Sunday, September 12, 2010

కృషితో నాస్తి దుర్భిక్షం

ఇష్టపడే రంగం ఒకటి.
ఉదర పోషణార్థమై మరో రంగంతో ముడి.
అందుకే అనుదినం నిరాశ, నిస్పృహ. ఇది మనలో నూటికి తొంభై తొమ్మిది మందికి పరిచయమైన అనుభవమే కదా.
నా మిత్రుడొకడున్నాడు- ప్రబీర్ పురకాయస్త అని.. ముద్రాలో నాతో కలిసి దాదాపు పది సంవత్సరాలు పని చేశాడు. వృత్తిరీత్యా అడ్వర్‌టైజింగ్ రంగానికి చెందిన వాడైనా. ఆయనకి పూర్తి తృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది ఫొటోగ్రఫీ.

ప్రతి ఏడు హిమాలయాల్లోకి వెళ్లి ఆ పర్వత శ్రేణుల అలౌకిక సౌందర్యాన్ని తన కెమెరాలో బంధించి పుస్తకాలు ప్రచురించేవాడు.
అంతర్జాతీయ స్థాయికి చెందిన పుస్తకాలు.
వృత్తి ప్రవృత్తి - రెండూ ఏకం కావాల్సినవేననే నిబంధన ఎక్కడా రాసి లేదు. రెండు వేరువేరైనా, కన్నకలల్ని ఇష్టపడే రంగంలో సాకారం చేసుకోవచ్చు.
నాకు వృత్తి, ప్రవృత్తి రెండు ఒకటే. ఎటువంటి నిరాశా లేదు.
రెండు వేరువేరైనా సరే ప్రబీర్ అసాధారణమైన ప్రతిభా పాటవాలు కనబర్చాడు ఫొటోగ్రఫీలో. తృప్తి, సంతోషంతో నిండిన జీవితం ప్రబీర్‌ది. జీవితంలో ఇటువంటి ఎందరో మహానుభావులు మనకు దర్శనమిస్తూ ఉంటారు.

ఈ రెండు తరగతుల వారేకాకుండా, మరో తరహాకు చెందిన వ్యక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే మనకు కనబడుతుంటారు.
కాంక్షించే రంగంలో ప్రవేశించలేక ఉన్న రంగాన్ని ఇష్టపడక, అశాంతితో అసంతృప్తితో జీవితాలు వెళ్లబుచ్చేవాళ్లు కోకొల్లలు.
వారికి జీవితం నిత్యం సంగ్రామమే.
ఈ మనస్వత్వం, ఈ అలవాటు నా ఉద్దేశంలో ఎంతో నిష్ప్రయోజనకరమైనవి.

ప్రేమించే పనిని చేయి..
లేదా చేసే పనిని ప్రేమించు..
రెండూ కాకుండా, చేసే పనిని ద్వేషిస్తాను, ప్రేమించే పని చేయటానికి అవసరమైన అర్హతలను పొందనూ అంటే, జీవితం అనుక్షణం ఒక సంగ్రామం లాగానే మిగిలి పోతుంది.
సర్ సివి రామన్ గారినే ఉదాహరణగా తీసుకుందాం. మనకు స్ఫూర్తినిచ్చే ప్రపంచ విఖ్యాతిగాంచిన కొద్దిమందిలో ఒకరు రామన్ గారు. ఆయన అమితంగా ప్రేమించేది ఫిజిక్స్‌ను, ఆ రంగంలో రీసెర్చిని..అయితే ఆయన చేరిన మొదటి ఉద్యోగం అకౌంట్స్‌లో. రెండింటింకి వీసమెతైనా సంబంధముందా !?

పర్‌ఫెక్టు చదువు, పర్‌ఫెక్టు ఉద్యోగం అవసరం లేదు జీవితంలో ఏదైనా సాధించాలంటే.
మనసుంటే మార్గముందంటారు కదా పెద్దలు. మనసుంటే పట్టుదల, పట్టువదలని విక్రమార్కుడి లాంటి పట్టుదల సహజంగానే అబ్బుతుంది మనకి.
ఆ పట్టుదలే మనని మన కలల ప్రపంచాన్ని సాకారం చేసుకునేలా చేస్తుంది.
ఆ పట్టుదలకు మారుపేరు సర్ సివి రామన్.
నవంబర్ 7, 1888న ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించాడు రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ అక్కడ ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఫిజిక్స్, మేథమెటిక్స్‌లలో ప్రావీణ్యుడు.

తమిళులకు తండ్రి పేరు ఇంటి పేరుగా మారుతుంది. కనుక వెంకట రామన్, చంద్రశేఖర్ వెంకట్ రామన్ - సివి రామన్‌గా మారిపోయాడు.
17వఏటనే పట్టభద్రుడయ్యాడు రామన్. చిన్నప్పట్నుంచీ అన్ని త రగతులలో ఫస్టే మన రామన్. సంగీతమన్నా, సైన్స్ అన్నా ప్రాణం.
15వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీ మద్రాసులో డిగ్రీ కోసం చేరిన రామన్‌కి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. అది ఆయన్ను తన కాలేజీలో అందరికీ తెలిసేలా చేసింది.
పొట్టిగా, మరీ చిన్న కుర్రాడిలా ఒకతన్ని చూశాడు తన క్లాసులో ప్రొఫెసర్ ఎలియట్.
పొరపాటున తన క్లాసులోకి వచ్చాడేమో ఈ బుడతడనుకొని. ఆ కుర్రవాణ్ణి ప్రొఫెసర్ అడిగాడు "నీవు బిఎ స్టూడెంట్ వా'' అని. "యస్ సర్ '' అన్నాడు ఆ కుర్రాడు.

