Showing posts with label dhirubhai ambani. Show all posts
Showing posts with label dhirubhai ambani. Show all posts

Wednesday, June 1, 2011

ప్రపంచం మీ గుప్పిట్లో...

 http://www.prajasakti.com/images_designer/article_images/2011/4/24/aptn-1303669315342.jpg
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక సామాన్య రైతు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. సమస్యల్లో ఉన్న ఇరుగుపొరుగు వారికి మంచి సలహాలిచ్చి ఆదుకుంటాడని మంచి పేరుంది ఈ పెద్ద మనిషికి. ఒక రోజు ఆ దేశ రాజు ఆ గ్రామం నుంచి వెళ్తూ.. మన రైతు గురించి, ఆయన మంచి గురించి, అతనిచ్చే సలహాల గురించి విని ఆయన్ను పిలిపించి అడిగాడు రోజూ నీ సంపాదన ఎంతా అని. ఒక రూపాయని చెప్పాడు.

రూపాయికి ఎంతో విలువున్న రోజులవి. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడ్తున్నావన్నాడు రాజు. ఒక పావలా తినేస్తాను, రెండో పావలా అప్పుగా ఇస్తాను. మూడో పావలాతో అప్పు తీరుస్తాను. నాలుగో పావలాని పారేస్తాను అన్నాడు ఆ రైతు. ఇదో పజిల్‌లాగా, మెదడుకు మేత వేసే సమస్యాపూరణం లాగా గోచరించింది రాజుకి. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పవయ్యా అన్నాడు రాజు. మొదటి పావలా నాకు నా భార్య తిండి ఖర్చులకు వినియోగిస్తాను. రెండో పావలా పెట్టుబడిగా నా పిల్లల మీద వెచ్చిస్తాను. రేపు నాకు నా భార్యకు వృద్ధాప్యంలో పిల్లలు తోడు నీడగా ఉంటారనే ఆశతో. మూడో పావలాతో నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను. మిగిలిన నాలుగో పావలాను బీద వారికి దానం చేస్తానన్నాడు. సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి రాజుకి ఏకకాలంలో. ఈ పజిల్ జవాబుని వేరెవ్వరికీ చెప్పవద్దని, తన ముఖాన్ని వంద సార్లు చూసాకే ఎవరికైనా చెప్పాలని ఆజ్ఞాపించాడు రాజు. సరేనన్నాడు రైతు.

రాజధాని చేరిన రాజు రైతు జీవన శైలిని ఒక చిక్కు ప్రశ్నగా మార్చి దాన్ని విప్పమన్నాడు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. మంత్రి కనుగొన్నాడు రాజు ఒక గ్రామానికి వెళ్లటం. అక్కడో రైతుని కల్సుకోవటం. వెంటనే ఆ గ్రామం చేరుకొని మన రైతును కల్సుకొని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. రాజుకు మాటిచ్చాను. చెప్పలేనన్నాడు రైతు. వంద నాణాలు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు మంత్రి. ఆ నాణాల మీద రాజు శిరస్సు ముద్రించి ఉంది. వంద నాణాలపై వంద రాజు ముఖాలు. ఇంకేం. ఎలాంటి సమస్యా లేదు అనుకుంటూ జవాబు చెప్పాడు రైతు మంత్రికి. హుటాహుటిన మంత్రి రాజధానికి తిరిగొచ్చి రాజుకు సమస్యాపూరణం చేశాడు. ఆశ్చర్యపోయిన రాజు మంత్రిని అడిగాడు సమాధానం ఎవరు చెప్పారని. నిజం తెల్సుకున్న రాజు ఆగ్రహావేశాలతో గ్రామం నుంచి రైతును రప్పించి నిప్పులు చెరిగాడు. శాంతంగా విన్న రైతు రాజా తమరే సెలవిచ్చారు కదా. తమరి వంద ముఖాలు చూసే దాకా ఎవ్వరికీ జవాబు చెప్పొద్దని. మంత్రి ఇచ్చిన వంద నాణాల మీద తమరి ముఖార విందాన్ని వంద సార్లు చూసాకే సమస్యని పూరించానని ఎంతో వినయ విధేయతతో చెప్పాడు.

