజకీయ నిర్ణయాలు అతడి జుట్టు పట్టుకుంటాయి. కుటుంబ బాధ్యతలు అతడి ముక్కును మూస్తూ, వదులుతూ, మూస్తూ వదులుతూ ఉంటాయి. మతం అతడిపై కుండల కొద్దీ సంప్రోక్షణ జలాన్ని కుమ్మరిస్తుంటుంది. స్ర్తీల పరిస్థితి ఇంకా ఘోరం. పురుషుడు భరించే మూడు ఆధిక్యతలతో పాటు పురుషుడి దురహంకార దుర్గంధాన్ని కూడా వారు భరించాలి!

సాంస్కృతిక విప్లవంతో తప్ప దేశం లోపల, బయట
ఉన్న ఆధిక్యతల నిర్మూలన జరగదని నేను బలంగా విశ్వసించాను. ఛైర్మన్ మావో... నియంతలా మారిపోయాడన్నారు. పార్టీలో ప్రబలిన ఉదారవాద బూర్జువాలను బలహీనపరచడానికి, ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్ ’తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సాంస్కృతి విప్లవాన్ని నేను అడ్డుపెట్టుకున్నానని అన్నారు. రాచరిక భూస్వామిక భావజాలం నుంచి ప్రజలను మానసికంగా బయటికి తేవడం కోసం వారి జీవితాలను సర్వనాశనం చేశానని ఆరోపించారు. విప్లవం వల్ల ఇంత హింస ఎందుకు జరుగుతుందని వారి ప్రశ్న!
విప్లవం డిన్నర్ పార్టీ కాదు. తీరిగ్గా చదువుకునే స్ఫూర్తిదాయక వ్యాసం కాదు. చక్కటి పెయింటింగ్ కాదు. ఎంబ్రాయిడరీ వర్క్ కాదు. అది సున్నితంగా, సరళంగా, సక్రమంగా, మెల్లిమెల్లిగా ముందుకు సాగదు. గౌరవంగా, మర్యాదగా, నొప్పిలేకుండా, డిప్లొమాటిక్‌గా మాట్లాడదు. అవసరమనుకుంటే హింసతో వ్యవస్థను అదుపులోకి తీసుకునే దుస్సాహసమే విప్లవం. రేపటి స్థిమితమైన జీవితాల కోసం ఇవాళ కొంత అశాంతికి లోనైనా తప్పులేదన్న భావనకు ఆచరణ రూపమే విప్లవం.

నేను వాంఛించినది శాశ్వత విప్లవం. అయితే అది ట్రాట్‌స్కీ తరహా శాశ్వత విప్లవం కాదు. ఒక విప్లవం తర్వాత మరొకటి రావాలి. విప్లవం నిరంతరం పురోగమించాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేనప్పుడు జాప్యం చేయడం వల్ల చెడ్డపేరును వాయిదా వేసుకుంటూ పోగలమే గానీ అసలంటూ తప్పించుకోలేం.
మావో జేడోంగ్ (మావో సే టుంగ్)
26 డిసెంబర్ 1893 - 9 సెప్టెంబర్ 1976
జన్మస్థలం : షావ్షాన్, హునాన్ ప్రావిన్సు
సంతతి : పదిమంది
భార్యలు : నలుగురు
ప్రతిష్ట : చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి ఛైర్మన్
అప్రతిష్ట : సాంస్కృతిక విప్లవ సారథిగా.

ది లవ్ ఆఫ్ ది హాథోర్న్ ట్రీ
చైనా మహోన్నత నేత మావో జేడోంగ్ 1966-1976 మధ్య ‘సాంస్కృతిక విప్లవం’ పేరిట అనుసరించిన విధానాలను సునిశిత హాస్యంతో విమర్శిస్తూ చైనా దర్శకుడు ఝంగ్ ఇమౌ తీసిన ‘ది లవ్ ఆఫ్ ది హాథోర్న్ ట్రీ’ చిత్రం ఇప్పుడక్కడ హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో నడుస్తోంది. అనుమానాలతో, అసహనంతో ప్రజలను వేధించుకుతిన్న సాంస్కృతిక విప్లవం... ఇద్దరు యువ ప్రేమికుల జీవితాలను దయనీయంగా మార్చిన వైనమే చిత్ర కథాంశం. చైనా యువతీ యువకులతో పాటు, కరడు గట్టిన కమ్యూనిస్టులు కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారట! మావోను పరోక్షంగా విమర్శిస్తూ డైలాగులు వినిపించిన ప్రతిసారీ సినిమాహాళ్లు చప్పట్లతో దద్దరిల్లుతున్నాయని ఘంగ్ ఇమౌ అంటున్నారు. అప్పట్లో చైర్మన్ మావో ఆధ్వర్యంలోని ‘రెడ్ ఆర్మీ’ దళాలతో పోరాడిన ‘నేషనల్ కొమింటాంగ్’ పార్టీలోని ఒక అధికారి కుమారుడే ఈ చిత్ర దర్శకుడు. 

కూర్పు, స్వగత కథనం:
మాధవ్ శింగరాజు

Thursday, September 30, 2010

మృత్యువు వీళ్ల గులామ్! * డెత్ ఈజ్ బ్యూటిఫుల్

మరణం...
దేశభక్తికి ఇది అత్యున్నతమైన బహుమతి. దాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా దేహాన్ని నాశనం చేయడం ద్వారా ఈ దేశంలో తాము సురక్షితంగా ఉండగలమని వారు అనుకుంటున్నారు. వాళ్లు నన్ను భౌతికంగా అంతమొందించవచ్చు, నా భావాలను అణచి వేయలేరు.

అలా మాట్లాడటం, మాట మీద నిలబడ్డట్టే ఉరికొయ్య ముందు ధిక్కారంగా నిలబడటం భగత్‌సింగుకే సొంతం. సాహసం అతడి స్వభావం. సంచలనం అతడి సిద్ధాంతం. చనిపోయిన తర్వాత కూడా జీవించడమే జీవితానికి అసలైన అర్థమైనప్పుడు, బతికినంతకాలం అందరి కన్నా విభిన్నంగా బతకాలనుకున్నాడు భగత్‌సింగ్.

అణువణువునా దేశభక్తిని నింపుకున్న భగత్, స్వాతంత్య్ర సమర యోధుడు లాలాలజపతిరాయ్ చావుకి కారణమయ్యాడన్న కోపంతో సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించాడు. పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి ఇరవై మూడేళ్లకే ఉరికొయ్యపై విప్లవ గీతమై వేలాడాడు. స్వేచ్ఛా పోరాటాలకు వేగుచుక్కలా నిలిచాడు.
..............
ఒకడి జీవితాన్ని అతడి చావే నిర్ణయిస్తుంది. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, ఆదర్శాలేమైనా అవ్వొచ్చు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అందుకే కొంతమంది చనిపోయిన తర్వాత జీవిస్తారు.