"నీ పేరేంటి ?'' "సివి రామన్''
ఈ సంఘటన మన చిన్ని రామన్‌ను కాలేజిలో అందరికీ పరిచయం చేసింది.
1905లో పట్టభద్రుడైన రామన్ ఆ యేడు ఫస్ట్ క్లాసు తెచ్చుకున్న ఒకే ఒక విద్యార్థి. గోల్డ్ మెడలిస్టు కూడా.
వెంటనే ఎంఎ ఫిజిక్స్‌లో చేరాడు అదే కాలేజీలో..
1907లో డిస్టింక్షన్‌తో ఎంఎ పట్టా పుచ్చుకున్నాడు. అంతవరకు మద్రాసు యూనివర్సిటీలో ఎవ్వరికీ రానన్ని ఎక్కువ మార్కులతో.
సైన్సుకి ఆ రోజుల్లో ఏమంత ప్రాముఖ్యత కాని, ఆ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా అవకాశాలు గాని ఉండేవి కావు. తన అన్న బాటననుసరించి 'ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్' పరీక్షలు రాసి, వాటిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి తన పందొమ్మిదో ఏట అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు కలకత్తాలో.

చదువుకుంది ఫిజిక్స్‌లో
తను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఫిజిక్స్‌ను. ఉదరపోషణార్థమై ఎంచుకున్న వృత్తి అకౌంట్స్.
అయితే ఇవేవి రామన్ కలలకు, గమ్యాలకు అడ్డు నిలువ లేదు.
ముందు చెప్పుకున్నాంకదా మనసుంటే మార్గముంటుందని ; పట్టుదల - విక్రమార్కుని పట్టుదల, మనసుంటే మనకు అబ్బుతుందని.
మనసుంది రామన్‌కి ఫిజిక్స్‌లో కృషి చేయాలని. అకౌంట్స్ ఉద్యోగం అడ్డుగా నిలువలేదు.
పగలంతా అకౌంట్స్ ఉద్యోగం - రాత్రంతా ఫిజిక్స్‌లో రీసెర్చ్.
ఒక రోజున తన ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ "ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్'' అనే బోర్డును చూశాడు రామన్.
ఉత్సుకతతో ఆ బోర్డు ఉన్న భవనం లోపలికి వెళ్లాడు. విశాలమైన రూములో పలు రకాలైన సైంటిఫిక్ పరికరాలు. ఫిజిక్స్‌లో పరిశోధనలకు అనువైన ప్రదేశంలాగా గోచరించింది.
డాక్టర్ అమృత్ లాల్ సర్కార్ ఆ సంస్థకు ఆనరరీ సెక్రటరీ. ఆయన్ను సంప్రదించగా రామన్‌కు అనుమతి లభించింది తన రీసెర్చిని అక్కడ నిరాటంకంగా చేసుకొనేందుకై.
ఇంకేం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నంత సంతోషపడిపోయాడు రామన్. ఆ ప్రయోగ శాలలో పదేళ్ల పాటు తానొక్కడే నిర్విరామంగా కృషి చేసి 27 రీసెర్చి పేపర్లను ప్రచురించాడు. ఎంత నిర్విరామంగానంటే కొన్ని రోజులు తిండి, నిద్రల గురించి కూడా మర్చిపోయాడు. తన నివాసాన్ని లేబ్ పక్కకు మార్చుకున్నాడు. ల్యాబ్‌కి తన ఇంటికి మధ్య రాకపోకలకై ఒక దారి, దానికో తలుపు.

ఎనిమిది గంటలు ఆఫీసు..మిగతా పదహారు గంటలు ల్యాబ్‌లో ఇదీ దినచర్య.
పదేళ్ల పాటు.. ఫలితం 27 పేపర్లు
ఈ సంకలనమే ప్రపంచ విఖ్యాతి పొందిన 'రామన్ ఎఫెక్ట్'గా మనందరికీ సుపరిచియం.
ఈ వ్యాసాలు, ఈ రామన్ ఎఫెక్టే 1930లో అంటే రామన్‌కి 42 ఏళ్ల వయస్సులోనే ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి.
ఆసియా ఖండంలోనే ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సైంటిస్ట్ శ్రీ రామన్.
వృత్తి వేరు. ప్రవృత్తి వేరు.
తాను చేసిన రీసెర్చి ల్యాబ్‌లో ఉన్న సదుపాయాలు, పరికరాలు ఎంతో సామాన్యమైనవి. ఆ రోజుల్లో వాటి విలువ కేవలం 300 రూపాయలు.
అవకాశాలు మనని వెతుక్కుంటూ రావు... మనమే వాటిని వెతుక్కుని చేజిక్కించుకోవాలి.
అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కనబడతాయి. మనమే వాటిని అధిగమించాలి.
నారు పోసి, నీరు పోసి పంట పండించి వడ్డించి వార్చరు ఎవ్వరు మనకోసం.
మనమే స్వయంకృషితో, ఏం కావాలన్నా దాన్ని సాధించుకోవాలి.
పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం, పర్‌ఫెక్ట్ కుటుంబం, పర్‌ఫెక్ట్ నగరం.. ఏవీ అవసరం లేదు. పర్‌ఫెక్ట్ మనసు కావాలి. అప్పుడు పర్‌ఫెక్ట్ మార్గం దానంతటదే వస్తుంది. దాంతోపర్‌ఫెక్ట్ పట్టుదల కూడా..

ప్రతి విజేత కథ చెప్పేది ఇదే. విజేత కావాలనుకునే ప్రతి వ్యక్తికి ముందున్న ఒకే ఒక మార్గం కూడా ఇదే.
ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల..
అప్పుడు అన్నీ సుసాధ్యాలే..
ఆలోచించి చూడండి...
-ఎజి కృష్ణమూర్తి

No comments: