ఇండియాలో మంచి చదువులే చదువుకున్నా అమెరికాకి రాగానే ఆ చదువుకు సంబంధం
లేని మంచి జీతాలొచ్చే వేరే ఉద్యోగాలకి చాలామంది వెళ్లిపోతారు. కానీ
కొంతమంది మాత్రం తమకు సంతృప్తినిచ్చే ఉద్యోగంలోనే కొనసాగి ఉన్నత స్థానాలకి
ఎదుగుతారు. అలా ఎదిగిన వారిలో జయశ్రీ జానకీరాం కూడా ఒకరు. చాలామంది వేరే
ఉద్యోగాలకి ప్రయత్నం చేయమని చెప్పినా వినలేదు నేను. నాకు నచ్చిన పనిలోనే
కొనసాగుతున్నాను అంటున్న జయశ్రీ వాషింగ్టన్లో చ్రిల్డన్ నేషనల్ మెడికల్
సెంటర్లో విమెన్, ఇన్ఫాంట్, చ్రిల్డన్ సప్లిమెంటల్ న్యూట్రిషన్
ప్రోగ్రామ్కి లోకల్ ఏజెన్సీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆవిడే
మన పరదేశీ....
"పెళ్లయ్యి అమెరికా వచ్చాక చదువుకున్న చదువుకి న్యాయం చేయాలని, అదే సమయంలో
నలుగురికీ ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో రిజిస్టర్డ్ డైటీషియన్
ఇంటర్న్షిప్ చేసి డైటీషియన్ అయ్యాను'' అని అంటారు జయశ్రీ. "అమెరికాలో
ఉద్యోగాలు చేసేవారు ఆ ఉద్యోగాలకి తగ్గట్టు అక్కడి వస్త్రధారణ చేసుకుంటారు
కదా మరి మీరెప్పుడూ చీరలో, కుంకుమ బొట్టుతోనే కనిపిస్తారు'' అని అడిగితే...
"మన భారతీయ సంస్కృతి, ఆచారాలు, పద్ధతులంటే అన్ని సంస్కృతుల వారికి ఎంత
గౌరవమో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
ఇక్కడ పనిచేసేటప్పుడు పాశ్చాత్య
దుస్తులే వేసుకోవాలి, లేకపోతే ఉద్యోగం చేయలేవు అని ఇక్కడికి రాకముందు
చాలామంది నాతో చెప్పారు. కానీ నేను అమెరికాకు వచ్చినప్పటినుండి చీర తప్ప
వేరే దుస్తులు వేసుకోలేదు. నా సహచరులు నేను మారకుండా ఉన్నందుకు నన్ను చాలా
గౌరవిస్తారు. ఒక్కోసారి చిన్నపిల్లలు నా బొట్టు చూసి ప్రశ్నలేస్తుంటారు.
అది మన సంస్కృతి గురించి పిల్లలకు చెప్పే అవకాశంగా తీసుకుని నేను వారికి
అర్థమయ్యేలా బొట్టు గురించి చెప్తాను'' అని గర్వంగా చెప్పారు జయశ్రీ.
ప్రయోగ జీవితం...
చిన్నప్పటి నుంచే దేన్నయినా ప్రశ్నించేతత్వం, పరిశోధించేతత్వం జయశ్రీలో
ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి హోమ్సైన్స్లో ఎమ్ఎస్సి చేశాను.
చదువుకునే వయసులో ఉప్పుడు బియ్యం మామూలు బియ్యం కంటే ఎందుకు మెరుగైందనే
ప్రశ్న వేసుకుని సమాధానం కోసం ప్రయోగం చేశారు కూడా. ఈ జిజ్ఞాస ఇప్పటికీ
ఆమెలో అలానే ఉండిపోయింది. అందుకే ఇక్కడ ఉన్న హిస్పానిక్, స్పానిష్
పిల్లల్లో రెండేళ్ల వయసు నుంచే ఊబకాయం ఎందుకు వస్తుందనే దానిపై ఆమె
రీసెర్చ్ చేశారు. టీవీల ముందు కూర్చొని తినడం వలన పిల్లల దృష్టి టీవీ
ప్రోగ్రాంపై ఉండి వారు ఎంత తింటున్నారో తెలియడం లేదు.
కడుపు
నిండినా తింటూనే ఉంటున్నా ఊరికే చూడొద్దు అంటే అంత చిన్న పిల్లలకు అర్థం
కాదు. అందుకని టీవీ ప్రోగ్రాంలు చూసేపుడు మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి కదా
ఆ సమయంలో కొన్ని పుషప్స్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, ఎక్సర్సైజ్ బైక్
ఉంటే అది తొక్కడం, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయమని చెబుతాము. కనీసం
ఇరవై నిమిషాలు ఇలా చేసినా ఆ రోజుకి వారి శరీరాలకు వ్యాయామం కలిగినట్టే. ఈ
కార్యక్రమం వల్ల ఇరవై శాతం ఫలితం సాధించాము. పోగా పోగా ఈ శాతం మరింత
పెరుగుతూ పోతుందనే నమ్మకం మాకుంది'' అని ఒబెసిటీని చిన్న పిల్లల్లో ఎలా
తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో జయశ్రీ తెలియజేశారు.
బిడ్డకు తల్లి పాలు ఎంత మంచివో కూడా జయశ్రీ ప్రచారం చేస్తుంటారు. కేవలం
ప్రచారం చేయడమే కాదు కొత్తగా తల్లులయిన వారి నుంచి బిడ్డలకు డబ్బాపాలు
తాగించబోమనే పత్రంపై సంతకం తీసుకుంటారు. వారికి తల్లి పాల వలన కలిగే మేలును
బోధిస్తారు. ఆస్పత్రుల్లో, స్కూళ్ళలో, కమ్యూనిటీ క్లినిక్లలో ప్రతి నెలా
వేలమందికి పైగా క్లయింట్లను ఈమె చూస్తారు. తమతో పదేళ్ళుగా కలిసి పని
చేస్తున్న వివిధ ఏజెన్సీలకు అవసరమైన నిధులను కూడా జయశ్రీ సేకరిస్తుంటారు.
ఆయా ఏజెన్సీలకు చేదోడు, వాదోడుగా ఉంటారు.
కలసిపోతే కలదు సుఖం...
"ఇక్కడి జీవితానికి ఎలా అలవాటుపడ్డారు?'' అని అడిగితే తన గతాన్ని జయశ్రీ
తడుముకుంటూ..." నేను తొలిసారి అమెరికాలో అడుగుపెట్టినపుడు నా భర్త
జానకీరామ్, మరో ఇద్దరు అమెరికన్ స్నేహితులు నాకు స్వాగతం పలికారు. ఇప్పటికీ
ఆ ఇద్దరూ మాకు మంచి సన్నిహితులే. ఇక్కడ ఇతరులతో త్వరగా కలసిపోవచ్చు. నాకు
పరిచయం ఉన్న వారిలో గ్రీక్, యూరోపియన్, ఆసియా, దక్షిణ అమెరికాల వాళ్ళు
ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్నారు.
వాషింగ్టన్ డి.సిలో మా అమ్మాయి
పెళ్లి చేసినపుడు వచ్చిన అతిథుల్లో సగం మంది భారతీయులు ఉంటే, మిగతా సగం
వివిధ దేశాల వారు ఉన్నారు. అలాగే మా అబ్బాయి వివాహం భారతదేశంలో జరిపినపుడు
కూడా ఇక్కడి వారు చాలామంది మన దేశానికి వచ్చారు. అంతగా ఇక్కడి వారితో
మమేకమయ్యాను'' అంటూ చెప్పుకొచ్చారు.
ఆనందాల కొలువు...
మన సంప్రదాయాలకు జయశ్రీ పెద్ద పీట వేస్తారు. అందుకే వారి ఆఫీసులో ఫ్యాషన్
షో నిర్వహించినపుడు స్త్రీలందరూ చీరలు కట్టుకుని వచ్చేట్టు చేశారు. జయశ్రీ
ఇంట్లో జరిగే సంక్రాంతి పండగ ఒక అంతర్జాతీయ వేడుకలా కనిపిస్తుంది. ఆరోజు
ఏర్పాటు చేసే బొమ్మల కొలువుకు వివిధ దేశాల వారు వస్తారు. ఆ సంబరంలో రకరకాల
ఆహారం పలకరిస్తుంది. ఒక వైపు సమోసాలు, ఇంకోవైపు ఇటాలియన్, మెక్సికన్,
గ్రీక్, యూరోపియన్ రుచులు కూడా నోరూరిస్తాయి. ఇలా అన్ని దేశాలకు చెందిన
వ్యక్తుల నడుమ ఆమె సంక్రాంతిని జరుపుకుంటారు. మాతృదేశంలో జరిగే సంక్రాంతి
వేడుకలకు దూరమైనా అలా అందరి సమక్షంలో చేసి ఆనందాన్ని తాము పొందడమే కాకుండా
ఇతరులకూ మన సంస్కృతిని పరిచయం చేస్తున్నారు.
పిల్లల్లో రెండేళ్ల వయసు నుంచే ఊబకాయం ఎందుకు వస్తుందనే దానిపై ఆమె
రీసెర్చ్ చేశారు. టీవీల ముందు కూర్చొని తినడం వలన పిల్లల దృష్టి టీవీ
ప్రోగ్రాంపై ఉండి వారు ఎంత తింటున్నారో తెలియడం లేదు. కడుపు నిండినా
తింటూనే ఉంటున్నా ఊరికే చూడొద్దు అంటే అంత చిన్న పిల్లలకు అర్థం కాదు.
అందుకని టీవీ ప్రోగ్రాంలు చూసేపుడు మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి కదా ఆ
సమయంలో కొన్ని పుషప్స్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, ఎక్సర్సైజ్ బైక్ ఉంటే
అది తొక్కడం, అటు ఇటు పరిగెత్తడం లాంటివి చేయమని చెబుతాము. కనీసం ఇరవై
నిమిషాలు ఇలా చేసినా ఆ రోజుకి వారి శరీరాలకు వ్యాయామం కలిగినట్టే.
- కనకదుర్గ (అమెరికా నుంచి)
ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడు.
హెన్రీ ఫోర్డ్... కార్ల కంపెనీ ఓనరు.
‘‘ఫోర్డ్.. ఒక చెయ్యి వెయ్యి. చక్రం తిప్పుదాం’’ అన్నాడు విల్సన్!
శాంతి స్థాపన కోసం,
నానాజాతి సమితి ఏర్పాటు కోసం
విల్సన్ ప్రయత్నం.
ఫోర్డ్ ఆల్రెడీ ‘చక్రం’ తిప్పుతున్నాడు.
అమెరికా రోడ్ల నిండా ఫోర్డ్ చక్రాలే!
ఫోర్డ్ ఒక మాట చెబితే చాలు సెనెట్లో
విల్సన్ వెయిట్ పెరుగుతుంది.
అందుకే అడిగాడు విల్సన్.
ఫోర్డ్కీ, ఫోర్డ్ కంపెనీకి
అంత వాల్యూ ఎలా వచ్చింది?
‘మొబిలిటీ’ అంటాడు ఫోర్డ్.
మనిషి మెషీన్లా తిరగాలంటాడు ఫోర్డ్.
ఈ చలనశీలి జీవిత చక్రమే ఈ బయోగ్రఫీ.
హ్యాపీ క్రిస్మస్... మిస్టర్ హెన్రీ ఫోర్డ్!
హ్యాపీ క్రిస్మస్... దేశభక్త నిర్యుద్ధ యోధుడా!
హ్యాపీ క్రిస్మస్... డియర్ కార్మిక ప్రియతమా!
*******
హెన్రీ ఫోర్డా! ఇంకా ఎక్కడున్నారు ఆయన? ఎలా అందుతాయి మన శుభాకాంక్షలు? అవి దివికేగుతాయా? ఆయనే భువికి దిగుతారా? ఏదైనా జరగొచ్చు.
హెన్రీకి క్రిస్మస్ అంటే ఇష్టం. పిల్లలంటే ప్రీతి. ధ్యాసగా చూడండి. ఏ క్రిస్మస్ చెట్టు నీడలోనో నక్షత్రమై ఆయన ఆత్మ వెలుగుతూ ఉంటుంది. లేదంటే - ఇంటి ముందు- పిల్లల నవ్వుల్లో, కేరింతల్లో!
శాంతాక్లాజ్ ఎదురుపడితే మాత్రం హెన్రీ ఫోర్డ్ గురించి ఆయన్ని వాకబు చెయ్యకండి. ఎందుకంటే - శాంతాక్లాజ్ పెద్దగా నవ్వొచ్చు. ఆ నవ్వుతున్నది మారువేషంలో ఉన్న హెన్రీ ఫోర్డ్ కావచ్చు!
హెన్రీ ఇలాగే చేసేవారు. శాంతాక్లాజ్ వేషం వేసుకుని, గుర్రపు బగ్గీలో కూర్చుని వీధుల వెంట తిరిగేవారు! చిన్నారులు కనిపిస్తే ఆగి, ఆ చిట్టిచేతుల నిండా బంగారు కానుకలు పెట్టి, బుగ్గపై చిటిక వేసి ముందుకు సాగిపోయేవారు.
ఇప్పుడైనా ఏం తక్కువ?
ఇక్కడో అక్కడో హెన్రీ ఉండే ఉంటారు? పిల్లలకోసం చూస్తూ ఉండి ఉంటారు. హెన్రీకొక నమ్మకం. తను మళ్లీ పుడతానని! అలా పుట్టి ఉంటే ఆయనకిప్పుడు అరవై ఐదేళ్లు ఉంటాయి. ఇవాళ క్రిస్మస్ కాబట్టి కచ్చితంగా ఆయన శాంతాక్లాజ్లా ఎదురవుతారు! మన శుభాకాంక్షలు వృథా కావు. హారమై వెళ్లి నమ్మకంగా ఆయన మెడలో పడతాయి.
నమ్మకాలు నిజమైపోతాయా?
హెన్రీకి చాలా నమ్మకాలు ఉండేవి. అవన్నీ చాలావ రకు నిజమయ్యాయి.
కష్టం చేసేవాళ్లకు కంటి నిండా జీతాలు ఇస్తే ఇష్టంగా పని చేస్తారని ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజం అయింది. కార్మికులు కృతజ్ఞతతో పని చేసి ఆయన ఫోర్డ్ కంపెనీని నెంబర్ వన్గా నిలబెట్టారు.
అందరూ ఒకే పని చెయ్యడం కాదు, ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఎక్స్పర్ట్లైతే ప్రొడక్షన్ పెరుగుతుందని ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజమయింది. హెన్రీ కనిపెట్టిన ‘అసెంబ్లీ లైన్’ సిస్టమ్తో ఫోర్డ్ కంపెనీ తక్కువ టైమ్లో ఎక్కువ కార్లు ఉత్పత్తి చేయగలిగింది.
బస్తాల కొద్దీ జీతాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదనీ, కార్మికులకు భద్రం చెప్పాలనీ ఆయన నమ్మారు. ఆ నమ్మకం నిజమయింది. జీతాల పెంపునకు, తాగుడు మానడానికీ ముడిపెట్టడంతో... ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం అంటే పిల్లవాడు శుభ్రంగా ఉంటాడనీ, పిల్లనిస్తే సుఖంగా ఉంటుందనీ పేరొచ్చింది!
యుద్ధం చేసి ఏ దేశమూ గొప్పదైపోదనీ, పరిశ్రమలే ఏనాటికైనా దేశాలకు తలకిరీటం పెడతాయని ఆయన నమ్మారు.
ఆ నమ్మకం నిజమయింది. హెన్రీ కార్ల కంపెనీ... కష్టకాలంలో అమెరికాను నిలబెట్టింది. చేతిలో నాలుగు డాలర్లు పెట్టింది!
హెన్రీకి ఉన్న మరో నమ్మకం -‘రీ ఇన్కార్నేషన్’!
‘‘నా ఇరవై ఆరవ యేట నాకు ఇలాంటి భావన కలిగింది. ఈ జన్మలో అమలు చేయలేని ఆలోచనలను మరుజన్మలో ఆచరణలో పెట్టేందుకు పునర్జన్మ అనేది ఒకటి ఉంటుందని నా నమ్మకం. కాలం పరిమితమైనది కాదు. ముగిసిపోయేదీ కాదు. జన్మజన్మలకు అదొక అనంతమైన వారధి. ఐక్యూ గురించి మాట్లాడుకునేటప్పడు... బై బర్త్ అంటుంటాం. కానీ మనం అనవలసిన మాట... బై మెనీ బర్త్స్ అని! జన్మజన్మల్లోని అనుభవం పోగుపడుతూ వచ్చి, మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. ఎక్కువ జన్మలు అనుభవించి వచ్చిన వారు తర్వాత జన్మలకు సీనియర్ మోస్ట్లు అవుతారు. గ్రేట్ సోల్స్ అంటే అలాంటి వారే.’’
యు.ఎస్. దినపత్రిక ‘ది శాన్ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్’లో 1928 ఆగస్టు 26న యథాతథంగా అచ్చయిన హెన్రీ ఫీలింగ్స్ ఇవి.
*******
హెన్రీ ఫోర్డ్ అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్! ఫోర్డ్ మోటార్ కంపెనీ ఓనర్. మూకుమ్మడి ఉత్పత్తి (అసెంబ్లీ లైన్) అనే టెక్నిక్ ఆయన కనిపెట్టిందే. ప్రపంచాన్ని ఊరించిన మోడల్-టి కారు ఆయన కంపెనీ డిజైన్ చేసిందే. టైమ్ సేవింగ్ కోసం హెన్రీ చాలా చాలా కనిపెట్టారు. అందులో ఒకటి అసెంబ్లీ లైన్ టెక్నిక్. ఇంకొకటి కార్మికుల జీతాలను విపరీతంగా పెంచడం. ఈ రెండు కాన్సెప్టులు ‘ఫోర్డిజం’గా ప్రఖ్యాతి చెందాయి. హెన్రీ ఫోర్డ్ని ప్రపంచ సంపన్నుడినీ, సుప్రసిద్ధుడినీ చేశాయి.
ఏడు వందల పరికరాలను బిగిస్తే ఒక మోడల్-టి కారు తయారవుతుంది. అందరూ ఒక కారునే, అది పూర్తయ్యేవరకూ తయారుచేస్తూ కూర్చుంటే తలప్రాణం తోకకు వస్తుంది. ఐదో ఆరో కార్లు బయటికొస్తాయి. డిమాండ్ ఎక్కువ. సప్లయ్ తక్కువ. ఎలా? హెన్రీ ఆలోచించారు. ఉత్పత్తి సమయం ఎక్కడ కిల్ అవుతోందో గమనించారు. ఒక మనిషికి రెండుమూడు రకాల పనులున్నాయి. ఒక పని నుంచి ఇంకో పనికి షిఫ్ట్ అవడానికి వారికి కొంత టైమ్ పడుతోంది. దాన్ని సేవ్ చేయాలంటే వేరే పనికి షిఫ్ట్ అయ్యే అవసరం లేకుండా చెయ్యాలి. అలాగే చేశారు హెన్రీ. ఒక మనిషి రోజంతా ఒకే పని చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. కారు చక్రాలు తయారు చేసేవారు చక్రాలు, ఇంజిన్లు తయారు చేసేవారు ఇంజిన్లు. ఇలా! ఇంజిన్లలో మళ్లీ విడిపరికరాలు తయారు చేయవలసిన వారు ఇంకో గ్రూపు. ఇలా అన్ని వైపుల నుంచి విడిపరికరాలు కుప్పలు తెప్పలుగా తయారవుతుంటాయి. వాటిని అసెంబుల్ చేసే గ్రూపు చకచకా అసెంబుల్ చేసేస్తుంటుంది. కార్లు ఒకదాని వెంట ఒకటి తయారై వస్తుంటాయి. ఇదే అసెంబ్లీ లైన్ కాన్సెప్ట్.
టైమ్ అంటే హెన్రీకి గౌరవం. టైమ్ని సేవ్ చేయ్యడం కోసం అవసరమైతే టైమ్ని వేస్ట్ చేసుకుంటారు!
ఓసారి ఎవరో అడిగారు హెన్రీ ఫోర్డ్ని - ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఎగ్జిక్యూటివ్ల దగ్గరికి మీరే ఎందుకు వెళతారు. వాళ్లనే మీ దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా అని.
‘‘టైమ్ సేవ్ చెయ్యడానికి’’ అని చెప్పారు హెన్రీ.
వాళ్లు తన దగ్గరకు వచ్చే లోపే, తను వాళ్ల దగ్గరికి వెళ్లిపోగలరు హెన్రీ.
పన్నెండో యేట తొలిసారి ‘టైమ్ బౌండ్’ అయ్యాడు హెన్రీ! అప్పటి వరకు - నాన్న నిమిషాల ముల్లు, అమ్మ గంటల ముల్లు అతడి జీవితానికి.
‘‘ఇవాళ్టి నుంచి దీన్ని ఫాలో అవు’ అన్నారు విలియమ్ ఫోర్డ్, ఓ రోజు తన చేతి గడియారాన్ని తీసి కొడుక్కి ఇస్తూ.
హెన్రీ ఫోర్డ్ ఆ ఇంట్లో పెద్ద కొడుకు. హెన్రీ తర్వాత ఇద్దరు అమ్మాయిలు. మార్గరెట్, జేన్. వాళ్ల తర్వాత ఇద్దరబ్బాయిలు విలియమ్, రాబర్ట్.
తండ్రి ఇచ్చిన గడియారాన్ని ఇష్టంగా తడిమి చూసుకుంటున్నాడు హెన్రీ ఫోర్డ్.
‘‘పెద్దవాడివౌతున్నావ్. ఇక నీకెవరూ చెప్పరు. నువ్వే ఒకరికి చెప్పాలి’’ అంది అతడి తల్లి మేరీ లిటోగాట్.
హెన్రీకి, పెద్ద చెల్లికి మధ్య నాలుగేళ్లు తేడా. హెన్రీకి ఆఖరి తమ్ముడికీ మధ్య పదేళ్లు తేడా. తల్లిదండ్రుల తర్వాత హెన్రీనే ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద.
చేతిగడియారాన్ని కొన్నాళ్లు జాగ్రత్తగా ఫాలో అయ్యాడు హెన్రీ. తర్వాత అతడికో సందేహం వచ్చింది! మనుషుల్ని వాళ్ల ఇష్టానుసారం కూర్చోనివ్వకుండా, నిలబడనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా... వెనక ఉండి తరుముతున్న ఈ గడియారంలో లోపల ఏం ఉండి ఉంటుంది? ఎలా ఉండి ఉంటుంది?
గడియారాన్ని విప్పదీశాడు. వీలైనన్ని విడిభాగాలుగా వేరుచేశాడు.
ముళ్లు ఆగిపోయాయి!
విప్పి, వేరు చేసిన క్రమంలోనే తిరిగి ఒక్కో భాగాన్నీ శ్రద్ధగా బిగించాడు.
ముళ్లు తిరుగుతున్నాయి!
ఆ రోజు నుంచి గడియారాల మెకానిక్ ఐపోయాడు హెన్రీ ఫోర్డ్. ఫ్రెండ్స్ ఇళ్ల నుంచి, ఇరుగు పొరుగు నుంచి పనిచేయని గడియారాలు అతడి దగ్గరికి వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగయ్యాక పరుగులు తీస్తున్నాయి. మంచి గడియారాల డాక్టర్గా పేరొచ్చింది హెన్రీకి ఆ చుట్టుపక్కల. అయితే ఈ డాక్టరుగారికి ఆదివారం సెలవు. ఆదివారం అతడు చర్చికి వెళతాడు.
హెన్రీ కుటుంబం ఉంటున్న గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ నుంచి చర్చికి నాలుగు మైళ్ల దూరం. అంతదూరం వారం వారం నడిచి వెళ్లొస్తుంటాడు హెన్రీ. గ్రీన్ఫీల్డ్లో హెన్రీ తండ్రికి కొద్దిగా పొలం ఉంది. తల్లి రోజంతా ఆ పొలంలో పనిచేస్తుంటుంది. స్కూల్ అయ్యాక, పొలంలో తల్లిని వెతుక్కుంటూ వెళతాడు హెన్రీ. ఆమెతో ఆ పూట కబుర్లు చెప్పి కడుపారా నవ్విస్తాడు. శ్రమను మర్చిపోయి తల్లి అలా నవ్వుతూ ఉంటే చూడ్డం హెన్రీకి ఇష్టం. పొలం గట్ల మీద తల్లి వెనక... అడుగులో అడుగు వేసుకుంటూ చీకటి పడే వేళకు ఆమెతో పాటు ఇంటికి చేరుకుంటాడు. ఒకరోజు తల్లి కోసం పొలానికి కాకుండా, స్కూల్ నుంచి నేరుగా ఇంటికి రావలసి వచ్చింది హెన్రీకి.
హెన్రీ జీవితంలో అంతకన్నా విషాదమైన రోజు లేదు. తల్లి చనిపోయిందన్న వార్త విన్న రోజు అది! అంత పెద్ద దుఃఖాన్ని పదమూడేళ్ల ఆ చిన్న శరీరం తట్టుకోలేకపోయింది. ఏడ్చి ఏడ్చి ఇక ఏడవలేక నీరసపడి... నిద్రపోతున్నట్లు ఉన్న అమ్మ మీద వాలిపోయాడు. చాలాకాలం పాటు అతడు పొలం మొహం చూడలేదు. తండ్రి కూడా అతడిని బలవంతం చెయ్యలేదు.
‘‘అమ్మే కనుక రోజూ నాకు పొలంలో కనిపించపోతే నేను మా పొలాన్నే ప్రేమించేవాడినే కాదు’’ అని హెన్రీ ఆ తర్వాత తన ఆత్మకథ ‘మై లైఫ్ అండ్ వర్క్’లో రాసుకున్నారు.
*******
తల్లి పోయాక హెన్రీ కాలం పూర్తిగా స్తంభించిపోయింది. గడియారాలను నడిపించిన బాలుడి జీవిత గడియారం సడెన్గా ‘స్ట్రక్’ అయింది. ఇల్లొదిలి డెట్రాయిట్ సిటీ చేరుకున్నాడు. అక్కడి జేమ్స్ ఫ్లవర్ అండ్ బ్రదర్స్ కంపెనీలో కొన్నాళ్లు వాచ్ రిపేరర్గా కొద్ది జీతంతో పని చేశాడు. తర్వాత డెట్రాయిట్ డ్రై డాక్ కంపెనీలో చేరాడు. అదీ వదిలి, తల్లి లేని గూటికే తిరిగి చేరుకున్నాడు. కొన్ని రోజులు తల్లి నడిచిన దారిలో పొలం గట్లపై వెల్లకిలా పడుకుని, తల్లికోసం ఆకాశంలోకి చూసేవాడు. ఆమె పాదాలు తాకి ఉంటాయని భ్రమించిన చోట... మట్టినేలకు చెంపలు ఆన్చి కన్నీళ్లు పెట్టుకునేవాడు. అదను చూసి కాలం అతడిని మెల్లిగా పొలం పనుల్లో పెట్టింది!
ఓరోజు పొలంలోని వెస్టింగ్హౌస్ కంపెనీ స్టీమ్ ఇంజిన్ పాడైపోతే తనకు తనే రిపేర్ చేశాడు హెన్రీ! తర్వాత అదే కంపెనీలో ఇంజిన్ల సర్వీసింగ్ సెక్షన్లో చేరాడు. కాలం అతడిని నడపవలసిన వైపే నడుపుతోంది! పని చేస్తూనే, డెట్రాయిట్లోని గోల్డ్స్మిత్, బ్రియాంట్ అండ్ స్ట్రాటన్ బిజినెస్ కాలేజ్లో పార్ట్ టైమ్గా బుక్కీపింగ్ నేర్చుకుంటున్నాడు.
హెన్రీకి పందొమ్మిదేళ్లు. ఇక్కడో కాలు అక్కడో కాలు వేస్తున్నాడు. ఎక్కడా కుదురుగా ఉండడం లేదు. కొన్నాళ్లు సొంతంగా రంపం మిల్లు నడిపాడు. రాలిందెంతో, తేలిందెంతో తెలీదు. పొలం నుంచి వస్తూ ఒక సాయంత్రం లెక్క చూసుకున్నాడు. మిగిలిందేమీ లేదు. పోయింది మాత్రం ఐదేళ్లు! ఐదేళ్లు బూడిద!
ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు హెన్రీ. అంతకన్నా ముందు - అతడి పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు తండ్రి!
హెన్రీ సంపాదిస్తున్నదేమీ లేదు. నాకు పెళ్లేమిటి? అన్నాడు. వచ్చే దాన్ని చూస్తూ, పోయేదాన్ని పట్టించుకోకపోతే ఎలా అన్నాడు తండ్రి. హెన్రీకి అర్థమైంది. వయసు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పటికి హెన్రీకి పాతికేళ్లు. తండ్రి మాట విని క్లారా బ్రియాంట్ను పెళ్లి చేసుకున్నాడు. ఎడిసన్ ఇల్యుమినేటింగ్ కంపెనీలో ఇంజినీర్గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఒకేసారి అతడికి రెండు ప్రమోషన్లు వచ్చాయి!
ఒకటి: కంపెనీ చీఫ్ ఇంజినీర్గా. ఇంకొకటి: తండ్రిగా. *******
ఎడిసన్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ అంటే కావలసినంత డబ్బు. చేద్దామన్నా ఉండనంత పని! గ్యాసోలిన్తో సొంత ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టాడు హెన్రీ. పూర్వజన్మలలో తనొక ఇంజినీర్నని ఆయన నమ్మకం. ఆ అనుభవాన్నంతా ఉపయోగించుకుని ఏదైనా కనిపెట్టాలని ఆయన తపన. మూడేళ్లు కష్టపడి దానికదే శక్తికూడదీసుకుని నడిచే వాహనాన్ని (సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్) తయారు చేశాడు! దానికి ఫోర్డ్ క్వాడ్రిసైకిల్ అని పేరు పెట్టాడు. టెస్ట్ డ్రైవ్లో అది సక్సెస్ అయింది. థామస్ ఎడిసన్కు ఆ సైకిల్ని చూపించాడు. గో ఎహెడ్ అని థామస్ అతడి భుజం తట్టారు.
మరో రెండేళ్లకు ఇంకో కొత్త వాహనం తయారయింది! డెట్రాయిట్లో పేరున్న కలపవ్యాపారి విలియమ్ మర్ఫీ దానికి డబ్బు సహాయం చేశారు. కొన్నాళ్ల తర్వాత ఎడిసన్ కంపెనీలో ఉద్యోగం మాని డెట్రాయిట్ ఆటోమొబైల్స్ కంపెనీలో చేరాడు హెన్రీ. అక్కడా ఉద్యోగం ఉద్యోగమే. ప్రయోగాలు ప్రయోగాలే. తక్కువ ధరకు నాణ్యమైన ఆటోమొబైల్స్ అందించడానికి హెన్రీ ప్రయోగాలు చేస్తున్నాడు. ఈలోపు డెట్రాయిట్ ఆటోమొబైల్ కంపెనీ చేతులెత్తేసింది. హెన్రీ బయటికొచ్చి, హెరాల్డ్ విల్స్ సమకూర్చిన డబ్బుతో ట్వంటీసిక్స్ హార్స్పవర్ ఆటోమొబైల్ను తయారుచేసి విజయవంతంగా పరుగులు తీయించాడు.
ఫోర్డ్ కంపెనీ ఆవిర్భావానికి ఒక విధంగా అదే తొలి ముహూర్తం. విలియమ్ మర్ఫీ, మూతపడిన డెట్రాయిట్ ఆటోమొబైల్స్ కంపెనీలో కొందరు వాటాదారులు... హెన్రీ ఫోర్డుతో కలిశారు. 1901 నవంబర్ 30న కార్ల తయారీ కంపెనీకి రిబ్బన్ కట్ అయింది. అయితే కొన్నాళ్లకే ఆ కంపెనీతో హెన్రీ సంబంధాలు కట్ అయ్యాయి. కంపెనీ కన్సల్టెంట్గా విలియమ్ మర్ఫీ... హెన్రీ లెలాండ్ అనే మనిషిని తెచ్చుకోవడం హెన్రీకి నచ్చలేదు. ఏడాదికే తన పేరు తను తీసుకుని వేరుపడ్డాడు. హెన్రీ వెళ్లిపోయాక అది క్యాడిలాక్ ఆటోమొబైల్స్ కంపెనీ అయింది.
హెన్రీ నేరుగా తన పాత పరిచయస్తుడు అలెగ్జాండర్ మాల్కమ్సన్ దగ్గరికి వెళ్లాడు. మాల్కమ్సన్ డెట్రాయిట్ ఏరియా బొగ్గు డీలర్. అతడితో కలిసి ‘ఫోర్డ్ అండ్ మాల్కమ్సన్స్ లిమిటెడ్’ ప్రారంభించాడు. కార్లకు విడిభాగాలు తయారు చేసే కంపెనీని లీజుకు తీసుకుని వేల డాలర్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చారు! అయితే కార్ల అమ్మకాలు ఆశించినంతగా లేక, తొలివిడత విడిభాగాల సరఫరాకు కూడా డబ్బు చెల్లించలేకపోయింది హెన్రీ అండ్ కంపెనీ. అలా చెల్లించలేని పరిస్థితే హెన్రీ జీవితాన్ని మలుపుతిప్పింది.
మాల్కమ్సన్కి హెన్రీ టాలెంట్ మీద తిరుగులేని నమ్మకం. ఏనాటికైనా అతడు సాధిస్తాడు. చవగ్గా అందరికీ అందుబాటులోకి వచ్చే నాణ్యమైన ఆటోమొబైల్ను డిజైన్ చేస్తాడు. అప్పుడు అమెరికాతో పాటు, ప్రపంచమంతా ఆర్డర్లు ఇవ్వడానికి తమ కంపెనీ ముందు బార్లు తీరుతాయని అతడి నమ్మకం. ఈ నమ్మకంతోనే మాల్కమ్సన్ కొంతమంది ఇన్వెస్టర్లకు గాలం వేశాడు. బాకీ తీర్చమని గొంతుమీద కత్తిపెట్టి కూర్చున్న విడిభాగాల కంపెనీ హోల్డర్లు డాడ్జ్ బ్రదర్స్ దగ్గరికెళ్లి, డబ్బుకు బదులుగా కొత్తగా పెట్టబోయే కంపెనీలో వాటా ఇస్తాం అని ఒప్పించాడు. వాళ్లు శాంతించారు.
1903 జూన్ 16న ‘ఫోర్డ్ మోటార్ కంపెనీ’ మొదలైంది! మూలధనం ఇరవై ఎనిమిది వేల డాలర్లు. హెన్రీ ఫోర్డ్, మాల్కమ్సన్తో పాటు, డాడ్జ్ బ్రదర్స్, మాల్కమ్సన్ బంధువు జాన్ గ్రే, జేమ్స్ కౌజెన్స్, ఇంకా, మాల్కమ్సన్ లాయర్లు ఇద్దరు జాన్ ఆండర్సన్, హొరేస రాఖమ్... వీళ్లంతా ప్రధాన వాటాదారులు.
తొలిసారి పూర్తిగా ఒక కొత్త డిజైన్తో కారును బయటికి తెచ్చాడు హెన్రీ. సెయింట్ క్లెయిర్ సరస్సులో మంచుపై దాన్ని నడిపి చూపాడు. మైలు ప్రయాణానికి 39.4 సెకన్ల సమయం తీసుకుంది ఆ కారు. అంటే గంటకు 147 కి.మీ. వేగం! ల్యాండ్ స్పీడ్లో అదొక రికార్డ్. రేస్ డ్రైవర్ బార్నీ ఓల్డ్ఫీల్డ్ దానికి 999 అని పేరు పెట్టాడు. ఆనాటి రైలింజన్ పేరు అది. దానికి గౌరవ సూచకంగానే త్రిబుల్ నైన్ అని పెట్టాడు. దాన్నేసుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ తిరిగి మంచి ప్రచారం ఇచ్చాడు.
తర్వాత ఐదేళ్లకు మోడల్-టి అనే కొత్త డిజైన్ కారు ఎడమవైపు స్టీరింగ్తో ఫోర్డ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చింది. మిగతా కంపెనీలన్నీ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ లెఫ్ట్సైడ్ స్టీరింగ్ను ఫాలో అయ్యాయి!
మోడల్-టి లో ఇంకా చాలా మార్పులు చేశాడు హెన్రీ. మొత్తం ఇంజిన్ని, గేర్లు మార్చే ట్రాన్స్మిషన్ను బయటికి కనిపించకుండా కవర్ చేశాడు. ఎగుడుదిగుడు రోడ్లపై సాఫీగా ప్రయాణించేందుకు సస్పెషన్కు రెండు సెమీ ఎల్లిప్టిక్ (పూర్తిగా అండాకారంలో లేనివి) స్ప్రింగులు అమర్చాడు. దీంతో కారుని నడపడం తేలికయింది. రిపేర్లకు అయ్యే ఖర్చుకూడా చాలా తక్కువ. మొత్తం కారు ఖరీదే అప్పట్లో (1908లో) కేవలం 825 డాలర్లు. ఇప్పుడది సుమారు 22 వేల డాలర్లకు సమానం. వ రసగా పదిహేనేళ్లపాటు మోడల్-టి అమెరికాలో ఒక ఊపు ఊపింది. లక్షలమంది అమెరికన్లు మోడల్-టి పైనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. 1914 నాటికి మోడల్-టి కార్ల అమ్మకాలు రెండు లక్షల యాభై వేలకు చేరుకున్నాయి! మరో రెండేళ్లలో ఆ సంఖ్య నాలుగు లక్షల డెబ్బై వేలు అయింది. కారు ధర బాగా తగ్గి 360 డాలర్లకే అందుబాటులోకి వచ్చింది. హెన్రీ ప్రతిష్ట అమెరికన్ రోడ్లపై రయ్యిన దూసుకుపోతోంది. సరిగ్గా ఆ టైమ్లో రెండో మోడల్కి ప్లాన్ చేశారు ఫోర్డ్. 1927 డిసెంబర్ నాటికి ఫోర్డ్ మోడల్ - ఎ మార్కెట్లోకి వచ్చింది. అదీ సక్సెస్ అయింది.
*******
కార్ల తయారీ ఒక్కటే హెన్రీ ఫోర్డ్ జీవితచరిత్ర కాదు. కార్మికుల సంక్షేమం ఒక్కటే ఆయన ధ్యేయం కాదు. యుద్ధ జన్యువులు లేని దేశాలను ఆయన తయారు చేయాలనుకున్నాడు. ముందుగా తన మాతృభూమిని యుద్ధవ్యతిరేక దేశంగా మలచాలని అనుకున్నాడు. యుద్ధంలో గెలిచి సంపాదించుకున్న ఆధిక్యత తాత్కాలికమేనని, పారిశ్రామిక వృద్ధితో సాధించిన పట్టు శాశ్వతమని ప్రపంచ దేశాలకు చెప్పడానికి అమెరికాను ఒక నమూనాగా చేసుకున్నాడు!
హెన్రీ దృష్టిలో యుద్ధం... ఒక ‘టెరిబుల్ వేస్ట్’. యుద్ధానికి నిధులిచ్చేవాళ్ల కాళ్లు చేతులు విరగ్గొట్టాలని అంటాడు. అలా వీలుకాకపోతే కాళ్లు పట్టుకుని బ్రతిమాలైనా యుద్ధాన్ని ఆపాలని అంటాడు. 1915లో హెన్రీ, మరో శాంతి ప్రియుడు రొసికా స్క్విమ్మర్తో కలిసి దేశాల మధ్య మంటల్ని ఆర్పడం కోసం సముద్రంపై శాంతి యాత్ర చేపట్టారు. ఒక్కోదేశంలో దిగడం, యుద్ధం వద్దని వినతి పత్రం అందించడం. వీళ్లతో పాటు మరో 170 మంది ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు షిప్పులోకి ఎక్కారు. హెన్రీ వెంట ఆయన పాస్టర్ శామ్యూల్ మార్క్విస్ కూడా బయల్దేరారు. మార్క్విస్... ఫోర్డ్ కంపెనీ సోషియాలజీ విభాగానికి అధిపతి. రోజుకు ఐదు డాలర్ల వేతనం పొందుతున్న తన కార్మికులు... చేతినిండా డబ్బు ఉన్న కారణంగా విలాసాలకు,ప్రలోభాలకు లోను కాకుండా చూడ్డం కోసం హెన్రీ ఆయన్ని నైతిక ప్రబోధాంశాల ఉపాధ్యాయుడిగా నియమించుకున్నారు.