జీవితమంతా గెరిల్లాగా జీవించిన వీరుడు చేగువేరా. అతడు ప్రజా ఉద్యమాల్లోకి కాంతి వేగంతో విస్తరించాడు. అట్టడుగు జనంలోకి సూర్య కిరణంలా చొచ్చుకుపోయాడు. శత్రువు గుండెల్లోకి బుల్లెట్‌లా దూసుకుపోయాడు. అందుకే ‘లీడర్’ కాగలిగాడు. నరాల్లో అణువణువునా నెత్తురు బదులు లావా ప్రవహిస్తున్నట్టుగా, మాటల తూటాలు పేల్చేస్తున్నట్టుగా, డైనమైట్‌కు ప్యాంట్ చొక్కా తొడిగినట్టుగా ఉంటాడు. ఎక్కడో అర్జెంటీ నాలో పుట్టి, క్యూబాలో పోరాడి, బొలీవియా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సాహసి అతడు. ముప్ఫై తొమ్మిదేళ్ల అతడి దేహం మట్టిలో కలిసిపోయినా, ‘చే’ లైఫ్ కోట్లాది హృద యాల్లో లైఫ్‌సైజ్ పోస్టర్‌లా నిలిచిపోయింది.
..............
మార్షల్ ఆర్ట్స్‌కు మీనింగ్ బ్రూస్లీ. చైనీస్ యుద్ధ కళలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన యోధుడు బ్రూస్లీ. తన స్టైల్ ఆఫ్ ఫైట్స్‌తో కొన్ని జనరేషన్స్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. హాంకాంగ్‌లో ఓ చిన్న కుటుంబంలో పుట్టిన బ్రూస్లీకి పరిస్థితులు పోరాటం నేర్పాయి. వీధి పోరాటాల్లో ఆరితేరిన బ్రూస్లీ, హాలీవుడ్ స్క్రీన్‌పై పిడుగులా విరుచుకు పడ్డాడు. నాలుగే నాలుగు సినిమాలు. బ్రూస్లీ స్టార్ అయిపోయాడు. స్క్రీన్ మీద ఒక్కడే వందమందిని మట్టి కరిపించడం చూసి అతన్ని ‘ఐరన్ మ్యాన్’ అని ఆరాధించారు. 1972 జూలైలో ఓ సాయంత్రం పూట బ్రూస్లీ మరణించాడన్న వార్త తెలిసి, ప్రపంచం నివ్వెరపోయింది. 33 ఏళ్ల బ్రూస్లీ ఊపిరి ఆగిందని తెలిసి మరణమే చిన్నబోయింది.
..............
మనుషుల మధ్య దేవత మార్లిన్ మన్రో. ఆమె ఈ భూమ్మీద బతికింది ముప్ఫై ఆరేళ్లు. బతికినంత కాలం తన అందంతో ప్రపంచాన్ని వేడెక్కించింది. ఈ వెండితెర వెన్నెల, తన గ్లామర్‌తో పట్టపగలే చుక్కలు చూపించింది. కష్టాల్ని పలకరిస్తూ, కన్నీళ్లను బుజ్జగిస్తూ, ప్రపంచపు వాకిటిలో గులాబీ పూవై విరిసింది. చాలా చిన్న వయసులో సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకుంది. ఆమె కన్ను మూయడంతో, 1962 ఆగస్టు 5 ఉదయం కళ్లు తెరిచింది. అందుకోవడానికి ఇక ఏమీ లేనప్పుడు, మనసు అర్థం చేసుకోవడానికి ఎవరూ రానప్పుడు మార్లిన్ మృత్యువు ఒడిలో సేద తీరింది. మూవీస్‌కే కాదు, మృత్యువుకూ ఆమె గ్లామర్ తెచ్చింది.
..............
మానవసేవయే మాధవసేవ అన్నది స్వామి వివేకానంద ఉనికి. ఆయన హిందూ మతధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన సిద్ధాంతి. భారతీయ ఆధ్యాత్మికత అన్ని అంచులూ చూసిన వేదాంతి. వెస్ట్రన్ లాజిక్, ఫిలాసఫీ, యూరప్ దేశాల చరిత్ర అధ్యయనం వివేకానందుని ఆలోచనా పరిధిని విస్తృతం చేశాయి. నరేంద్రనాథ్ దత్తా వివేకానందుడిగా ఎదిగిన క్రమంలోని ప్రతి మలుపూ ఆయన్ని గాడ్స్‌మన్‌గా మార్చింది. చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రతి మాట, భారతీయ సంస్కృతి విలువల్ని విశ్వవ్యాప్తం చేసింది. ముప్ఫై తొమ్మిదేళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వీడినా, ఆయన తరతరాల భారత చరిత్రపై చెరగని ముద్ర వేశారు.
..............
బ్యూటీకి సినానిమ్, గ్లామర్‌కి న్యూ డెఫినిషన్ మధుబాల. తన అందంతో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న అద్భుత సౌందర్యరాశి. తన నవ్వుల్తో కోట్లాది మంది అభిమానుల్ని మత్తులో ముంచెత్తిన మెస్మరైజింగ్ స్టార్. ప్యార్ కియాతో డర్‌నా క్యా... అంటూ ప్రేమను ప్రేమించి, ప్రశ్నించి నిజమైన ప్రేమ కోసం ఆరాటపడి, అలిసిపోయి, ముప్ఫై ఆరేళ్లకే జీవితాన్ని ముగించింది. గాయాల్ని తన వెంట తీసుకెళ్లి, అందమైన జాపకాల్ని మిగిల్చి వెళ్లింది.
..............
ప్రతి కళాకారుడికీ ఎంతో కొంత వెర్రి ఉండాలి. విన్సెంట్ వ్యాంగోకు పెయింటింగ్ అంటే పిచ్చి. అతడు మొదటినుంచీ చాలా ఎమోషనల్. ఏ ఉద్యోగంలోనూ ఇమడలేక పోయాడు. చివరికి తన భావాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికి, పెయింటింగ్ పర్‌ఫెక్ట్ ఆర్ట్ అని నమ్మాడు. మనిషినీ ప్రకృతినీ తన ఎక్స్‌ప్రెషనిస్ట్ స్టైల్‌లోకి చాలా అందంగా మోసుకొచ్చాడు. తన చివరి మూడేళ్లలో అత్యుత్తమమైన కళాఖండాల్ని సృజించాడు. ఈ ప్రపంచంతో పొత్తు కుదరక, ముప్ఫై ఏడేళ్లకు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానంతరం ఆయన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దొరికింది.
..............
ఈ ప్రపంచపు రహస్య దుఃఖం గురుదత్ సినిమాలు. సినీ మాయాప్రపంచంలో తిరుగుతూ, నిజమైన ప్రేమకోసం పరితపించిన సున్నిత హృదయుడు ఆయన. ప్రపంచ బాధ తన బాధగా ఫీలైన సెన్సిబుల్ ఫిలిం మేకర్. ప్యాసా, కాగజ్ కే పూల్, మిస్టర్ అండ్ మిసెస్ ఫిఫ్టీ ఫైవ్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గురుదత్ పాపులర్ ఫిలిం మేకర్ అయ్యాడు. తన ముప్ఫై తొమ్మిదో యేట ఆత్మహత్య చేసుకున్నాడు.
..............
మరణమంటే చనిపోయిన తర్వాత నరాల్లో నెత్తురు కదలకపోవడం కాదు, బతికి ఉన్నప్పుడు అణు మాత్రం స్పందించక పోవడం. అందుకే అతడు ఒక ప్రవాహంలా కదిలాడు. అక్షర ప్రభంజనమై విరుచుకు పడ్డాడు.

కీట్స్ అంటే కవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అని పేరు మోశాడు. సెకెండ్ జనరేషన్ రొమాంటిక్ మూమెంట్‌లో లార్డ్ బైరన్, పి.బి.షెల్లీలతో సమానంగా గుర్తింపు పొందాడు. చనిపోయేముందు నాలుగేళ్లలో ప్రచురితమైన కవిత్వం కీట్స్‌కు అపరి మితమైన పేరు తీసుకొచ్చింది. అందమే సత్యం, సత్యమే అందం అన్నది కీట్స్ అభిప్రాయం. అతడిని ‘ఎ న్యూ స్కూల్ ఆఫ్ పొయెట్రీ’ అని విమర్శకులు ప్రశంసించారు. 25 ఏళ్ల వయసులో క్షయ వ్యాధి అతన్ని మింగేసింది.
..............
మృత్యువు జీవితమంత సహజమైంది. కొన్ని మరణాలు పిల్లగాలిలా తేలిపోతుంటాయి. మరికొన్ని పెనుగాలిలా మనల్ని పట్టి కుదిపేస్తుంటాయి. అలాంటి వాళ్లే చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు.
ఇంగ్లండ్-ఫ్రాన్స్‌కు మధ్య జరిగిన వందేళ్ల యుద్ధంలో ఫ్రెంచి దేశపు సైన్యానికి నాయకత్వం వహించి, బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన ధీర వనిత జోన్ ఆఫ్ ఆర్క్. దేవుడి ఆజ్ఞగా భావించి, ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా యుద్ధ రంగంలోకి దూకింది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు లొంగి పోకుండా, చివరిదాకా పోరాడింది. సైన్యం ఆమెను బంధించి, విచారణ జరిపి మంటల్లో తగులబెట్టింది. పందొమ్మిదేళ్లకే మృత్యువు అంచులకు వెళ్లిన జోన్ ఆఫ్ ఆర్క్‌ను తర్వాత దేవదూతగా కీర్తించారు.
..............
చారిత్రక అవసరంలోంచి పుట్టుకొచ్చిన అగ్నికణం అల్లూరి. అతడు కాలం మలిచిన విప్లవకారుడు, అణచివేతల నుంచి ఉద్భవించిన ఉద్యమకారుడు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం విశాఖ కొండల్లో అడుగుపెట్టిన అల్లూరి, అనివార్యంగా ఆయుధం పట్టాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను నిలువు దోపిడీకి గురిచేస్తున్న ఆంగ్లేయుల దుర్మార్గాన్ని స్వయంగా చూసిన ఆయన, ఏజెన్సీ విముక్తికి పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. విప్లవానికి వ్యూహం అవసరం, పోరాటానికి ఆయుధాలు అవసరం, నాయకుడికి సాహసం అవసరం.

అందుకే రామరాజు ఆయుధాల కోసం పోలీస్‌స్టేషన్‌లపై దాడి చేశాడు. అతని సాహసం ముందు బ్రిటిష్ సైన్యం నిలువెల్లా వణికిపోయింది. తన పోరాటంలో అమాయకులను బలిచేయవద్దని భావించిన రామరాజు పోలీసులకు లొంగిపోయాడు. లక్ష్యం కోసం 27 ఏళ్లకు సీతారామరాజు తన జీవితాన్ని ముగించాడు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన ఆ వీరుడి త్యాగం వృథాకాలేదు. ఆ విప్లవ వీరుడి స్ఫూర్తి లక్షలాది భారతీయుల్లో స్వేచ్ఛాకాంక్షను రగిల్చింది.

.................
వీళ్లకు మరణం కామా మాత్రమే, ఫుల్‌స్టాప్ కాదు.
శత్రువుకు చిక్కకుండా తుపాకీతో కాల్చుకుని చావును వెక్కిరించిన చంద్రశేఖర్ ఆజాద్, స్పానిష్ యుద్ధంలో నేలకొరిగిన అక్షరయోధుడు క్రిస్టఫర్ కాడ్వెల్, పేదల కోసం పోరాట బాట పట్టి పందొమ్మిదేళ్లకే హత్యకు గురైన పెరూ కమ్యూనిస్ట్ నాయకురాలు ఎడిత్ లాగోస్, రాక్ మ్యూజిక్ స్టార్ జిమ్‌మారిసన్, జర్మన్ అస్తిత్వవాద రచయిత ఫ్రాంజ్ కాఫ్కా, బ్రిటిష్ రచయిత్రి అన్నే బ్రాంటే...

ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు.. ఒక సంకల్పంతో, స్పిరిట్‌తో కొత్త జీవితాన్ని కలగంటున్నప్పుడు స్ట్రగుల్స్ ఎదురవు తుంటాయి. పెయిన్స్ పలకరిస్తుంటాయి. అప్పుడప్పుడు జీవితం కందిపోయేంత గట్టిగా మృత్యువు కౌగిలించు కుంటుంది. స్ట్రగుల్స్‌ను ఫేస్ చేయగలిగిన వాళ్లకు మాత్రమే మృత్యువు సలామ్ చేసి, గులామ్ అవుతుంది.
భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ మరణించినప్పుడు ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్పందిస్తూ,

జిస్ తేజ్ సే కోయి ముక్తాల్ మే గయా వో షాన్ సలామత్ రహతీ హై
యే జాన్ తో అన్ జానీ హై ఇస్ జాన్ కీ కోయి బాత్ నహీ
(మృత్యువు ఎదురొచ్చినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారన్నదే ఎవరైనా గుర్తుంచుకుంటారు. ప్రాణానిదేముంది వస్తుంది, పోతుంది.)
(సెప్టెంబర్ 27 భగత్‌సింగ్ జయంతి సందర్భంగా)
- కె.క్రాంతికుమార్ రెడ్డి

Thursday, September 23, 2010

ప్రతి విషయంలో మహిళల స్వేచ్ఛకు అడ్డుతగలడం సరికాదు.

ఆత్మవిశ్వా సానికి అడ్డుగా అహం
మారుతున్న సమాజంతోపాటు మహిళలు మారిపోతున్నారు.. పురాతన సంప్రదాయాల నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. వంట ఇంటికే పరిమితమైన స్థాయి నుంచి కుటుంబానికి పెద్దగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇందుకు తల్లిదండ్రుల దృక్పథంలో వచ్చిన మార్పు ముఖ్య కారణం. కూతురైనా కొడుకైనా సొంతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని వారు ఆశిస్తున్నారు. కానీ అమ్మాయి ఎంతగా ఎదిగినా సరే... ఉద్యోగాలు చేసినా ఊళ్ళు ఏలినా ఇంటి పని, వంట పని, కుటుంబాన్ని చూసుకునే పని మాత్రం తప్పక నేర్చుకోవాలి. అబ్బాయిలు మాత్రం ఎన్ని మార్పులు వచ్చినా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు. డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం ఇవి మాత్రమే వారి బాధ్యతలుగా వస్తున్నాయి. మహిళ ఎప్పటికీ తమ కంటే తక్కువ అనే వారి దృక్పథంలో మాత్రం మార్పు రావడం లేదు. దీనికి మానసిక నిపుణులు అంజలి చాబ్రియా, క్రిసన్‌ ఏం చెబుతున్నారంటే..

ఎంత సంపాదించినా...
woman-workingటీవీ నడక, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబాన్ని పోషించడం, అన్నిటిలోనూ మగవారే ముందుండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భర్తలకన్నా ఎక్కువ సంపాదించే భార్యలున్నారు. ‘నా భర్త కన్నా నా జీతం ఎక్కువ. మొదట్లో ఇది నా భర్తకు నచ్చేది కాదు. కానీ ఆ డబ్బును ఇద్దరం సమానంగా ఖర్చుపెట్టుకుంటాం. ఇంటి అవసరాలకు నేను సంపాదించడం కూడా ముఖ్యం.. కానీ ఎంతో ఆత్మన్యూనతకు గురి అవుతారు’ అని తన భర్తను ఉద్దేశించి చెబుతోంది రాధిక.

మానసిక నిపుణులు మాట...
చాలా మంది మగవారు తమ ఉద్యోగాన్ని, బ్యాంకు బ్యాలెన్సునే విజయంగా భావిస్తారు. తమ భాగస్వామి వియాన్ని వారు లెక్కలోకి తీసుకోరు. అది తరతరాలుగా వారిలో వున్న భావన. అందుకే మహిళలు ఎంత ఉద్యోగాలు చేసినా, ఎన్ని విజయాలు సాధించినా తమ భర్తలకు ఆత్మన్యూనతా భావం కలగకుండా జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంటుంది. ఇలా కాకుండా సంబంధాలు ఆరోగ్యవంతంగా వుండాలంటే భార్యా భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరు ఎక్కువ సంపాదిస్తారు, తక్కువ సంపాదిస్తారు అని కాక వారి విజయాలకు ఆనందించాలి. తోడుగా వుండాలి. కుటుంబంలో అందరూ ఒక టీమ్‌లా వుండాలి. ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వాలి.

తరతరాలుగా వస్తున్న భావాలు...
man_enoughమగవారి భావనలో భర్త అనేవారు సంపాదించి కుటుంబాన్ని కాపాడుకోవాలి. భార్య కుటుంబానికి కావలసిన పనులు చేయాలి. వారు సంపాదించకూడదు. ఒకవేళ సంపాదించినా సరే అది గొప్పగా చెప్పకూడదు. ‘ఈ రోజుల్లో భర్తలు తోడుగా లేని మహిళలు కూడా ఎంతో గొప్పగా బతుకుతున్నారు. తమ పిల్లలను చదివించుకుంటున్నారు. చాలా వరకు మంచి జీవితాలను ఇవ్వగలుగుతున్నారు. వారి కాళ్ళమీద వాళ్లు నిలబడగలరు. దీన్ని మగవారు ఒప్పుకోకపోవడం సిగ్గుచేటు..’ అని 39 ఏళ్ళ గీతాశంకర్‌ అంటున్నారు.

నిపుణుల మాట...

తరతరాలుగా సమాజంలో మగవారినే కుటుంబానికి పెద్దగా భావిస్తూ వస్తున్నారు. ఆడవారిని కుటుంబానికి మూలంగా తీసుకునే సంప్రదాయం ఇక్కడ లేదు. కానీ ఏది ఏమైనా ఈ భావనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కలిసి కట్టుగా కుటుంబాన్ని నిర్మించుకోవడం, ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మగవారు కూడా ఇప్పుడు దీన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవాలి కూడా.

పేరు.. ప్రఖ్యాతులు సాధించినా...
MULTI_TALENTEDమహిళలు కూడా అన్ని రకాల పనులను సమర్థవంతం గా నిర్వహించగలరని నిరూపించుకుంటున్నారు.భార్యగా తల్లిగా, కూతురిగా వారు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.పేరు..ప్రఖ్యాతులు సాధించుకుం టున్నారు. ఎంతమంది వారిని మెచ్చుకున్నా కుటుంబం ఇచ్చే ప్రశంసలనే వారు ఎక్కువగా భావిస్తారు.కానీ ఇంటిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా వుంటాయి.‘నా భర్త నా స్నేహితులను కలిసినప్పుడు అంతగా సరదాగా వుండరు. కాని నేను అలా వుండను. ఎవరి స్నేహితులైనా అందరితోనూ కలిసిపోయేందుకు ప్రయత్నిస్తాను. మంచి విషయాలను షేర్‌ చేసుకుంటాను.చాలా మంది నా స్వభావాన్ని మెచ్చుకుంటారు కూడా.. ఇది మా వారికి నచ్చదు.గతంలో విధంగా కాకుండా ఏ పార్టీలకైనా.. ఒక్కరే వెళ్తున్నారు. దీని కి సమాధానం వుండదు. ఇది నాకు ప్రశ్నగా మారి పోయింది’ అని గీత అంటోంది.

నిపుణులు ఎమంటున్నారంటే...
మగవారు తమ ఫ్యామిలీని, భార్యను స్నేహితులు మెచ్చుకుం టే చాలా గర్వంగా భావిస్తారు. కాని కొన్ని సార్లు తన కన్నా తన భార్య ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవడాన్ని భరించ లేరు. ఇది వారి ఇగోకు అడ్డుగా మారుతుంది. ఇది ఎక్కు వ అయితే భార్యను ఇబ్బందులకు గురి చేస్తారు. కాని భర్తలు ముందుగా భార్యలను నమ్మగలగాలి. వారి పేరు పట్ల సంతోషంగా వుండగలిగే వాతావరణం రావాలి.

అహంకారమే అడ్డు...
ఎన్నో కార్పొరేట్‌ సంస్థలకు నేడు మహిళ లు సిఇఓలుగా వున్నారు. వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు. వారి సొంతంగా వారు పోరాడటం నేర్చుకున్నారు. కానీ మగవారికి మాత్రం మహిళలు ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం కాస్త కష్టంగానే భావిస్తున్నారు. ‘నేను ఒంటరిగా ప్రయాణాలు చేయడం ఇష్టపడతాను. కానీ నా బాయ్‌ఫ్రెండ్‌ దీన్ని ఇష్టపడరు. ఒంటరిగా వెళ్ళడం, బిజినెస్‌ డీల్స్‌కు వెళ్ళడం ఒప్పుకోలేరు.ఈ విషయంలో ఎప్పుడూ వాదిస్తాడు’ అని ఓ ప్రముఖ కంపెనీకి హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న సునీత అంటున్నారు.

నిపుణుల మాట...
మగవారు తమ వారిని కాపాడుకోవడం ఒక బాధ్యతగా భావిస్తారు. వారిని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. అది ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. దీని వల్లనే మహిళ స్వతంత్రాన్ని వారు ఒప్పుకోరు.ప్రతి వి షయంలో వారు స్వతంత్రంగా వ్యవహరించడాన్ని అడ్డుకుంటారు. తమ అధికారిన్ని కాపాడుకోవాలని చూస్తారు. కాని దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. తమ జీవితభాగస్వామి శక్తి సామర్థ్యాలను నమ్మగలగాలి. అవసరమైనప్పుడు తోడుగా వుండటం తప్పుకాదు కానీ.. ప్రతి విషయంలో మహిళల స్వేచ్ఛకు అడ్డుతగలడం సరికాదు.

‘మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు, మన పోరాటాలు వీటి అన్నిటి నడుమ మనం మోక్ష మార్గాన్నే పయనిస్తూన్నామనటం ఒక వింత విషయం.

సాఫల్యసిద్ధికై కృషి
Hinduజీవ క్రమపరిణామంలో ప్రస్తుతం మానవుడికి గల ఆధిపత్యం, అతడు పొందిన ప్రగతికి కారణం, అతడి మనస్సే అయినా, దానిని గురించి అతడికి అజ్ఞానం, నిర్హేతుకత భీతి ఉన్నవిః ఇది విడ్డూరమే,మనస్సును గవేషించటం ఇప్పుడిప్పుడే మొదలైంది. గత శతాబ్దాల్లో భూమి ఉపరితల గవేష ణం మన ముఖ్యక్యాక్రమం కాగా,రాబోయే శకంలో మనోగవేషణ ముఖ్య కార్య క్రమం కావాలి. భౌగోళిక గవేషణంలో అద్భుతాలు కనబడుతవి. మన వారసులకు పూర్ణమూ,సమృద్ధిమంతమూ ఐనా కొంగ్రొత్త అవకాశాలు దొరుకుతవి.’’ సహస్రాబ్దాలుగా అంతరంగంయొక్క వైజ్ఞానిక గవేషణమే భారతీయుల ముఖ్యకార్యకలాపాలై ఉండింది. గతంలో ఎందరో మహ ర్షులు,కృష్ణుడు,బుద్ధుడు,ఆదిశంకరుడు,ఇంకా ఆధ్యాత్మికం గగనంలో తారలవలె వెలిగిన అనేకానేకులు,నేటికాలంలో రామకృష్ణ వివేకానందులు, ఈ క్షేత్రంలో గవేషకులు, పరిశోధకులు,మానవజాతినఇనుగ్రహించిన జగద్గురువులు వీరు.

వీరు ముక్తిని బాహ్యాం తరంగ ప్రకృతుల బంధాలనుండి విమోచనం-బోధించారు. ఆధ్యాత్మిక సాక్షాత్కారం ద్వారా సార్థకత పొందటం నేర్పారు. విశ్వవికాసంలలోను జీవక్రమపరిణామంలోను వీరికి మోక్షమే సూత్రవాక్యం అని తోచింది. అచిత్తును పరివర్తనం చేసి దానిని దాటి పోవడానికి, దాని కబంధ హస్తాల నుండి విడుదల పొందటానికి ఆత్మ జరిపే నిరంతర యత్నమిది. ఈ విషయమై స్వామి వివేకానంద నుడివిన పలుకులు ఇప్పటికీ చెవులలో గింగిరుమంటున్నాయి.