రైతు రుజువర్తనుడే కాదు నమ్మదగ్గ వ్యక్తి. ఇచ్చిన మాటకు విలువిస్తాడు అని ఆగ్రహించి సన్మానించాడు. మనందరం ఆ రైతు లాగా జీవితంలోని ముఖ్యాంశాలను గ్రహిస్తే అడ్డదోవలు తొక్కుతూ ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఉండదు కదా! వృద్దాప్యంలో తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించి వెట్టిచాకిరి చేయించుకునే ప్రబుద్ధులు ఎందరో! లేకుంటే చేతులు శుభ్రంగా డెటాల్‌తో కడుక్కొని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అంకితం చేయటం. ప్రేమతో గౌరవంగా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించే వారు భూతద్దంలో వెతికితే గాని కనబడదు. ఎంత దురదృష్టం. మాతృదేవోభవా, పితృదేవోభవా అనే సంస్కృతికి నిలయమైన మన భారతంలో ఎన్ని అపశృతులు. ఇతరుల సహాయం కోసమే మానవ జన్మ అని మన శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు ఘోషిస్తుండగా.. పట్టపగలే బందిపోటు దొంగల్లా దేశాన్ని, మనల్ని దోచేస్తూ, దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారు మనకు అండదండగా నిలవాల్సిన పెద్దమనుషులు. ధనార్జనకు అడ్డదారులేకాదు. రాజమార్గాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నమే ఈ నిజ జీవిత గాధలన్ని. పదండి ముందుకు ఈ చిన్న ప్రపంచం మన గుప్పిట్లోకి ఎలా వచ్చిందో తెల్సుకుందాం.
http://suryaa.com/Main/gallery/2010/Sep/07/world.jpg
ప్రపంచం మీ గుప్పిట్లో....
రిలయన్స్ మొబైల్ ఫోన్ ప్రకటనలకు ఇది ట్యాగ్‌లైన్.. నేను రాసిందే 2003లో. నిజంగా ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది కదూ నేడు. మా పని అమ్మాయికి ఆవిడ పతి దేవుడైన సెక్యూరిటీ గార్డుకి, మావంటావిడకు, ఆవిడ కుటుంబ సభ్యులందరికీ, మన పోస్టుమ్యాన్‌కు, మన డ్రైవర్లకి, మా మానవరాలికి, మీకు ... నాకు... ఎవ్వరికీ ఇది లేందే జరగదు ఒక్క క్షణం కూడా. సర్వాంతర్యామి మొబైల్. చిన్నా పెద్దా, రాజు పేద, ఆడామగా... ఎలాంటి తేడాలు చూపకుండా అందరికీ అండదండ గా నిలుస్తూ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చింది ఈ మొబైల్ ఫోన్. చాలా వస్తు, సేవలు, విలాసాలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రపంచంలో ఒక్క మొబైల్ ఫోన్ ఎలాంటి బేధాలు చూపకుండా అందరినీ అలరిస్తోంది. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఒక్కోసారి మీకనిపించదూ ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఇంతకాలం మనం ఎలా జీవిస్తూ వచ్చామా అని.

అరచేతిలో ఇమిడిపోయి ఎంతో సింపుల్‌గా ఇన్నోసెంట్‌గా కనబడే ఈ మొబైల్ ఫోన్ వెనక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్ల ద్వారా - మోటరోలా, ఎటి అండ్ టి - ఇది ఆవిష్కరించబడింది. ఈ రెండు సంస్థలు కమ్యూనికేషన్ రంగంలో ఉద్దండులే. మోటరోలా టూవే రేడియో టెక్నాలజీతో నిష్ణాతులు కాగా ఎటి అండ్ టి క్లిష్టమైన సెల్యులార్ టెక్నాలజీలో ప్రసిద్ధులు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన కృషికి ఫలితమే నేడు మన జేబుల్లో ఇమిడిపోయి మనతోనే ఎల్లవేళలా ఉండే మొబైల్ ఫోను. అసలు ఈ రెండు సంస్థలు మొదలుపెట్టింది కార్‌ఫోన్ రేంజిని పెంచుదామని. కార్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లకు చెందిన రేడియో ఫ్రీక్వెన్సీకి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రీక్వెన్సీ రేంజ్‌ని డ్రైవర్ ఎక్కడకు వెళితే అక్కడదాకా పొడిగించాలంటే మరో కొత్త కమ్యూనికేషన్ పద్ధతిని కనుగొనాల్సి ఉంది.