శాంతి యాత్ర ప్రారంభించే ముందు అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ని కలిశారు హెన్రీ ఫోర్డ్. ‘‘మీకివ్వడానికి ప్రభుత్వం దగ్గర సింగిల్ డాలర్ కూడా లేదు’’ అని తెగేశారు విల్సన్. ‘‘అవసరం లేదు. యుద్ధంలోకి దూరకండి చాలు’’ అన్నారు హెన్రీ. అన్నారే గానీ, 1917లో అమెరికా యుద్ధరంగంలోకి దూకినప్పుడు విమానాల ఇంజిన్లు, జలాంతర్గాములను నాశనం చేయగల నౌకల ఇంజిన్లను ఫోర్డ్ కంపెనీ సరఫరా చేయవలసి వచ్చింది. హెన్రీ దేశభక్తి ఆ పని చేయించింది! రెండో ప్రపంచ యుద్ధంలో కూడా నాజీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా, బ్రిటన్లకు ఫోర్డ్ కంపెనీ సహకారం అందించింది.
మరోవైపు అమెరికాతో మంచి సంబంధాలున్న ప్రతి పెద్ద దేశంలోనూ హెన్రీ ఫోర్డ్ తన కంపెనీ శాఖల్ని తెరిచారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా, ఆఫ్రికా, మెక్సికో, ఫిలిప్పీన్స్లో ఫోర్డ్ మోటార్ కంపెనీలు అమెరికా పంట పండించాయి. అమెరికా పౌరుడిగా హెన్రీ తీర్చుకున్న రుణం అది!
1930లలో హెన్రీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కంపెనీలోని కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఆయన పేరు మీద నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఏకైక కుమారుడు ఎడ్సెల్ ఫోర్డ్ కంపెనీని కొన్నాళ్లు నడిపాడు. 1943లో ఎడ్సెల్ చనిపోవడంతో హెన్రీ ఫోర్డ్ శక్తులు మరింత సన్నగిల్లాయి. ఎనభై ఏళ్ల ఆ శరీరం పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయింది. మనవడు రెండవ హెన్రీఫోర్డ్ కంపెనీ పగ్గాలు అందుకున్నాడు. ఎనభై మూడేళ్ల వయసులో డియర్బోర్న్ ఎస్టేట్లో హెన్రీ తన అంతిమశ్వాసను తీసుకున్నారు.
*******
హెన్రీ జీవితమంతా నడిచే యంత్రాల మధ్యే గడిచింది. అలాగని ఆయన ఏనాడూ మనసులేని జీవనం గడపలేదు. సంపాదించినంత సంపాదించారు. సహాయం చేయవలసినంత చేశారు. తను ఎదిగారు. తన దగ్గరున్నవాళ్లని ఎదిగేలా చేశారు. ఒక్క సెంట్ నైనా వృధాగా ఖర్చుపెట్టలేదు. ఒక్క డాలర్నైనా అనవసరంగా దాచిపెట్టలేదు. బిజనెస్ అనే మాటకు, బిజినెస్మేన్ అనే మాటకు ఎవరెన్ని అర్థాలు చెప్పినా, ఎన్ని అపార్థాలు చేసుకున్నా... హెన్రీ చెప్పేదొకటే. బిజినెస్ అంటే చలనశీలత. బిజినెస్మేన్ అంటే చలనశీలి.
చలనశీలికి విరామం ఉండదు. విసుగుండదు. అలుపుండదు. అంతరాయం ఉండదు. అతడొక కాలచక్రం. అతడిదొక ఆదర్శ భ్రమణం. అలాంటి ఒక గ్రేట్ సోల్... హెన్రీ ఫోర్డ్.
*******
ఇప్పుడు హెన్రీ లేరు. ఫోర్డ్ కంపెనీ ఉంది.
ఫోర్డ్తో పాటు ఇంకా - హెన్రీ ఫోర్డ్ నెలకొల్పిన సంప్రదాయాలు, విలువలు ఏదో ఒక రూపంలో ఉన్నాయి. వాటన్నిటి వెనుకా హెన్రీ ఆత్మ ఉంటుంది కనుక హెన్రీ ఉన్నట్లే! పునర్జన్మపై ఆయనకు ఉన్న నమ్మకమూ నిజమైనట్లే.
హ్యాపీ క్రిస్మస్... మిస్టర్ హెన్రీ ఫోర్డ్.
మీరు ఎక్కడున్నా! ఎంత దూరంలో ఉన్నా!
- సాక్షి ఫ్యామిలీ
హెన్రీ ఫోర్డ్, పారిశ్రామికవేత్త, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకులు
(30 జూలై 1863 - 7 ఏప్రిల్ 1947)
జన్మస్థలం : గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్, మిచిగాన్, యు.ఎస్.
తల్లిదండ్రులు : విలియమ్ ఫోర్డ్, మేరీ ఫోర్డ్
తోబుట్టువులు: మార్గరెట్, జేన్, విలియమ్, రాబర్ట్
జీవితభాగస్వామి: క్లారా జేన్బ్రియాంట్
సంతానం : ఎడ్సెల్ ఫోర్డ్
ప్రఖ్యాతి : ఆటోమొబైల్స్, మాస్ ప్రొడక్షన్
గ్రేట్ మేన్!
మెటీరియల్ సైన్స్, ఇంజినీరింగ్... హెన్రీ ఫోర్డ్కి ఇష్టమైన అంశాలు.
హారన్లు, మ్యాట్ల వంటి ప్లాస్టిక్ పరికరాల తయారీకి హెన్రీ ప్రధానంగా సోయాబీన్స్ను ఉపయోగించేవారు!
కలపను కూడా చెట్టు నుంచి కాకుండా, కృత్రిమంగా వ్యవసాయ ఉప ఉత్పత్తులతో తయారు చేయించేవారు.
హెన్రీ ఫోర్డ్ 160కి పైగా వినూత్న ఆవిష్కరణలు చేశారు. వాటన్నిటికీ పేటెంట్లు పొందారు.
జార్జియాలోని రిచ్మండ్ హిల్స్లో ఆయనకొక ఉల్లాస మందిరం ఉంది. తీరిక దొరికితే అక్కడికి వెళ్లి సేదతీరేవారు.
ఫోర్డ్ 1914లో ‘ద కేస్ ఎగైన్స్ట్ ద లిటిల్ వైట్ స్లేవర్’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి యువకులకు పంచిపెట్టారు.
పొగతాగడం వల్ల సంభవించే అనర్థాలను ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
హెన్రీ ఫోర్డ్కి ఆయన మరణానంతరం 1999లో ‘కార్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డు ప్రకటించారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఫోర్డ్కి వల్లమాలిన అభిమానం. తన ఆఖరి శ్వాసను సీసాలో బంధించమని ఎడిసన్ కుమారుడిని ఫోర్డ్ కోరారు. హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో ఇప్పటికీ ఆ సీసా భద్రంగా ఉంది!
హెన్రీ ఫోర్డ్ జీవిత చరిత్ర ఆధారంగా వందలాది పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో బ్రిటిష్ రచయిత డగ్లాస్ గాల్ బ్రెయిత్ రాసిన ‘కింగ్ హెన్రీ’ (2007) అనే పుస్తకానికి ఆధారం ఫోర్డ్ శాంతి నౌక.
ఇరవయ్యవ శతాబ్దపు 18 మంది మహనీయులలో ఒకరిగా అమెరికన్ ప్రజలు హెన్రీ ఫోర్డ్కి ఓటేశారు.
గ్రేట్ కోట్స్!
నాణ్యమైన సేవలను అందిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే... మోయలేనన్ని లాభాలు వచ్చి మీద పడతాయి!
డబ్బును మాత్రమే సంపాదించి పెట్టేది పెద్ద వ్యాపారమేం కాదు.
వృద్ధాప్యం అంటే వయసు మీద పడడం కాదు. నేర్చుకోవడం ఆగిపోవడం.
అసలంటూ మొదలు పెట్టడమే అసలైన విజయ రహస్యం.
ఏ వ్యాపారానికైనా ఉత్సాహం తొలి మూలధనం.
వైఫల్యం అనేది విజయం సాధించడానికి అందివచ్చే ఒక మహదవకాశం.
ఎప్పుడూ ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తూ ఉంటే, విజయం గురించి పనిగట్టుకుని ఆలోచించనవసరం లేదు.
డబ్బున్నంత మాత్రాన స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. జ్ఞానం, అనుభవం, సామర్థ్యం కూడా ఉండాలి.
ప్రతిదీ నీకు వ్యతిరేకంగా జరుగుతుంటే విమానం వైపు చూడు. అది గాలికి అభిముఖంగా పైకి లేస్తుంది.
పిల్ల బంగారంలా ఉంది... బంగారం లాంటి మనిషి... బంగారు కొండ... గోల్డెన్ స్పూన్తో పుట్టాడు... ఓల్డ్ ఈజ్ గోల్డ్... ఇలా చెప్పుకుంటూ పోతే మాటల్లో బంగారం చోటుకి లోటుండదు. పెళ్లయినా, పండగైనా, పూజయినా, వ్రతమైనా, బంగారం మెరిస్తే అదొక అందం. బీరువా నిండా నోట్లున్న వారికన్నా, వంటినిండా బంగారం ఉన్నవాళ్లే ధనవంతులు. అదీ బంగారానికి ఉన్న బంగారంలాంటి గుణం. ఇప్పుడు దాని ధర భగభగా మండుతోంది. కొలిమిలో కాల్చేకొద్దీ ధగధగ మెరిసే బంగారం ధర ఎంత మండితే అంత విలువ. ఆల్టైమ్ ప్రెషస్ బంగారం కథా కమామిషూ...
బంగారు చరిత్ర...
మొదటిసారిగా బంగారాన్ని ఎలా కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు? అన్న అంశాలపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. భగభగమండే సూర్యుడి చెమట ధార భూమిపై పడి బంగారంగా మారిందనీ, చంద్రుడి కన్నీటి ధార వెండిగా మారిందనీ ఈజిప్ట్ వాసుల నమ్మకం. మరికొంతమంది సూర్యుని స్వేదం బంగారంగా మారిందని విశ్వసిస్తారు. రాతియుగంలో తొలిసారిగా బంగారాన్ని గుర్తించినట్లు చరిత్ర చెపుతోంది. ప్రవహిస్తున్న నదిలో ఒక రాయి పగిలి దాన్నుంచి మిలమిల మెరిసే పదార్థం రావడాన్ని ఒక పిల్లవాడు గుర్తించాడని కూడా చెబుతారు.
ఆ రాళ్లు విభిన్నంగా ఉండటంతో వాటిని ఆహారం తినే పాత్రల్లాగా వినియోగించేవారట. ఆ తర్వాత కాలక్రమంలో బంగారం ఆభరణాలుగా, కరెన్సీగా (వస్తుమార్పిడి) చలామణిలోకి వచ్చింది. మొత్తం మీద చూస్తే 6,000 సంవత్సరాల క్రితం బంగారాన్ని వెలికితీయడం ప్రారంభించారని, 4,000 సంవత్సరాల క్రితం బంగారం వస్తుమార్పిడిగా అంటే కరెన్సీగా వినియోగంలోకి వచ్చిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనదేశంలో గుప్తులు, కుషాణులతో పాటు ఇతర రాజవంశులందరూ బంగారాన్ని ప్రధాన కరెన్సీగా వినియోగించారు.
అప్పటినుంచి ఇప్పటివరకు కూడా బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారిని ధనవంతులుగా భావిస్తున్నారు. కేవలం బంగారు నిధుల ఖజానాలను కొల్లగొట్టడానికే ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు జరిగాయి. యుద్ధంలో జయించిన బంగారాన్ని నౌకల్లో తరలించేవారు. కొన్నిసార్లు ఆ నౌకలు తుఫాన్లలో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయేవి. అలా సముద్రం పాలయిన బంగారం విలువే 10 ట్రిలియన్ డాలర్లు దాటి ఉంటుందని మరో అంచనా.
బంగారం ఎలా ఉత్పత్తి అవుతుంది?
బంగారాన్ని కృత్రిమంగా కంటే సహజసిద్ధంగానే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. యోగి వేమన కృత్రిమంగా బంగారాన్ని తయారు చేసేవాడని, దీనికో శాస్త్రం(రసవిద్య) ఉందని ప్రచారంలో ఉన్నా ఇంతవరకు అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. మొత్తం బంగారం ఉత్పత్తిలో 60 శాతం గనుల నుంచే జరుగుతోంది. బంగారు గనుల్లో ఖనిజాన్ని వెలికితీసి, దాన్ని శుద్ధి చేసి బంగారంగా తయారు చేస్తారు.
మొన్నటి వరకు బంగారు గనులు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది దక్షిణాఫ్రికా. కాని ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా ఆక్రమించింది. కూలీల వ్యయం బాగా పెరిగిపోవడంతో దక్షిణాఫ్రికాలో చాలా బంగారు గనులు మూతపడ్డాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బాగా పెరగడంతో గోల్డ్మైనింగ్పై చైనా దృష్టి సారించింది. గత సంవత్సరం చైనా 345 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసి మొదటిస్థానంలో నిలవగా, 255 టన్నులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 230 టన్నులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ఇవి కాకుండా రష్యా, ఇండోనేషియా, కెనడా వంటి చాలా దేశాలు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2010 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 2,528 టన్నుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇప్పటికీ 2001లో ఉత్పత్తి అయిన 2,600 టన్నులే రికార్డ్. ఆ రికార్డు ఈ సంవత్సరం చెరిగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. 2010 లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటి వరకు 1,68,300 టన్నుల బంగారాన్ని తవ్వి తీశారు. ఈ మొత్తాన్నీ ఘనాకారంలో అమరిస్తే 21 మీటర్లు (69 అడుగులు) ఉంటుందని అంచనా.
బంగారం ఉత్పత్తిలో రాగి కీలకపాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు. రాగి వంటి కొన్ని లోహాలను తయారు చేస్తున్నప్పుడు ఉప ఉత్పత్తి కింద బంగారం వస్తుంది. ఇలా మన దేశంలో గత సంవత్సరం 9.22 టన్నుల బంగారం ఉత్పత్తి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గనుల ద్వారా కాకుండా వివిధ పద్ధతుల్లో 1,705 టన్నుల బంగారం ఉత్పత్తి జరిగింది.
మన రాష్ట్రంలో బంగారు గనులు
దేశం మొత్తం మీద 13 రాష్ట్రాల్లో బంగారు గనులు ఉన్నాయనీ, వీటిల్లో మొత్తం 658 టన్నుల బంగారం ఉందనీ ఒక అంచనా. అయితే వాటిని వెలికితీయడం చాలా వ్యయంతో కూడుకున్నది. ఇందులో ప్రధానమైన గనులు చిత్రదుర్గ, కోలార్, రామగిరి గోల్డ్ ఫీల్డ్స్గా చెప్పుకోవచ్చు. ఇందులో రామగిరి ఫీల్డ్స్ మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్నాయి. వీటిని బ్రిటిష్ ప్రభుత్వం 1901లో గుర్తించింది. 1910-1927 మధ్య కాలంలో 1,76,338 ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. అప్పట్లో టన్ను ముడి ఖనిజం నుంచి 15 గ్రాముల దాకా బంగారం వచ్చేది.
కానీ, మార్కెట్ రేటు కన్నా ఉత్పత్తి వ్యయం అధికమై నష్టాలు వాటిల్లడంతో 2001లో ఈ గనులను మూసివేశారు. ఇప్పుడు బంగారం ధరలు పెరగడంతో తిరిగి వీటిల్లో ఉత్పత్తి ప్రారంభించాలని చూస్తున్నారు. మన దేశంలో బంగారు గనులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం కర్ణాటకలో కోలార్ ఫీల్డ్స్, ఆ తర్వాత చిత్రదుర్గ ఫీల్డ్స్.
వినియోగం
మొత్తం బంగారం వినియోగంలో 50 శాతం వాటా ఆభరణాలదే. ఇంకా పెట్టుబడులు, కరెన్సీ నిల్వలు, పరిశ్రమల్లో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. 40 శాతం ఇన్వెస్ట్మెంట్కి వినియోగిస్తే మిగిలిన 10 శాతం పారిశ్రామికావసరాల కోసం వినియోగిస్తారు.
ఇతర లోహాలతో సులభంగా కలిసిపోయే గుణం ఉండటం, కావల్సినంత సన్నగా మెత్తగా సాగే గుణం ఉండటం, అరుగుదల తక్కువగా ఉండటం, పసుపుపచ్చని వర్ణంలో మిలమిల మెరుస్తుండటం వంటి లక్షణాలు బంగారు ఆభరణాలపై మోజు పెంచేలా చేశాయి. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధన సరఫరా వంటి వాటిల్లోనూ బంగారాన్ని వినియోగిస్తారు. మనం వాడే కంప్యూటర్లు, చాలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కూడా బంగారాన్ని వినియోగిస్తారు.
ఆహారం, మందుల్లో..
వైద్య పరంగా కూడా బంగారం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. గతంలో రాజులు, పూర్వీకుల్లో చాలామంది వేడివేడి అన్నంపైన అతి పల్చటి బంగారు రేకులు వేసుకుని తినేవారు. దీని వలన రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుందని, రక్తప్రసరణ బాగుంటుందని చెపుతారు. ఇప్పుడు బంగారం రేటు పతాక స్థాయికి చేరుకోవడంతో అది చాలా ఖర్చుతో కూడుకున్నదే.
ఇప్పటికీ చాలా స్వీట్లపైన బంగారు రేకులను పూతగా పెడతారు. ఇక మన ఆయుర్వేదం విషయానికి వస్తే స్వర్ణభస్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు బంగారం ధరలు బాగా పెరగడంతో బంగారాన్ని వినియోగించే మందుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఉదాహరణకు సిద్ధమకరధ్వజం అనే ఆయుర్వేద మందులో బంగారాన్ని వినియోగిస్తారు.
ఐదేళ్ల క్రితం ఈ మందు తులం ధర రూ.200-300గా ఉంటే ఇప్పుడు రూ.1,000 దాటింది. ఇంగ్లిషు వైద్యంలో కూడా బంగారాన్ని వినియోగిస్తారు. ముఖ్యంగా కృత్రిమ పన్నుల అమరికలో బంగారు పన్నుదే అగ్రస్థానం. అరుగుదల తక్కువగా ఉండటం, తుప్పు పట్టడం వంటి లక్షణాలు లేకపోవడంతో బంగారు పన్నులు అమర్చడానికి డాక్టర్లు సుముఖత చూపుతారు.
దేశాల ఆర్థిక సంక్షోభం నుంచీ గట్టెక్కిస్తాయి
దేశాలను ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించడంలో పలుమార్లు బంగారం తన సత్తాను చాటుకుంది. అప్పుల ఊబుల్లో కూరుకుపోయినప్పుడు రుమేనియా, రష్యా, ఇండియా వంటి దేశాలను బంగారం సురక్షితంగా ఒడ్డున పడేసింది. 1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడంతో, దిగుమతుల బిల్లులు చెల్లించడానికి సరిపడ విదేశీ మారక నిల్వలు మన దగ్గర లేకుండా పోయాయి.
అప్పటి ప్రధాని చంద్రశేఖర్ 20 టన్నుల బంగారాన్ని కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే పలు దేశాలు విదేశీ మారక నిల్వల్లో కొంత భాగాన్ని బంగారం రూపంలో ఉంచడానికి సిద్ధపడతాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా సంక్షోభ పవనాలు వీస్తుండటంతో అనేక దేశాలు బంగారు నిల్వలను పెంచుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే మనదేశం 2009లో 200 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఆర్బీఐ అంచనాల ప్రకారం 2011 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 30,700 టన్నుల బంగారం ఉంది.
ఈ ఏడాది మార్చి నాటికి 557.7 టన్నుల బంగారం నిల్వలతో భారత్ ప్రపంచంలో 11వ స్థానంలో నిలిచింది. ఇది భారతవిదేశీ మారకపు నిల్వల్లో 8.7 శాతం వాటాకు సమానం. నిల్వల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా 8,133.5 టన్నుల బంగారాన్ని హోల్డ్ చేస్తోంది. తన మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో ఇది 74.7 శాతం. ఆ తర్వాత స్థానాల్లో వరుసగాజర్మనీ (3,406.8 టన్నులు), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (3,005.3), ఇటలీ (2,451.8), ఫ్రాన్స్ (2,435.4), చైనా (1,054.1), స్విట్జర్లాండ్ (1,040), రష్యా (830.5), జపాన్ (765.2), నెదర్లాండ్స్ (612.5) ఉన్నాయి.
బంగారాన్ని ఎక్కడ నిల్వ చేస్తారు?
సాధారణంగా మనం బంగారాన్ని అత్యంత సురక్షితంగా ఉండే సేఫ్టీ లాకర్లు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకుంటాం. కాని ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, కేంద్ర బ్యాంకులు దగ్గర ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని ఎక్కడ దాస్తాయి? బంగారాన్ని దాచడానికి ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల మన ఎఫ్సీఐ గోడౌన్ల మాదిరిగానే గోల్డ్ వాల్ట్లున్నాయి. ఇలాంటి పెద్దవాల్ట్లు మనదేశంలో లేవు. సింగపూర్, బ్రిటన్, జర్మనీ, అమెరికా దేశాల్లో ఇవి ఉన్నాయి.
గాలి కూడా లోపలికి చొరబడని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీటిని నిర్వహిస్తారు. ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య బాగా పెరుగుతుండటం, కేంద్ర బ్యాంకులు వాటి నిల్వలను పెంచుకోవడంతో బంగారం దాచుకునే గోడౌన్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు కంపెనీలు వీటి విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి.
బంగారంపై డాలరు ప్రభావం
బంగారాన్ని ఇప్పుడు చాలామంది పెట్టుబడి సాధనంగా చూడటంతో డిమాండ్ బాగా పెరిగింది. అలాగే ఇతర పెట్టుబడి సాధనాలు నష్టాలను అందిస్తుండటంతో ఇన్వెస్టర్లు వారి సంపదను బంగారంగా మార్చుకుంటున్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. భారతదేశం విషయానికి వస్తే డిమాండ్ అండ్ సప్లయిలే కాకుండా డాలరు కూడా బంగారం ధరలను నిర్దేశిస్తుంది.
రూపాయితో డాలరు మారకం విలువ పెరుగుతుంటే బంగారం విలువ పెరుగుతుంది. తగ్గితే తగ్గుతుంది. ఉదాహరణకు గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1600 డాలర్లు ఉన్నప్పుడు ఇండియాలో పది గ్రాముల బంగారం ధర రూ.23,000గా ఉండేది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 11 శాతం పెరిగి ప్రస్తుతం 1781 డాలర్ల వద్ద ఉంటే ఇండియాలో మాత్రం ఏకంగా 27 శాతం పెరిగి రూ.29,270లకు చేరింది. దీనికి కారణం ఈ కాలంలో రూపాయి విలువ భారీగా క్షీణించి డాలరు విలువ పెరగడమే. ఔన్స్ బంగారం 1,600 డాలర్ల వద్ద ఉన్నప్పుడు ఒక డాలరు విలువ రూ.45 ఉంటే ఇప్పుడది రూ.50 దాటింది. దీని వలన అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గుతున్నా ఆ ప్రభావం దేశీయ విలువపై ప్రతిబింబించడం లేదు.
- చంద్రశేఖర్ మైలవరపు
పెట్టుబడిగా బంగారం
పదకొండు సంవత్సరాల నుంచి ప్రతీ సంవత్సరం లాభాలను అందిస్తున్న ఏకైక సాధనం బంగారం కావడంతో ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గందరగోళంగా ఉండటం కూడా బంగారు పెట్టుబడులపై మోజు పెంచేలా చేస్తున్నాయి. బంగారంలో మదుపు చేయడానికి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. నేరుగా బంగారం కొనడం దగ్గర నుంచి కాగితం రూపంలో బంగారం కొనడం వరకు చాలా మార్గాలున్నాయి.
వీటిలో గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ సేవింగ్ ఫండ్స్, గోల్డ్ ఫ్యూచర్స్ ప్రధానమైనవి. నేరుగా బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని భద్రపర్చడం కష్టమైన విషయం కాబట్టి పేపర్ రూపంలోని బంగారం వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
గోల్డ్ ఫండ్స్ :
ఇవి నేరుగా బంగారంలో ఇన్వెస్ట్ చేయవు. అంతర్జాతీయంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి ఇంటర్నేషనల్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వస్తాయి. ప్రస్తుతం ఏఐజీ వరల్డ్ గోల్డ్ ఫండ్, డీఎస్పీ బ్లాక్ రాక్ వరల్డ్ గోల్డ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
గోల్డ్ ఈటీఎఫ్లు :
వీటినే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి గోల్డ్ ఈటీఎఫ్ల్లో రూ.2,849 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ఈ విలువ రూ. 8,173 కోట్లకు చేరింది. ప్రస్తుతం 11కుపైగా గోల్డ్ ఈటీఎఫ్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ, యూటీఐ, ఐసీఐసీఐ, బెంచ్మార్క్ వంటి పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు వీటిని అందిస్తున్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేస్తాయి.
మీరు ఇన్వెస్ట్ చేసిన విలువకు సమానంగా యూనిట్లను కేటాయించి ఆ మేరకు కాగితం రూపంలో మీకు తెలియచేస్తాయి. ఈటీఎఫ్లు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ కావడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనొచ్చు, అమ్ముకోవచ్చు. కానీ వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డీ-మ్యాట్ అకౌంట్ ఉండాలి. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లేదు. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.5,000.
గోల్డ్ సేవింగ్ ఫండ్స్
డీమ్యాట్ అకౌంట్ అవసరం లేకుండా ఒకేసారి లేక ప్రతీ నెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని ఇవి కల్పిస్తున్నాయి. ఇవి ఫండ్ ఆఫ్ ఫండ్ కోవలోకి వస్తాయి. అంటే ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా అదే సంస్థకు చెందిన గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి చేస్తాయి. అంటే మీ తరపున ఈ పథకాలు గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. చిన్న మదుపుదారులను ఆకర్షించడానికి వీటిని ప్రవేశపెడుతున్నారు.