‘మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు, మన పోరాటాలు వీటి అన్నిటి నడుమ మనం మోక్ష మార్గాన్నే పయనిస్తూన్నామనటం ఒక వింత విషయం. ఈ ప్రపంచమెట్టిది ఇది దేనిలోనుండి ఉప్పతిల్లింది? దేనిలోకి పోతున్నది అనే సమస్య పుట్టింది. దానికి దొరికిన సమాధానం, ‘ముక్తిలో ఉప్పతిల్లింది, ముక్తిలో విశ్రమిస్తుంది, ముక్తిలో లయిస్తుంది.’ తనను గురించి, తనలో దాగి ఉన్న అపారశక్తుల గురించి ఎరుకగల ఏకైక జీవి మానవుడు మాత్రమే. అయితే తనకున్న హద్దులు కూడా వానికి ఎరుకే.

ఈ అవధులు దాటే పోరాటంలో, తన అంతరంగాన్నే ఒక రణరంగంగా, నిజమైన కురుక్షేత్రంగా మార్చుతాడు. స్వేచ్ఛాబంధనాల నడుమ జరిగే ఈ పోరాటమే, జీవితంలోని అన్ని ఉల్లాసాలను , రమణీయతను సుఖదుఃఖాలను, కలలను, కల్పనలను అందిస్తుంది. మానవ జీవితానికి నిజమైన అర్థమిదే, కాని ఈ పోరాటం నిరంతరం ఉండదు. మానవుడు ఈ రొంపిలో ఎప్పటికీ దిగబడిపోయి ఉండవలసిన అగత్యం లేదు. ఆధ్యాత్మిక మార్గదర్శక కాంతిలో ఈ ఘర్షణే మానవుణ్ణి నైతిక ఆధ్యాత్మిక శిక్షణాకేంద్రంగా మారుస్తుంది. తద్వారా మానవుడు ఆధ్యాత్మిక బలం, సంకల్పబలం, విశదమైన దృష్టి ధ్యేయాను బడిసి, ఆత్మసాక్షాత్కారం ద్వారా తుట్టతుదకు స్వేచ్ఛ ఆనందాలను పొందుతాడు. స్వేచ్ఛే అతడి జన్మహక్కు. జీవన పరిణామంలో సుదీర్ఘ వేదనా మార్గాల వెంబడి నడిచి చివరకు దానిని తిరిగి పొందుతాడు.

గురువు అనే పదప్రయోగం లేకుండా తన ఆధ్యాత్మిక బోధలను సాగించిన మహావ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి.

గురు భావాన్ని తిరస్కరించిన జిడ్డు కృష్ణమూర్తి
JidduKrishnamurtiఆధునిక కాలంలో అనేకమంది ఆధ్యాత్మిక గురువులు మనకు కనుపిస్తారు. అయితే గురువు అనే పదప్రయోగం లేకుండా తన ఆధ్యాత్మిక బోధలను సాగించిన మహావ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి. ఆయన సమకాలీకులైన గురువులు ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలను స్థాపించడానికి పోటీలు పడుతుండగా జిడ్డు కృష్ణమూర్తి మాత్రం తన బోధల పట్ల ఆసక్తులైన వారికి మార్గదర్శనం చేస్తూ గురువు అనే పదాన్ని కూడా తన దాపులలోకి రానివ్వలేదు. తన స్వానుభవం నుంచి తెలుసుకున్న విషయాన్నే ఆయన బోధిం చారు. ఏదో ఒక మతం, మార్గం లేదా ఒక పంధాను అనుసరించడం ద్వారా సత్యాన్ని చేరుకోలేమని, సాధకుడు తన ఆవిష్కారాల ద్వారా మాత్రమే దానిని కనుగొనగలుగుతాడని ఆయన అంటారు. సాధకుడు తన అనుభవాల చట్రం నుంచి బయటపడి, సత్యమైనదానిని గుర్తించే చైతన్యాన్ని అవరోధపరిచే ఆలోచనా స్రవంతిని నెమ్మదింప చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన అంటారు.

జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు 1895, మే 12వ తేదీన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదవ బిడ్డగా జన్మించిన అతడికి వారు కృష్ణుడి పేరు పెట్టుకున్నారు. తల్లి సంజీవమ్మ ఆయనకు పదేళ్ళ వయస్సులోనే మరణించింది. ఆయన కుటుంబం 1903లో కడపలో స్థిరపడింది. అక్కడే ఆయనకు మలేరియా వ్యాధి సంక్రమించి అనేక సంవత్సరాలు వెంటాడింది. చిన్నతనం నుంచి ఆయన స్తబ్దుగా, రోగగ్రస్తు డై ఉండడంతో అతడిని మానసిక వికలాంగుడని భావించేవారు. అతడి స్తబ్దత కారణంగా అటు పాఠశాలలో ఉపాధ్యాయుల చేతిలోను, ఇంట్లో తండ్రి చేతిలోనూ దెబ్బలు తినవలసి వచ్చింది. 1907లో పదవీ విరమణ చేసిన నారాయణయ్య పెద్దగా సంపాదించకపోవడంతో జీవనం కోసం తనకు దివ్యజ్ఞాన సమాజంలో ఉద్యగం ఇవ్వవలసిందిగా దాని అధ్యక్షురాలు అనిబిసెంట్‌కు లేఖ రాశారు. స్వతహాగా సంప్రదాయ బ్రాహ్మణుడు అయినప్పటికీ నారాయణయ్య 1882 నుంచీ దివ్యజ్ఞాన సమాజం సభ్యునిగా కొనసాగారు. ఆయన అభ్యర్ధనను మన్నించి ఆనిబిసెంట్‌ ఉద్యోగం ఇవ్వడంతో 1909 జనవరిలో తన కుటుంబాన్ని ఆడయార్‌కు మార్చారు. మొదట్లో నారాయణయ్యకు దివ్యజ్ఞాన సమాజం ఆవరణ బయట చిన్న ఇంటిని ఇచ్చారు. సరైన పారిశుద్ధ్యం లేని ఆ ఇంట్లో ఉండడం వల్ల కృష్ణమూర్తి, ఆయన సోదరులు రోగగ్రస్థులయ్యారు. అడయార్‌కు వచ్చిన కొద్ది నెలల తర్వాత కృష్ణమూర్తి తొలిసారి చార్లెస్‌ వెబ్‌స్టర్‌ లెడ్‌బీటర్‌ను కలిసారు. తొలిసారి కృష్ణమూర్తిని చూసిన లెడ్‌బీటర్‌ కృష్ణమూర్తిలో నిస్వార్ధ కాంతిమండలం(ఆరా)ను చూశారట. బాహ్యంగా అత్యంత నిస్తేజంగా కనిపించే అతడు గొప్ప ఆధ్యాత్మిక గురువు, వక్త కాగలడని లెడ్‌బీటర్‌ స్థిరంగా నమ్మాడు. ఈ నమ్మకంతోనే కృష్ణమూర్తిని అడయార్‌లోని థియొసాఫికల్‌ సొసైటీ పెద్దలు తమ పెంపకంలో తీసుకున్నారు.

jiddu కృష్ణమూర్తిని జాగ్రత్తగా చూసుకుంటూ, అతడికి విద్యా బోధన చేస్తూ ప్రపంచ గురువుగా తయారు చేయాలని లెడ్‌బీటర్‌ తన సహచరులను ఆదేశించారు. తన భౌతిక స్థితి అస్థిరంగా ఉన్నప్పటికీ పద్నాలుగేళ్ళ కృష్ణమూర్తి ఆరు నెలలోనే ఇంగ్లీషు లో రాయడం, చదవడం నేర్చుకున్నారు. ఈ సమయంలోనే కృష్ణమూర్తికి ఆనిబిసెంట్‌తో గాఢమైన సంబంధం ఏర్పడింది. ఆమె ఆయనకు మారు తల్లి అయింది. 1911లో దివ్యజ్ఞాన సమాజం ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ సంస్థను ఏర్పాటు చేసింది. దానికి కృష్ణమూర్తిని అధిపతిగా చేశారు. ప్రపంచ గురువు రాకను ఆమోదించిన వారందరికీ అందులో సభ్యత్వం ఇచ్చారు. అయితే ఆనతికాలంలోనే అది సొసైటీలోనూ, బయట కూడా వివాదమైంది. అయినప్పటికీ కృష్ణమూర్తిని ఆయన సోదరుడు నిత్యను 1911 ఏప్రిల్‌ నెలలో ఇంగ్లాండ్‌ తీసుకొని వెళ్ళారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన తన తొలి ఉపన్యాసాన్ని ఇచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేలోగా ఆయన అనేక ఇతర ఐరోపా దేశాలలో పర్యటించారు. యుద్ధం తర్వాత కూడా కృష్ణమూరర్తి అనేక ఉపన్యాసాలు, సమావేశాలు, చర్చలలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో ప్రధానంగా అవన్నీ ఆర్డర్‌ సంస్థ చుట్టూ తిరిగేవి.