ఫ్యూచర్స్:
బంగారం విలువలో కేవలం 5-10 శాతం చెల్లించడం ద్వారా బంగారంలో పొజిషన్లు తీసుకోవచ్చు. ఒక గ్రాము బంగారం దగ్గరి నుంచి కేజీ బంగారం వరకు మీ మార్జిన్ మనీ, రిస్క్ సామర్థ్యం ఆధారంగా ట్రేడింగ్ చేయవచ్చు. బంగారం ధర పెరుగుతుందన్న నమ్మకం ఉంటే లాంగ్ పొజిషన్లు, అదే తగ్గుతుందని భావిస్తే షార్ట్ పొజిషన్లు తీసుకోవచ్చు. వీటిల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రేడింగ్పై పూర్తి అవగాహన ఉన్న వారికి మాత్రమే అనువైనవి. ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ను ఎన్సీడీఈఎక్స్, ఎంసీఎక్స్, నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్లు అందిస్తున్నాయి.
మన వారి మెడల్లో 20,000 టన్నుల బంగారం
భారతీయులకు బంగారంపై ఎనలేని మోజు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండియాలో అందరి దగ్గర ఉన్న బంగారాన్ని లెక్కిస్తే కళ్ళు తిరగటం ఖాయం. గతేడాది 963 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారంటే గోల్డ్ క్రే జ్ ఏం రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనితో కలుపుకుంటే ఇప్పుడు మన వాళ్ళ దగ్గర 20,000 టన్నుల బంగారం ఉందంట.
ఇది రిజర్వ్ బ్యాంక్, ఇతర సంస్థల దగ్గరున్న బంగారాన్ని లెక్కలోకి తీసుకోకుండానే. ఈ మొత్తం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా అరవై వేల బిలయన్ల రూపాయలు. అంకెల్లో 6000000,00,00,000 (ఆరవై లక్షల కోట్లు). ఇది అమెరికా, యూరో జోన్, చైనా, స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకులు కలిగి వున్న మొత్తం కంటే ఎక్కువ. ఈ స్థాయిలో ఏ దేశ ప్రజల వద్ద కూడా బంగారం లేదు.
మన పెళ్లిళ్లకు ఏటా 500 టన్నులు
ఇండియాలో ఏటా పెళ్లిళ్ల కోసం 500 టన్నుల బంగారం అవసరమవుతుందని వరల్డ్గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అంటే ఏటా కేవలం పెళ్లిళ్ల కోసం 15 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇండియా జనాభాలో 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారు అధికంగా ఉన్నారని, ఈ లెక్కన చూస్తే వచ్చే 10 సంవత్సరాల్లో ఏటా 5 కోట్ల పెళ్లిళ్లు జరుగుతాయని ఒక అంచనా. అంటే వచ్చే పదేళ్లల్లో కేవలం పెళ్లిళ్ల కోసం ఏటా సగటున 500 టన్నుల చొప్పున వచ్చే 10 ఏళ్లల్లో 5,000 టన్నుల బంగారాన్ని కొనేస్తామన్నమాట!
అమెరికా అప్పుల్లో ఉంది. లక్షల కోట్ల డాలర్ల తిప్పలవి!
ఐరోపా గొప్పల్లో ఉంది. ఉడకని ‘ఉమ్మడి’ యూరోల పప్పులవి!
అయిల్ కంట్రీల జాతకం ఘాతుకంలా ఉంది.
నియంతల గొంతుకు బిగుస్తున్న పిడికిళ్లవి!
ఆసియన్ల అభివృద్ధి ఎక్కడిదక్కడే ఉంది. ముందుకు పడని అడుగులవి!!
కూటములకు, పాటవాలకు ఈ లెక్కలేవీ అందడం లేదు.
దిక్కులు తోచడం లేదు.
రాచరికం, రిపబ్లికనిజం, సోషలిజం, ఐరాసయిజం...
చిల్లర డబ్బుల కోసం దేబిరిజం!!
ఓ మై చాణక్యా! మౌర్యవంశ మంత్రివర్యా!!
అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపావయ్యా?!
ఇవాళ 20 నవంబర్. క్రీ.శ. 2011.
ఇవాళ్టికీ అగ్రరాజ్యాలు, అల్పాదాయ దేశాలు...
ఓం చాణక్యాయ నమః దరి చేర్చాయనమః అంటున్నాయి!
ఏమిటి చాణక్యుడి గొప్పతనం?
ప్రభుత్వాలు ఎందుకిలా ఆయన్ని జపిస్తున్నాయి? ఇదే ఈ బయోగ్రఫీ.
దూకుడు మీద ఉన్నాడు అలెగ్జాండర్.
బల్గేరియా, ఇజ్రాయిల్, ఈజిప్టు, లిబియా, ఇరాక్, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, సోవియెట్ యూనియన్... ఒకటొకటీ మోకాళ్లపై కుంగిన గుర్రాలవుతున్నాయి.
మిగిలింది... భారతావని!
ప్రపంచాన్ని జయించడం అలెగ్జాండర్ టార్గెట్. హిందూఖుష్ పర్వతాలకు కాస్త అవతల... ప్రపంచ భూభాగం అంతమౌతుందని అతడి గురువు అరిస్టాటిల్ చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు అటువైపే వస్తున్నాడు అలెక్స్.
హిందూఖష్ దగ్గర అప్పటికే నాలుగు నదుల్ని దాటింది అలెగ్జాండర్ సైన్యం. ఐదవ నది హైఫాసిన్ కూడా దాటితే... మగధ, గాంధార రాజ్యాలు! వాటిని కూడా జయిస్తే... తనిక మేసిడోనియా చక్రవర్తి కాదు. జగదేక గ్రీకు వీరుడు.
నదిలోని నీళ్లను తలపై చల్లుకుని పులకరించిపోయాడు అలెగ్జాండర్.
నదిని దాటి వస్తే... మ-గ-ధ!
********
దిగ్గున లేచి కూర్చున్నాడు చాణక్యుడు!
కలగన్నాడా? కాదు, అలెగ్జాండర్ కంటున్న కల నెరవేరబోతున్నదని గ్రహాలు చెబుతున్నట్లు గ్రహించాడు.
భుజాల కిందికి దిగిన శిరోజాలను సాలోచనగా సవరించుకుని, జుట్టు ముడివేసుని పైకి లేచాడు చాణక్యుడు. తక్షశిల నుంచి తక్షణం మగధకు బయల్దేరాడు. అతడిప్పుడు మగధ చక్రవర్తి ధననందుడిని కలవాలి. అలెగ్జాండర్ ఎంతటి శక్తిమంతుడో వివరించాలి. మగధను రక్షించుకునే మార్గం చెప్పాలి. వింటాడా? విందులు, చిందులలో తేలిపోతున్న చక్రవర్తి.. మేఘాలలోంచి కిందికి దిగుతాడా? లేక పర్షియా చక్రవర్తి డేరియస్లా పరాజితుడై ప్రజల్ని, పడతుల్ని అలెగ్జాండర్కు వదిలి పారిపోతాడా?
రాజప్రాసాదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు చాణక్యుడు. తక్షశిల విశ్వవిద్యాలయ ఆచార్యుడతడు. చరిత్ర తెలుసు, వర్తమానం తెలుసు. భవిష్యత్తూ తెలుస్తోంది. అలెక్స్ మూకలు పర్షియా రాజధాని పెర్సిపొలిస్ను విజయగర్వంతో ఎలా తొక్కి నాశనం చేసిందీ అతడి బుద్ధి ఊహిస్తోంది. అంతటి దుర్గతి మగధకు గానీ, మరే భారత భూభాగానికి గానీ పట్టకూడదు.
సభకు చేరుకున్నాడు చాణక్యుడు. నిండు సభలో కొలువై ఉన్నాడు ధననందుడు.
‘ఈ అందవికారుడికి ఇక్కడేమిటి పని’ అన్నట్లు సభ అతడిని నిలబెట్టి నిశ్శబ్దంగా చూస్తోంది. చక్రవర్తికి రుచించని ఏ వార్తనూ వినేందుకు సభ సిద్ధంగా లేదు!
చాణక్యుడు గొంతు సవరించుకున్నాడు.
‘‘దేవుడి దయ వల్ల మనమింకా మన రాజ్యంలోనే ఉన్నాము చక్రవర్తీ. సమయం మించిపోలేదు. సరిహద్దులవైపు అలెగ్జాండర్ సైనిక బలగాలు కదులుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. వారిని మనవైపు రానివ్వకుండా గాలివానలు ఆపుతున్నాయి. ఈలోపే మగధ, గాంధార రాజ్యాలు ఏకం కావాలి. లేదంటే మగధరాజ్యం మేసిడోనియా మహాసామ్రాజ్యపు తునకగా మిగిలిపోతుంది’’ అన్నాడు.
గర్జన, ఘీంకారం కలగలిపి అహంకరించాడు ధననందుడు! సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సభలోని నిశ్శబ్దం బిక్కచచ్చింది.
‘‘ఎవరక్కడ! ఈ తీతువును తరిమికొట్టండి’’ అన్నాడు. మళ్లీ ఒక్క క్షణంలో - ఆగమన్నాడు.
‘‘అతడి జుట్టు పట్టుకుని ఈడ్చుకువెళ్లండి. ఆ జుట్టు కిందే కదా మగధసామ్రాజ్య భవిష్యత్తు ఉంది! అలెగ్జాండరట, గాంధారదేశంతో సంధులు, సమాలోచనలట. జోస్యం వినేందుకు నేనీ పీఠం మీద కూర్చోలేదని ఆచార్యులవారికి అర్థమయ్యేలా దేహబుద్ధులను శుద్ధి చెయ్యండి’’ అని ధననందుడు అజ్ఞాపించాడు.
మంత్రులు, పరరాజ్య ప్రతినిధులు, రాజ్యాధికారులు, రమణులు... ఇందరున్న సభలో చాణక్యుడుకి అవమానం జరిగింది. అతడి ప్రజ్ఞకు ఘోర పరాభవం జరిగింది. శరీరంతో పాటు మనసూ గాయపడింది. రక్తం ఓడింది. ఆగ్రహంతో. ఆవేదనతో, ప్రతీకారంతో బయటికి నడిచాడు. జుట్టు ముడి విప్పాడు. ధననందుడిని రాజ్యభ్రష్టుడిని చేసేవరకు, భరతదేశాన్నంతటినీ సమైక్యంగా ఉంచే సమర్థుడిని మగధకు చక్రవర్తిని చేసేవరకు జుట్టుముడి వేయనని శపథం చేశాడు.
********
క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ల నాటి సంగతి ఇది.
చాణక్యుడు శపథం నెరవేర్చుకున్నాడు. నందవంశ పాలనను అంతమొందించి, తన శిష్యుడు చంద్రగుప్తుడిని మగధకు చక్రవర్తిని చేశాడు. తను మంత్రి అయ్యాడు. మౌర్య సామ్రాజ్యానికి పునాదులు వేశాడు.
అలెగ్జాండర్తో అసలు గొడవేలేకుండా పోయింది. హైఫాసిన్ నదిని దాటేందుకు అతడి సేనాపతులు సంశయించారు. అప్పటికే మూడు నెలలుగా ఏకధాటిన వర్షం. ఆహార పదార్థాలు పాడయ్యాయి. ఆయుధాలు తుప్పుపట్టాయి. శకునాలేవీ బాగోలేవని త్రికాలజ్ఞులు తేల్చేశారు. అలెక్స్ నిరాశ చెంది, అంతదూరం వచ్చినందుకు ఆనవాళ్లుగా పన్నెండు మంది గ్రీకు దీవుళ్లకు పన్నెండు ప్రార్థనా పీఠాలు ప్రతిష్టింపజేసి వెనుదిరిగాడు.
ఒక వేళ - ప్రకృతి అలెగ్జాండర్కు సానుకూలంగా ఉండి ఉంటే, అతడు మగధను, గాంధారను కలుపుకుని ఉంటే... మౌర్య వంశ స్థాపన జరిగి ఉండేది కాదు. చాణక్యుని ‘అర్థశాస్త్రం’, ‘నీతిశాస్త్రం’ గ్రీకు సామ్రాజ్య సంపదలై ఉండేవి.
ఎనిమిదేళ్ల సుదీర్ఘ దండయాత్రల అనంతరం హిందూఖుష్ నుంచి వెనుదిరిగి నేరుగా మేసిడోనియాలో అడుగుపెట్టినప్పుడు అలెగ్జాండర్కు అరాచకం, అవినీతి స్వాగతం పలికాయి. వాటిని చక్కదిద్దలేక సతమతమయ్యాడు అలెక్స్. పక్కన చాణక్యుడు ఉంటే బహుశా పరిస్థితి ఇంకోలా ఉండేది. రాజనీతి వ్యూహాలకు, సంక్షోభ నివారణ తంత్రాలకు చాణక్యుడిని మించినవారు అవనిలోనే లేరు.
********
క్రీస్తు శకం 2011. నవంబర్ 20.
అమెరికా. ఒంట్లో బాగోలేదు. డాలర్కి అస్తమానం ఏవో ఇన్ఫెక్షన్లు.
ఐరోపా. ఉమ్మడి ఇంట్లో యూరోల గొడవలు. చాల్లేదని ఒకరు. సరిపెట్టుకొమ్మని ఒకరు.
ఇండియా. జనాభా ఎక్కువ. జాగ్రత్తలు తక్కువ.
కూటములకు, కటిక రాజనీతిజ్ఞులకు సైతం దిక్కుతోచడం లేదు. హే, చాణక్యా! మౌర్యసామ్రాజ్యాన్ని ఎలా నడిపావయ్యా?!