దాదాపు పదకొండేళ్ళ అనంతరం అంటే 1922లో ఆయన కాలిఫోర్నియాలోని ఒజాయ్‌లో ఉన్నప్పుడు జీవితాన్ని మార్చివేసే ఆధ్యాత్మిక అనుభవాన్ని చవిచూశారు. ఈ అనుభవం ఆయనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానసిక పరివర్తనను కలిగించింది. అయితే సొసైటీలో పెద్దలు ఆయనకు ఇతర శక్తులు వస్తాయని ఆశించి నిరాశపడ్డారు. మొత్తం మీద 1925లో ఆయనకు దివ్యజ్ఞాన సమాజం పట్ల దాని నాయకుల పట్ల విశ్వాసం పోయింది. సోదరుడి మరణం, అంతర్గతంగా చోటు చేసుకున్న విప్లవం ఆయనను పూర్తిగా మార్చివేశాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణమూర్తి వ్యవస్థాగత విశ్వాసాలను, గురు పరంపర, గురు శిష్య సంబంధాలను తిరస్కరించారు. 1930లో ఆయన ఆర్డర్‌ నుంచి దివ్యజ్ఞాన సమాజం నుంచి విడివడ్డారు.

ఆలోచనలు నూతన అంశాలను కనుగొనలేవు. కానీ ఆలోచనలు ఆగిపోయినప్పుడు కొత్త ఆవిష్కరణ జరిగే అవకాశముంది. అయితే దీనిని కూడా ఆలోచన అనుభవంగా, పాతదానిగా మార్చివేస్తుంది అంటారు కృష్ణమూర్తి. అనుభవానికి అనుగుణంగా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ, ఆపాదనలు చేస్తూ ఉంటాయి. ఆలోచన విధి దానిని తెలియచేయడమే కానీ ఒక అంశాన్ని అనుభవిస్తూ ఉండడం కాదు. మనం ఒక అనుభవాన్ని ఆస్వాదించడం ఆగిపోయినప్పుడు ఆలోచన ప్రవేశించి దానిని మనకు తెలిసిన విషయాల కేటగిరీలో చేరుస్తుంది. ఆలోచన తెలియదానిలోకి ప్రవేశించలేదు. అందుకే దానికి వాస్తవమైనది అనుభవంలోకి రాదు అంటారు ఆయన.

త్యజించడాలు, నిర్లిప్తత, మత కర్మకాండలు, ధర్మాన్ని పాటించడం అనేవి ఎంత గొప్పవైనప్పటికీ అవన్నీ కూడా ఆలోచనా ప్రక్రియలే. అయితే ఆలోచన అనేది మనకు తెలిసిన దానిని సాధించడానికి ఒక వాహికగా మాత్రమే ఉండగలదు. విజయం లేదా సాధించడమనేది తెలిసిన దానిలో రక్షణ పొందడమే. తెలియని దానిలో రక్షణ పొందాలనుకోవడమంటే దానిని తిరస్కరించడమే. మనకు లభించే రక్షణ మనకు తెలిసిన, గతకాలపు అనుభవానికి పొడిగింపుగానే ఉంటుంది అని కృష్ణమూర్తి చెప్తారు. ఈ కారణంగానే మనస్సు అనేది లోతైన నిశ్శబ్దంలో ఉండాలి. అయితే ఈ నిశ్శబ్దాన్ని త్యాగం ద్వారానో, శరణాగతి ద్వారానో, అణచివేయడం ద్వారానో కొనుగోలు చేయలేవని హెచ్చరిస్తారు.

ఆ నిశబ్దమనేది నువ్వు ఏదీ కోరుకోనప్పుడు, ఏదో కావాలనుకోనప్పుడు మాత్రమే లభిస్తుంది. సాధన ద్వారా ఈ నిశబ్దాన్ని సాధించలేం. ఈ నిశబ్దమనేది మనసుకు పూర్తిగా తెలియనిది అయి ఉండాలి. ఒకవేళ మనసుకు ఈ నిశబ్దం అనుభవంలోకి వచ్చిందంటే గతకాలపు నిశబ్దాన్ని వ్యక్తి అనుభవించాడన్నమాట. వ్యక్తి అనుభవిం చిన ఆ అనుభూతి కేవలం పునరుక్తం అవుతోందని అర్థం. మనస్సు నూతనత్వాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. అందుకే మనస్సనేది ఎప్పుడూ శూన్యస్థితిలో ఉండాలి. అయితే అది ఎటువంటి అనుభవాలనూ ఆస్వాదించకుండా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే అది ఏ అనుభవానికీ పేరు పెట్టకుండా, దానిని జ్ఞాపకపు పుటలలో దాచకుండా ఉంచినప్పుడే ఈ శూన్యత లేదా నిశ్శబ్దం సాధ్యమవుతుందని ఆయన బోధించారు.

మన చైతన్యంలోని వివిధ పొరలలో ఈ రికార్డింగ్‌ అనేది జరుగుతుంటుంది. బాహ్యంగా మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అంతర్గత మనస్సు తెలిసిన విషయాలను గుర్తు చేస్తుంటుంది. చైతన్యమంతా అనుభవాల నుంచి బయటపడినప్పుడు మాత్రమే సత్యం అనుభవంలోకి వస్తుంది. అయితే స్వేచ్ఛగా ఉండాలనే ఈ కోరిక మళ్ళీ సత్యాన్ని గుర్తించేందుకు అడ్డంకి కాగలదు. సత్యానికి కొనసాగింపు ఉండదు. అది ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. క్షణ, క్షణానికి ఉంటుంది. కొనసాగింపు ఉన్నదానిని ఎప్పుడూ సృష్టించలేం.

మనస్సు శూన్యతను పొందినప్పుడు అనుభవం పొందేవారు ఉండరు. ఇందులో ఎటువంటి అలజడి ఉండదు. బాహ్యప్రపంచంలో జరిగేవి జరుగుతున్న వాటిని అలా స్వీకరిస్తూ కొనసాగుతుంటుంది. అంతేతప్ప గతంలోని అనుభవాలను గుర్తు చేసుకోదు. దీనిని మాటలలో చెప్పలేం.

ఈ స్థితిలో మనస్సు కార్యకలాపాలు పూర్తిగా ఉండవు. ఇది ఆద్యంతాలు లేనిది. అలా అని ఇది కొనసాగింపు కాదు. ఈ నిశ్శబ్ద స్థితిలో అన్ని పోలికలూ మాయమవుతాయి. ఇది కనుక భ్రాంతి అయితే మనస్సు దానిని తిరస్కరించడమో లేదా దానినే పట్టుకు వేళ్ళాడలని కోరుకోవడమో జరుగుతుంది. నిజమైన నిశ్శబ్దానికి, శూన్యతకు మనస్సుతో సంబంధం ఉండదు కనుక అది దానిని ఆమోదించడమో తిరస్కరించడమో జరుగదు. ఇది మాటలతో కొలవలేనిది అన్న కృష్ణమూర్తి ఉపన్యాసాలు ఎన్నో పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఏ మతాన్ని, ఏ పద్ధతిని బోధించని కృష్ణమూర్తికి శిష్యగణం తక్కువ లేదు. తన జీవితమంతా వ్యక్తులు సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకున్న కృష్ణమూర్తి తన చివరి ఉపన్యాసాన్ని 1986 జనవరిలో మద్రాసులో ఇచ్చారు. మరుసటి నెలలోనే కాలిఫోర్నియాలోని ఒజాయ్‌లో తన గృహంలో ఆయన మరణించారు.
- జి. అనఘ

Sunday, September 12, 2010

జయహో విజయ గాధలు: ధీరూభాయ్‌లు కావాలి..