రెండు వేల మూడొందల ఏళ్ల తర్వాత... ఇవాళ్టికీ ప్రపంచ దేశాలు, రాజ్యాలు... చాణక్యుడిని తలచుకుంటూనే ఉన్నాయి. కష్టమొచ్చినప్పుడు మనిషి దేవుడి వైపు చూసినట్లు, సంక్షోభ కాలంలో దేశాలు చాణక్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని తిరగేస్తున్నాయి. గిట్టనివారు అతడిని కౌటిల్యుడు అన్నప్పటికీ, గట్టెక్కడానికి చివరికి ఆ కౌటిల్యతనే అనుసరించారు. నిజానికది కుటిలత్వం కాదు. జీవనలౌక్యం. బతకడం ఎలాగో నేర్పించ డం.
‘‘అంత నిజాయితీ పనికిరాదు’’ అంటాడు చాణక్యుడు. దీన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. చాణక్యుడి అర్థం వేరే. నిటారుగా ఉండే చెట్లను మొదట నరికేస్తారనీ, నిజాయితీగా ఉండేవాళ్లు త్వరగా నమ్మకద్రోహానికి గురవుతారని ఆయన ఉద్దేశం.
‘‘ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఫలితం ఎలా ఉండబోతోంది? ఇందులో నేను విజయం సాధిస్తానా?
ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తే అప్పుడు నువ్వు ముందుకు వెళ్లవచ్చు’’
‘‘పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల స్వాధీనంలో ఉన్న ఆస్తి మన అవసరాలకు ఉపయోగపడవు’’.
చాణక్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాలివి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి అంతస్సూత్సం ఒకటే - ‘‘నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది’’.
చాణక్యుని కీలక గురుమంత్రం ఇది. నువ్వు బయట పడితే నీకు భయపడడం తగ్గుతుందన్నది అంతరార్థం.
చాణక్యుని అర్థశాస్త్రంలో ఆరువేలకు పైగా సూత్రాలు ఉన్నాయి. ‘చాణక్య నీతి’ అనేది మరో ఉద్గ్రందం. అందులో నీతి సూత్రాలు ఉన్నాయి. ఆర్థశాస్త్రంలో డబ్బు గురించి ఉన్నప్పటికీ, డబ్బు గురించి మాత్రమే లేదు. రాజనీతి, యుద్ధనీతి, వ్యక్తి నీతి, సంఘ నీతి... ఇలా అనేక జీవన నీతులున్నాయి. ఇప్పటికీ, ఎప్పటికీ అవి మనిషికి, వ్యవస్థలకు అవసరమైనవి. అప్పుడప్పుడు మన బడ్జెట్ ప్రసంగాలలో చాణక్యుని మాట వినిపిస్తుంటుంది. బడ్డెట్ల రూపకల్పనల్లో చాణక్య నీతి కనిపిస్తుంటుంది.
బతకడానికి, బాగా బతకడానికి మధ్య తేడాలను చెప్పిన తాత్విక పండితుడు చాణక్యుడు. అనుభవంతో పండి, అనుభవసారాన్ని పిండి లోకానికి ఉగ్గు పట్టించిన ‘హితా’మహుడతడు. వృత్తిలో ఎదగదలచిన వాడికి స్నేహమెంత ముఖ్యమో, శత్రుత్వం అంత ముఖ్యమని అంటాడు. ఎదుగుతున్న క్రమంలో మంచీచెడూ రెండూ సోపానాలే అంటాడు.
ఏదైనా పని మొదలు పెట్టేముందు ఎవరైనా తమ ఇష్టదైవాన్ని స్తుతిస్తారు. చాణక్యుడు మాత్రం ఓం మంచీచెడాయనమః అంటాడు. ఆయన భాషలో అది ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’. అంటే బృహస్పతికొక దండం, శుక్రాచార్యుడికొక దండం అని. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. దండం ఇద్దరికీ పెట్టినా మంచికే లయబద్ధుడై ఉంటాడు చాణక్యుడు.
ఇంతటి విజ్ఞత, స్థితప్రజ్ఞత చాణక్యుడికి ఎక్కడివి? ఏ తల్లికి ఏ దేవుడి మంత్రోపదేశంతో ఈ లోకంలో కళ్లు తెరిచి ఉంటాడు. ఉహు.. లోకంలోకి వచ్చే వరకు ఆగి ఉండడు. తల్లి గర్భంలోనే కళ్లు తెరిచి ఉంటాడు!
********
చాణక్యుడు రాసిన గ్రంథాలు రెండే రెండు. చాణక్యుడిపై వచ్చిన పుస్తకాలు వందలు వేలు. చాణక్యుడు తను చెప్పదలచింది రాశాడు గానీ తన గురించి రాసుకోలేదు. కనుక చాణక్యుడి గురించి రాయడానికి ఎవరికీ ఏమీ దొరకలేదు. వందేళ్ల క్రితం మైసూరులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలో చెదలు పట్టబోతున్న స్థితిలో ఉన్న చాణక్యుని అర్థశాస్త్రం తాళపత్ర గ్రంథం నకలు దొరికిందని, వాటి అర్థం తెలిసిన పండితులొకరు ఆంగ్లంలోకి అనువదించి, పుస్తకాలుగా ముద్రించడంతో చాణక్యుని ఖ్యాతి, భారతీయ సంస్కృతి గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని అంటారు. అప్పటి వరకు చాణక్యుడు ఒక పురాణ పాత్ర, కావ్య పండితుడు. అంతే.
విశాఖదత్తుని ‘ముద్రారాక్షసం’ నాటకంలో -
‘‘చాణక్యుడు తంత్ర జ్ఞుడైన బ్రాహ్మణుడు. అర్థశాస్త్రాన్ని రచించినవాడు. చాణక్య కుటిల నీతి అనేది ఇతడి నుంచే వాడుకలోకి వచ్చింది. కొంతమంది ఇతడిని కౌటిల్యుడు అంటారు. నందుల్ని (నందవంశస్థులు) మ్లేచ్ఛుల చేత చంపించి, చంద్రగుప్తుణ్ణి రాజుగా చేసి నందుల మంత్రి రాక్షసుణ్ణే చంద్రగుప్తుడి మంత్రిగా చేస్తాడు’’ అని ఉంది.
ఎవరెలా అభివర్ణించినా, ఏ గ్రంథం ఎలా ప్రస్తావించినా... చాణక్యుడు పుట్టిన స్థల కాలాల విషయంలో మాత్రం అన్ని గ్రంథాలలోనూ దాదాపుగా ఏకరూపత కనిపిస్తుంది. చాణక్యుడి అసలు పేరు విష్ణుగుప్తుడు. తండ్రి చణకుడు కాబట్టి ఆ పేరుతో చాణక్యుడయ్యాడు. (పంజాబ్లోని ‘చాణక్’ అనే ప్రదేశంలో జన్మించాడు కాబట్టి చాణక్యుడయ్యాడనే భావన కూడా ఉంది).
చాణక్యుడు కౌటిల్యుడిగా కూడా ప్రసిద్ధుడయ్యాడు. కుటిలత్వం కారణంగా కౌటిల్యుడనే పేరు వచ్చిందనే సాధారణ అపార్థం ఒకటి చెలామణిలో ఉంది కానీ, నిజానికది గోత్రనామం అని చరిత్రకారుల పరిశీలన.
ఇంతకీ చాణక్యుడు ఎప్పటి వాడు? ఎక్కడి వాడు?
క్రీ.పూ. 370 - 283 మధ్య చాణక్యుడి జీవించి ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అతడు ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయమై అనేక వాదనలు ఉన్నాయి. అతడు రాశాడని చెబుతున్న అర్థశాస్త్రంగానీ, నీతిశాస్త్రం కానీ అతడివి కావ నే వాదనా ఉంది, షేక్స్పియర్ రచనల మీద ఉన్నట్లు.
చాణక్యుని జన్మస్థలం ఉత్తర భారతదేశమని, దక్షిణ భారతదేశమనీ, తక్షశిల అనీ భావించడానికి ఆధారమైన రచనా సాహిత్యం కొంత అందుబాటులో ఉంది. తెలుగులో మామిడిపూడి వెంకట రంగయ్య, నెల్లూరి సత్యనారాయణ వంటి పరిశోధకులు... చాణక్యుని ప్రాంతీయతను నిర్థరించే ప్రయత్నం కొంత చేశారు. ఈ ప్రయత్నాలన్నిటికీ మూలాధారం మళ్లీ చాణక్యుని ఆర్థ, నీతి శాస్త్రాలే.
ఉదా: అర్థశాస్త్రంలో 18 ముహూర్తాలు గల పగలు అతి దీర్ఘమైనదని చాణక్యుడు పేర్కొన్నాడు. అటువంటి దీర్ఘమైన పగలు ఉత్తరదేశంలో కనిపిస్తుంది. ఈ విధంగా చాణక్యుడు ఉత్తరదేశస్థుడు. అయితే అర్థశాస్త్ర ప్రతులు చాలావరకు దక్షిణ దేశంలో లభించడాన్ని బట్టి ఆయన దక్షిణదేశస్థుడు అని భావించడానికి వీలు కలిగింది. తక్షణశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు కాబట్టి తక్షశిల ప్రాంతీయుడు అయివుంటారని ఇంకో అభిప్రాయం. పూర్వం గాంధార రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉన్న తక్షశిల ప్రస్తుతం పాకిస్థాన్లోని రావల్పిండి జిల్లా పరిధిలో ఉంది. గుప్తులశకం అంతరిస్తున్న తరుణంలో కనుమరుగైన చాణక్య గ్రంథాలు తిరిగి 1915 వరకూ లభ్యం కాలేదు. చాణక్యుడి గురించి ప్రపంచానికి కాస్త గట్టిగా తెలుస్తున్నదంతా గత వందేళ్ల నుంచే.
********
ఎవరి తెలివితేటలనైనా ప్రస్తుతించేటప్పుడు ‘అపర చాణక్యుడు’ అంటారు. అంటే చాణక్యుడంతటి వాడని. చాణక్యుడు మేధావి. చంద్రగుప్తుడు అనే ఓ సాధారణ బాలుడిని చేరదీసి, అతడి తల్లి పేరుతో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించి, దానికి చక్రవర్తిని చేసిన రాజనీతిజ్ఞుడు. చంద్రగుప్తుడి తల్లి పేరు ‘ముర’. ఆమె పేరు మీదే చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మంత్రిగా సలహాలిచ్చి చంద్రగుప్తుడికి తిరుగులేని సార్వభౌమాధిపత్యాన్ని సాధించిపెట్టాడు.
ఇన్ని తెలివితేటలు, ఇంత లౌక్యం, అపారమైన ప్రజ్ఞ, దార్శనికత... ఇవన్నీ చాణక్యుడికి తండ్రి నుంచి పుట్టుకతో సంక్రమించాయనుకోవాలి. తండ్రి చణకుడు వేద పారంగతుడు. వైద్య పండితుడు. గొప్ప జ్యోతిష్యుడు. శివ, విష్ణువులను ఆరాధించే భగవత్ సంప్రదాయాన్ని అనుసరించే శోత్రీయ కుటుంబానికి చెందినవాడు. అయితే వ్యక్తిగతంగా చణకుడు విష్ణు భక్తుడు. అందుకే కావచ్చు తనయుడికి విష్ణుగుప్తుడు అనే పేరు పెట్టుకున్నాడు. విష్ణుదేవుడి సేవకుడి పేరు అది. తర్వాత చాణక్యుడు కూడా తండ్రినే అనుసరించాడు. విష్ణువుని ఆరాధించాడు.
చాణక్యుని తండ్రి చణకుని పూర్వీకులు కేరళ ప్రాంతానికి చెందినవారనీ, అక్కడి నుంచి విద్యాభ్యాసం కోసం చాణక్యుడిని తక్షశిల పంపారనీ, ఆ తర్వాత అక్కడి విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడిగా చేరాడని ఒక కథనం. తక్ష శిల... మహామహులు చదివిన విద్యాపీఠం. తక్షశిల అంటే కఠిన శిల అని అర్థం. జీవితంలో ఎదురయ్యే కఠినమైన సమస్యలను తట్టుకుని నెగ్గుకు రావడం ఎలాగో తక్షశిల నేర్పుతుందనే ఉద్దేశంలో ఆ పేరు పెట్టారు.
విద్యార్థిగా చాణక్యుడు ఇక్కడే రాటు తేలాడు. మనం ఇప్పుడు కష్టమనుకుంటున్న పాఠ్యాంశాలన్నీ ఇష్టంగా చదివాడు. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, మేథ్స్, మెడిసిన్, ఆస్ట్రాలజీలను తేలిగ్గా చదివి సూక్ష్మాలను గ్రహించాడు. కొత్త విషయాలను కనిపెట్టి ప్రొఫెసర్గా ఇక్కడే విద్యార్థులకు బోధించాడు. మధ్య యుగాలనాటి అంధకారం నుంచి భారతావనికి వెలుగును ప్రసాదించిన జీవన నైపుణ్యాల జనకుడు చాణక్యుడు.
చంద్రగుప్తుడి తర్వాత మూడు తరాలు చాణక్యుని నీతి సూత్రాలతోనూ దేశాన్ని పాలించాయి. తర్వాతి రాజ వంశాలు, రాజ్యాంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలూ ఆ సూత్రాలను అనుసరిస్తూ వస్తున్నాయి. ఇప్పటికీ మన బిజినెస్ మేనేజ్మెంట్లో చాణక్యుడిదే సిలబస్!