కుబేరులున్న బీద దేశం మనది...
స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా..
ఎందువల్లనంటారు ? కొందరి దృష్ట్యా మనకు అంటే మన దేశ ప్రజలకు మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం వల్లనని !
చట్టాలున్నాయి.. అమలు కావు.. చట్టాలు కూడా అందరికీ సమానం కావు.

మూర్ఖత్వం దేశంలో నాలుగు చెరగులా రాజ్యమేలుతుంది.
సంఘం మీద, తోటి మానవుల మీద గౌరవం శూన్యం. సభ్యత, నాగరికత కోసం భూతద్దాలతో వెతకాలి. పొరుగు దేశాల్లో ఎంతో సభ్యత, సంస్కారంతో మసలే భారతీయులు కూడా. స్వదేశం రాగానే అసభ్యత, అనాగరికత ప్రదర్శిస్తారు. చెత్త చెదారం ప్రతిచోటా వెదజల్లుతారు.

ఎందువల్ల? భయభక్తులు లేకే! అక్కడ విదేశాల్లో క్షణాల్లో పట్టుకుని శిక్షిస్తారు. మరి ఇక్కడో...?
ఎందుకు లెండి అందరికీ తెల్సిన కథాకమామీషుల్ని పదేపదే వల్లె వేసుకోవటం...
కంట్రోల్స్ ఉండాలి. భయముండాలి. నేరాలకు కఠినమైన శిక్షలు వెంటనే అమలు కావాలి. ఇలా ఎన్నెన్నో.. ఇవి లేకనే మనం ఇంకా మిగతా దేశాల కన్నా ఎంతో వెనకబడి ఉన్నాం. చైనా దేశ పురోగతిని ఉదహరిస్తారు వీరు.

ఇవి కొందరి అభిప్రాయాలు, ఆలోచనలు కాగా మరికొందరి దృష్టిలో పేట్రేగిపోతున్న స్వార్థం, లంచగొండితనం మన దేశ భవిష్యత్తును చావుదెబ్బకొడుతున్నాయని. వీరు ఇచ్చే ఉదాహరణ ఆనాటి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మన దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న సమయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు..

"అధికారం రోగ్సు (మోసగాళ్లు), రాస్కెల్స్ (దుష్టులు, పోకిరివాళ్లు), ఫ్రీ బూటర్స్ (దోచుకునే వాళ్లు, కొల్లగొట్టేవాళ్లు) హస్తగతమౌతుంది. భారత దేశంలోని నాయకులందరూ 'లో కేలిబర్'- తక్కువ మేధాశక్తి, బలహీన వ్యక్తిత్వాలు గల వారుగా ఉంటారు. తీయని పలుకులు, బుద్ది హీనత్వం వారి సొంతం. అధికారం కోసం తమలో తాము యుద్ధాలు చేసుకుంటారు. ఫలితంగా రాజకీయ అంతర్యుద్ధాలతో దేశం నష్టపోతుంది..''
నేడు జరుగుతున్న కథే ఇది. మనమంతా కష్టపడి చర్చిల్ మాటలను నిజం చేసుకుంటున్నాం. రాజకీయ అంతర్యుద్ధాలు, ముఠాతత్వాలు, అలసత్వం, స్వార్ధం ఎలాంటి భయభక్తులు, కంట్రోల్సు లేకపోవటం దేశాన్ని భ్రష్టు పట్టించి, పలు దేశాల కన్నా, సహజ సంపదలున్నా మనమింకా బీదరికం, రోగాల్తో కొట్టుమిట్టాడి పోతున్నాం.

ఈ చీకట్లో కాంతి పుంజాల్లాంటి వారు నేటి యువత. వారు చూపిస్తున్న అసాధారణ చొరవ, ప్రజ్ఞాపాటవాలు. మనం సాధిస్తున్న కాస్తో కూస్తో నేటి ప్రగతికి మూలకారణాలు. నిజానికి ఈ దేశ భవిష్యత్తుకి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలకమైన వారు మన దేశ యువతే.

నేడు దేశం గర్వింప దగ్గ వ్యాపారవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాలకు చెందిన నిపుణులు.. వీరందరూ ఎంతో చిన్నవారే. గతంలో లాగా తలలు పండితేనే విజయాలు వరించాల్సిన అవసరం లేదు నేడు. కొత్త ఉత్పాదనల ఆవిష్కరణలతో, సరికొత్త టెక్నాలజీలతో ఎంతో మంది యువకులు నాలుగు పదుల వయస్సు రాకముందే పేరు ప్రతిష్ఠలు అవి తెచ్చే ధన సంపదలతో తులతూగుతున్నారు దేశ విదేశాల్లో.. ఇవన్నీ స్వార్జితమైనవి.

కష్టపడి సంపాదించుకున్నవి. మనకు మార్గదర్శకమైనవి వీరి ప్రయోగాలు, విజయాలు. వీరెవ్వరూ కుటుంబ పలుకుబడి మీద, పెట్టుబడుల మీద, తరతరాలుగా వస్తున్న వ్యాపారాల పైన, వృత్తుల పైన ఆధార పడకుండా తమ తమ సామ్రాజ్యాలను సృష్టించుకొన్నారు పట్టుదలతో.. గమ్యాలతో రేయింబవళ్లు ఏకం చేసి.. ఇలాంటి వారు వందల్లో, వేలల్లో, లక్షల్లో విజయాలను తమ కైవసం చేసుకుంటుంటే నేటి భారతంలో మనమూ ఆ పని చేయొచ్చు కదా! వారు మనలాగే సామాన్యులే కదా.. స్వశక్తిపై నమ్మకం ఉంచుకుని ముందడుగు వేసిన వారే కదా ! వారూ మనలాగే రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు.. ఇంకా ఇతర శరీర అవయవాలు కలవారే కదా !!!

వారిలో ఎంతమంది మనలాగే అట్టడుగు సమాజం నుంచి లేచివచ్చి ఈ సువిశాలమైన ఆకాశం కింద తమ అస్థిత్వాన్ని నిరూపించుకున్నవారే. తమ ఉనికిని పదిల పరుచుకున్నవారే. వీరిలో ఒకరు మనందరికి ఎంతో సుపరిచయమైన ధీరూభాయి అంబానీ గారు. ఎంతో క్లుప్తంగా వారి గురించి ముచ్చటిస్తాను ఇక్కడ.. ఎందుకంటే వారి గురించి రెండు పుస్తకాలు (ధీరూభాయిజమ్, ఎదురీత), పలు వ్యాసాలు, గతంలో రాయటం జరిగింది.
దేశాభివృద్ధి గురించి, నేటి భారతంలోని వ్యాపార విజయాల గురించి, గమ్యాలతో పట్టుదలతో ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి పోరాడి దేశంలోని లక్షల మందికి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ధీరూభాయి. అందుకని వారి జీవిత విశేషాలు, ఇక్కడ క్లుప్తంగానైనా ముచ్చటించుకోవటం అవసరం.

వారు వ్యాపార రంగ ప్రవేశం చేసినప్పుడు మన దేశంలోని పరిస్థితులు నేటికి పూర్తిగా విరుద్ధం. లైసెన్స్ కోటారాజ్ తీవ్రంగా రాజ్యమేలుతున్న రోజులవి. సామాన్య కోరికలు కూడా ఆకాశంలో నక్షత్రాల్లా అందకుండా పోయిన రోజులవి. అన్నిటికీ కొరతలే పాలడబ్బాల నుంచి ప్లెయిన్‌లో సీటు దాకా.