రాజులకు, చక్రవర్తులకు మంచి చెప్పాలనుకోవడం ప్రాణాలకు తెగించడమే. తండ్రి చణకుడు, తనయుడు చాణక్యుడు ఇలా ఇద్దరూ ప్రాణాలకు తెగించినవారే. ఇందుకు దారితీసిన కారణాలు కూడా ఒకే విధమైనవి కావడం విధి చిత్రమో, యాదృచ్ఛికమో తెలీదు. బహుశా అనువంశికం అయి ఉండాలి. మగధరాజు మహానందుడికి మంచి చెప్పబోయి చణకుడు ప్రాణాలు పోగొట్టుకుంటే, మహానందుడి వారసుడు ధననందుడికి మంచి చెప్పబోయి చాణక్యుడు తన ప్రతిష్టను భంగపరుచుకుని, శపథం చేయవలసి వచ్చింది.
రాజవంశీయుడు కాకుండానే రాజైన వాడు మహానందుడు! అతడొక సాధారణ పౌరుడు. మగధ రాజధాని పాటలీపుత్రంలో క్షురకునిగా జీవితం సాగిస్తున్నవాడు. అలాంటివాడు కుట్రపన్ని మగధ రాజును హతమార్చి అందలం ఎక్కుతాడు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మహానందుడు ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు. విజయగర్వంతో ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తాడు. కేళీవిలాసాలకు బానిసై కాలక్షేపం చేస్తుంటాడు. ఈ సంగతి దక్షిణాదిని (ప్రస్తుతం మైసూరు) పాలిస్తున్న ఉత్తుంగ నరసింహుడుకి తెలుస్తుంది. అతడు తెలివైనవాడు. శక్తిమంతుడు. మగధపై దాడి చేసి తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేస్తాడు. ఈ విషయం తెలిసిన చణకుడు మహానందుడిని కలిసి రాబోతున్న ముప్పు గురించి హెచ్చరిస్తాడు. ‘ఏం చెయ్యాలో నాకు తెలుసు. నాకు నీతులు చెప్పడానికి వస్తావా?’ అని ఆగ్రహించి మహానందుడు అతడిని చంపిస్తాడు. తర్వాత నరసింహుడు మహానందుడిని చంపేస్తాడు. నవనందులైన మహానందుడి తొమ్మిది మంది కుమారులను చెరసాలలో వేయిస్తాడు.
సరిగ్గా ఇక్కడే చాణక్యుడు రంగ ప్రవేశం చేస్తాడు. నరసింహుడుని ఒప్పించి, నవనందులను విడిపించి, వారి కుటుంబాల క్షోభ తీరుస్తాడు. తిరిగి తక్షశిల వెళ్లిపోతాడు. తర్వాతి పరిస్థితులు త్వరత్వరగా మారిపోతాయి. మగధపై నరసింహుడు పట్టు తగ్గుతుంది. నవనందులలో ఒకరైన ధననందుడు తన ఎనిమిది మంది సోదరులను హతమార్చి తనను తను మగధకు రాజుగా ప్రకటించుకుంటాడు. అప్పుడది అలెగ్జాండర్ జైత్రయాత్ర జరుపుతున్న సమయం. లోకాలన్నీ జయించాక చివరిగా అతడు భారతావనిని కూడా సమీపించే సూచనలు ఉన్నాయని చాణక్యుడు ధననందుడిని హెచ్చరిస్తాడు. ధననందుడు అతడిని అవమానించి పంపుతాడు. అప్పుడు చేసిందే చాణక్యుడు శపథం. దాన్ని నెరవేర్చుకునేందుకు అతడి పడిన కష్టం, పట్టిన దీక్ష... ఇవే చాణక్యుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలు. ఇవే అతడి జీవితంలో చరిత్రకారులు గుర్తించిన ముఖ్యాంశాలు.
ధననందుడిని పదవీచ్యుతుడిని చేసి, నందవంశాన్ని అన్యాక్రాంతం చేస్తానని ప్రతిన పూని తక్షశిల వెళ్లిపోయాక చాణక్యుడు యోగ్యుడైన భావి చక్రవర్తిని అన్వేషించే పనిలో పడ్డాడు. ముడి వీడిన శిరోజాలు ప్రతీకార జ్వాలలై అనుక్షణం అతడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తున్నాయి. ఎదురవుతున్న ప్రతి యువకుడిలోనూ అతడు మగధ వారసుడినే చూస్తున్నాడు! కానీ ఎవ్వరిలోనూ తనకు కావలసిన లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో... చెట్లు, పుట్టలు, పల్లెలు, పట్నాలు గాలిస్తున్న చాణక్యుడికి లొఖాండీ అనే అటవీ ప్రాంతంలో (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లోని లక్నో)... ఒక వేసవి ఉదయం, బాల భానుడితోపాటు, ప్రచండ భానుడిలాంటి బాలుడు చాణక్యుడి కంట పడ్డాడు. అతడే చంద్రగుప్తుడు!
ఆ సమయంలో చంద్రగుప్తుడు.. క్రూరుడైన తన గురువును ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. ‘తమరు చేస్తున్నది తప్పు’ అని వాదిస్తున్నాడు. విద్యాబోధన పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించనని చెబుతున్నాడు. ‘చదువులో మాత్రమే మీరు నాకన్నా అధికులు. మనిషిగా నేను మీకన్నా అధికుడిని’ అని ధైర్యంగా అంటున్నాడు.
చాణక్యుడికి ముచ్చటేసింది. నేరుగా బాలుడి తల్లి దగ్గరకు వెళ్లాడు. ‘‘నీ కుమారుడిని మగధకు చక్రవర్తిని చేస్తాను. నాతో పంపించు’’ అని అడిగాడు. అమె పేరు మురా దేవి. మయూరాలను కాసే కొండ ప్రాంత మహిళ. నందసోదరులలో ఒకరు ధననందుడి చేతిలో మరణించక ముందు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇటువైపు వచ్చి ముర అందానికి ముగ్ధుడై ఆమెను వివాహమాడతాడు. వారికి పుట్టినవాడే చంద్రగుప్తుడని, ఈ తల్లీకొడుకులు ధననందుడి కంటపడకుండా అడవిలో జీవనం సాగిస్తున్నారని చాణక్యుడు గ్రహిస్తాడు. ముర అనుమతిపై చంద్రగుప్తుడిని తన వెంట తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అతడి పద్దెనిమిదవ యేట రాజ్యాధికార కాంక్ష రగిలిస్తాడు.
అప్పటికి నందవంశం... మధ్య, దిగువ గంగానదీ పరివాహక ప్రాంతలలో విస్తరించి ఉంటుంది. చాణక్యుని వ్యూహం ప్రకారం చంద్రగుప్తుడు నంద వంశానికి వ్యతిరేకంగా భారతావనిలోని మిగతా రాజ్యాలను ఏకం చేసి దండయాత్ర చేస్తాడు. నందులను రాజ్యభ్రష్టులను చేసి, మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. తూర్పున బెంగాల్ అస్సాంల నుంచి పశ్చిమాన ఆఫ్గనిస్థాన్, బెలూచిస్తాన్ల వరకు, ఉత్తరాన కాశ్మీర్, నేపాల్ల నుంచి, దక్షిణాన దక్కను పీఠభూమి వరకూ మౌర్యులదే రాజ్యం! అప్పటికిగానీ చాణక్యుడు శాంతించడు!
తొలి ఐదేళ్ల వరకు నీ బిడ్డపై గారాలు కురిపించు. తర్వాతి ఐదేళ్లు దారిలో పెట్టేందుకు దండించు. పదహారేళ్లు వచ్చేటప్పటికి స్నేహితుడిగా మసులుకో. ఎదిగిన బిడ్డలే నీ ఆప్తమిత్రులు - అంటాడు చాణక్యుడు. చంద్రగుప్తుడిని కూడా అతడు తన బిడ్డలానే చూసుకున్నాడు. చివరి వరకు వెన్నంటే ఉన్నాడు. చంద్రగుప్తుడి తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు, బిందుసారుడి తర్వాత అతడి కుమారుడు అశోకుడు... చాణక్యనీతిని అనుసరించే రాజ్యపాలన సాగించారు. శిష్యుడు చంద్రగుప్తుడు 42 వ యేట చనిపోతే... గురువు చాణక్యుడు తన 87 యేట వృద్ధాప్యంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.
********
చాణక్యుడి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికి అర్థశాస్త్రం ఉపయుక్తమైన గ్రంథం. రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా, భాగవతం స్కందాలుగా ఉన్నట్లే చాణక్యుడి అర్థశాస్త్రం అధికరణాలుగా ఉంటుంది. మొత్తం పదిహేను అధికరణాలివి. రాజ్యపాలన, పౌరధర్మం, సామాజిక నీతి ఇందులోని ముఖ్యాంశాలు. ఇవన్నీ ఆయన అనుభవాలలోంచి సిద్ధాంతీకరించిన సూత్రీకరణలే కాబట్టి చాణక్యుడు ఇంకోలా ఇంకోలా ఉండేందుకు లేదు. రాసిందొకటీ, చేసిందొకటీ అయ్యేందుకు లేదు.
********
నీతి, ధర్మం అనేవి తప్పకూడనివి. కానీ... తప్పడమే నీతి, ధర్మం అనే పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. అప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా, దానిని సమర్థించుకోడానికి కారణాలు వెతుక్కునే పనిలేకుండా, పరిస్థితులనే వాటంతటవి మనకు కాపుగాసేలా మలుచుకోవాలి. ఇదే చాణక్య నీతి.
చాణక్యుడు, ఆర్థికవేత్త
(మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని గురువు)
జననం : పూ. 370
మరణం : పూ. 283
జన్మస్థలం : ఉత్తర భారతదేశం
తండ్రి : చణకుడు
తల్లి : కచ్చితమైన వివరాలు లేవు.
చదువు, కొలువు : మొదట తక్షశిల విశ్వవిద్యాలయంలో తర్వాత చంద్రగుప్తుని మంత్రిగా
రాసిన గ్రంధాలు : అర్థశాస్త్రం, చాణక్య నీతి
చాణక్య నీతి చంద్రిక
పూల సౌరభం గాలి వీస్తున్న వైవే వ్యాపిస్తుంది. మంచితనపు పరిమళాలు అన్ని దిక్కులకూ విస్తరిస్తాయి.
నిరంతరం పనిలో నిమగ్నమైయున్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు.
ఓటమికి ఇంకొక పేరు అసూయ.
రాజు సగటు మనిషిగా జీవించే చోట ప్రజలు రాజభోగాలు అనుభవిస్తారు. పాలకులు రాచరిక సౌఖ్యాలను అనుభవించే చోట ప్రజలు యాచకులై జీవిస్తారు.
అధముడి దగ్గరైనా సరే , ఏదైనా మంచిని నేర్చుకోవలసి వస్తే వెనుకాడవద్దు.
భయం దరి చేరగానే దాన్ని ఎదుర్కొని నాశనం చెయ్యి.
చాణక్య చంద్రగుప్త
అది 1977వ సంవత్సరం. ఎన్టీఆర్ ‘చాణక్య చంద్రగుప్త’ సినిమా చేయాలనుకున్నారు. పైగా ఆ సినిమాను భారీ మల్టీస్టారర్గా నిర్మించాలనుకున్నారాయన. అక్కినేనిని ఎలాగైనా తన సంస్థలో, తన డెరైక్షన్లో నటింపజేయాలనేది ఎన్టీఆర్ చిరకాల వాంఛ. స్వతహాగా ఎన్టీఆర్కి చాణక్యుడి పాత్రంటే ఇష్టం. అందుకే ఆ పాత్రను తానే పోషించి, చంద్రగుప్తుడి పాత్రను అక్కినేనితో చేయించాలి అనుకున్నారాయన. కానీ ఏఎన్నార్ అందుకు ఒప్పుకోలేదు. ‘‘చంద్రగుప్తుడు మహావీరుడు. అలాంటి పాత్ర నువ్వు చేస్తేనే కరెక్ట్ బ్రదర్. నేను చాణక్యుడిగా చేస్తాను’’ అని తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవించి ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా, అక్కినేని చాణక్యుడిగా సినిమా మొదలైంది. అలెగ్జాండర్గా శివాజీగణేశన్ చేశారు. అదే ఏడాది ఆగస్ట్ నెలలో సినిమా విడుదలైంది. సరిగ్గా ఆ సినిమా విడుదలైన పదిహేళ్ల తర్వాత ఎన్టీఆర్ ‘సామ్రాట్ అశోక’ చిత్రం నిర్మాణానికి పూనుకున్నారు. అశోకుడిగా ఎన్టీఆరే నటించారు. అయితే.. చాణక్యుడిగా నటించాలన్న తన కోరిక తీరకపోవడంతో... చనిపోయిన చాణక్యుడు ఆత్మరూపంలో వచ్చి అశోకుడి తల్లికి గురోపదేశం చేసినట్టుగా.. అవసరం లేకపోయినా ఓ సన్నివేశాన్ని ఆ సినిమా కోసం సృష్టించారు ఎన్టీఆర్. ఆ సన్నివేశంలో తానే చాణక్యుడిగా నటించి కోరిక తీర్చుకున్నారు. తెలుగు సినిమా తల్లికి రెండుకళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్లు ఇష్టపడి మరీ చాణక్యుడి పాత్రను పోషించడం విశేషం.
- సాక్షి ఫ్యామిలీ