అన్నిటికీ పరపతి కావాలి. ఫోను కావాలన్నా, స్కూటర్ కావాలన్నా, బ్యాంకులో లోను కావాలన్నా... పరపతి, ఆపై ఓర్పు మెండుగా ఉండాల్సిన కాలమది. ఫోను, స్కూటర్ వగైరాలు గృహ ప్రవేశం చేయాలంటే పది పదిహేను సంవత్సరాల నిరీక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో కలలకు, గమ్యాలకు, పట్టుదలకు చోటేది..!?

నిరీక్షణ, ఓర్పు- రెండే ప్రధాన జీవితావసరాలు ఆ రోజుల్లో. వ్యాపార రంగం నత్తనడకన నడుస్తున్న కాలం. వ్యాపారస్తులంటే అనుమానంతో చూడబడుతున్న సమయం. అటువంటి దేశ కాల పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి తన జీవిత కాలంలోనే, ముప్ఫై ఏళ్ల లోపే అంతర్జాతీయ శ్రేణికి చెందిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ధీరూభాయి.

పాలడబ్బాలకు పరపతి ఉపయోగించాల్సిన దేశంలో, అంతటి వ్యాపార సా మ్రాజ్య స్థాపనలో ఆయన ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొని ఉంటారో ఊ హించుకోండి.అందువల్లే ఆయన మనలాంటి సామాన్యులకు స్ఫూర్తిదాత, మా ర్గదర్శకుడయ్యారు. ఈ దేశంలో సామాన్యులు కూడా గొప్ప కలలు కని వాటిని తమ తమ జీవిత కాలాల్లోనే సాకారం చేసుకునే ధైర్యాన్ని మనలో కలిగించారు.

ధీరూభాయి అంత ఎత్తు ఎదగాలని నేడు కలలు కనే యువకులు లక్షల్లోనే ఉంటారు మనదేశంలో.. మన ఆలోచనా విధానంలో ఈ పెనుమార్పు ఆయన సాధించిన విజయాల వల్లే ఏర్పడింది. ఇన్ని విజయాలు సాధించిన ధీరూభాయి 28 డిసెంబర్ 1932న హీరాచంద్, జమునాబెన్ అంబానీలకు ఐదో సంతానంగా గుజరాత్‌లోని చోర్‌వాడ్‌లో పుట్టాడు.

హీరాచంద్ టీచరు. ఆనాటి పలువురిత ఉపాధ్యాయుల్లాగా బీదవాడు హీరాచంద్. చెప్పుల్లేని కాళ్లు, వంటికి రెండే రెండు జతల బట్టలు, స్కూలు ఫీజు కట్టాలంటే. తనే స్వయంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు. బజ్జీలు చేసి వచ్చిన లాభాలతో స్కూలు ఫీజు కట్టేవాడు చిన్న ధీరూభాయి.

ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాక తన 17వ ఏట కుటుంబాన్ని పోషించటానికి బ్రిటీష్ కాలనీ అయిన ఎడెన్‌కి వెళ్లారు. అడుగులోనే హంసపాదన్నట్లుగా ఏ ప్యాసింజర్ షిప్‌లోనూ సీటు దొరకలేదు. సమయంలో చేరకపోతే ఉద్యోగం మాయమవుతుంది. కార్గో షిప్‌లో ప్రయాణం చేసి గడువులోగా ఎడెన్ చేరుకున్నాడు.

శుద్దమైన బ్రిటీష్ ఇంగ్లీష్ భాష అక్కడి వాడుక భాష. తనకు ఇంగ్లీష్‌తో అంతగా పరిచయం లేదు. మరో సమస్య. ఇలా జీవితాంతం అన్నీ సమస్యలే. తొమ్మిదేళ్ల అనంతరం ఎడెన్ నుంచి బాంబే వచ్చి కొద్దిపాటి మూలధనంతో ఆహార దినుసుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం మొదలు పెట్టారు. ఇతర వ్యాపారులతో సమస్యలు. మెల్లగా ఎదిగి యార్న్ వ్యాపారంలోకి ప్రవేశించి 1966లో తమ సొంత బట్టల తయారీకి మొదలుపెట్టారు.

'విమల్' ఆ వస్త్ర సంపద పేరు. గమ్యం పద్ధతుల మీద పూర్తి నమ్మకం, అవగాహన ఉన్న వ్యక్తి ధీరూభాయి.
ఏ వ్యాపారం చేసినా, అందులో ప్రధమ స్థానం ఆక్రమించాలన్నది గమ్యం.
పద్ధతులు- ఉత్తమ శ్రేణికి చెందిన టెక్నాలజీ, మానవ వనరుల సహాయంతో అత్యుత్తమ ఉత్పాదనలకు పెద్దపీట వేశారు.
వ్యాపారమన్నాక జీవితంలో లాగానే ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులు సహజం.

కనుక వాటి నుంచి పారిపోకుండా, ఎదురొడ్డి పోరాడి విజేత కావాలన్నది మరో వ్యూహం. ఈ ప్రయాణంలో మంచి టీము, వారికి స్ఫూర్తినిచ్చే ఛాలెంజెస్, జీత భత్యాలు సంస్థతో మమేకమయ్యేలా పరిసరాలు, పరిస్థితులు సమకూర్చటం మరో వ్యూహం.

నేను 23 ఏళ్లు వారితో కలిసి పని చేశాను. ఏనాడు నేను ఒక ఉద్యోగస్తుణ్ని 9 నుంచి 5 దాకా పనిచేసి. నెలాఖరున జీతం పుచ్చుకుని అంటీముట్టనట్లు వ్యవహరించలేదు. వారి కుటుంబంలో, వారి కలల్లో, గమ్యాల్లో, కష్టాల్లో ,సుఖాల్లో మాలాంటి వారు భాగస్తులు, ఇది మా కృషి వల్లకాదు. వారి చొరవ వల్లే.

ప్రభుత్వ పరంగా, పోటీ దారుల నుంచి, పత్రికల నుంచి పెను సమస్యలే ఎదురయ్యాయి ధీరూభాయికి . పోరాడారే తప్ప పారిపోవాలనుకోలేదు. విదేశాల్లో సెటిల్ కావటం ఆ రోజుల్లో చాలా ఫ్యాషనబుల్, ధీరూభాయికి కాదు. జీవితాంతం మధ్యతరగతి విలువలు ఎదుటివాడికి సహాయం చేసే తత్వం ధీరూభాయిది. ప్రతిభకు పట్టం కట్టేవారు, మాలాంటి వారంటే బోలెడంత ప్రేమాభిమానాలు. ఎంతో గౌరవించేవారు.
భారతీయ వ్యాపార రంగంలోని పలువరి దిగ్గజాలతో నాకు పరిచయాలున్నప్పటికి ధీరూభాయి లాంటి వ్యాపార వేత్తను, వ్యక్తిని మరెవరిలో చూడలేదు. ధైర్యం.. గమ్యాలు .. వాటిని చేరుకునే విధానాలు.. అన్నీ సుసాధ్యాలేనని నమ్మే పాజిటివ్ వ్యక్తిత్వం.. ఇతరులను నమ్మి, వారికి బాధ్యతలను అప్పగించగలిగిన ధైర్య సాహసాలు.. గొప్ప కలలుకనే ఆత్మస్థైర్యం, వాటిని ఎలాగైనా చేరుకోవాలనే తపన. అసాధ్యమైన కలలంటూ ఏవీ ఉండవనే గాఢ విశ్వాసం.

ధీరూభాయి గారి అస్త్రాలు ఇవన్నీ. అతి సామాన్యుడు, అసామాన్యుడైనాడు కేవలం మూడు దశాబ్దాల్లో, తన జీవిత కాలంలోనే. ఇది అందరికీ సాధ్యమేనని నమ్మి, మనని నమ్మించి, మనలో కలల్ని, గమ్యాల్ని ప్రేరేపించగలిగారు ధీరూభాయి ఇదే ఆయన విజయం. 
-ఎజి కృష్ణమూర్తి