అప్పట్లో వాడుకలో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీ కనుగొనటానికి ఎన్నో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఒక కొత్త సెల్యులార్ సిస్టమ్‌ని కనుగొని దాని కోసమై ప్రభుత్వం క్లియరెన్స్‌లను పొందటం. రెండోది ఒక కొత్త ప్రొటోటైపు తయారు చేయటం. దీనికి సంబంధించిన నమూనాలు గాని, ఇతర సమాచారం గాని ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఇదొక వినూత్న ఆవిష్కారం. మోటరోలా ఇండస్ట్రియల్ డైరెక్టర్ రూడీ క్రాలాప్ ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "మేం కనుగొంటున్న దాన్ని షూ ఫోన్'' అని పిలిచే వాళ్లం. ఎందుకంటే అది ఒక బూటులాగా రూపం సంతరించుకుంటోంది. చివరకు సెప్టెంబర్ 1, 1983న మోటరోలా సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికాకు చెందిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, డివైఎన్ఎ టిఎసి 800ఎక్స్ ఫోన్‌ను అంగీకరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ మొబైల్ ఫోను. పదేళ్లు.. 10 కోట్ల డాలర్ల (450 కోట్ల రూపాయలు) పెట్టుబడికి ఫలితంగా ఉద్భవించిన మొబైల్ ఫోను ఇది.
http://www.travisfitzwater.com/wp-content/uploads/2010/02/dreambig.jpg
కార్ ఫోను రేంజ్‌ని పెంచుదామనుకొన్న చిన్న ప్రయత్నం ప్రపంచాన్ని, మనందరి గుప్పిట్లోకి తెచ్చింది. ఈ మొబైల్ ఫోను నేడు అందరికీ ఎలా కాసుల వర్షం కురిపిస్తోందో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఆలోచన, శ్రమ, దాని ఫలితం పది మందికి ఎలా ఉపయోగపడుతుందో, వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వివరించేదే ఈ మొబైల్ ఫోన్ కథ. అలాంటివే ఈ అధ్యాయం - పేరు ప్రతిష్టల ఫలితమే డబ్బు- లో మనం ముచ్చటించుకున్న ఇతర నిజ జీవిత కథలు కూడా. వాల్ట్ డిస్నీ యానిమేషన్ చరిత్ర, సింఫనీ కూలర్ విజయ గాధ, స్టార్ బక్స్ కాఫీ కప్పుతో ఘన విజయం, హాట్ మెయిల్ హాట్ హాట్ కీర్తి తద్వారా దక్కిన లక్ష్మీ కటాక్షం. యాపిల్ కంప్యూటర్ మెకింతోష్ ఆవిష్కరణ. అది సాధించిన అద్భుత విజయాలు. సోనీ వాక్‌మెన్ ఆవిష్కరణ. అది మన జీవిత సర ళిపై వేసిన చరగని ముద్ర. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్య బర్గర్, ఒక చిన్న ఐడియాతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన మెక్‌డొనార్డ్స్. ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం - మైక్రో చిప్ ద్వారా మానవజాతి జీవిత గమనాన్ని మార్చివేసిన కథాకమామిషు. చివరిగా ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన మొబైల్ ఫోన్ అద్భుత ఆవిష్కరణ. ఇవన్నీ ఇలాంటివి మరెన్నో... చిన్నా పెద్దా నిజ జీవిత గాధ లు.http://us.123rf.com/400wm/400/400/kjpargeter/kjpargeter0607/kjpargeter060700180/478803-the-world-in-your-hands--3d-render.jpg
వేలల్లో, లక్షల్లో .. మనకు చెప్పేది ఒక్కటే:
ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు. వాటి ఫలితం డబ్బు. ధనార్జనకు రాచబాట ఇదే. మోసాలు, అన్యాయాలు, అరాచకాలు కాదు. అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలికం. మోసపోయిన వారి తిట్లు, శాపనార్ధాలు, మనకు దీవెనలు కాదు కదా! ఆలోచించాల్సిన విషయం ఇది. సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అవకాశాలు. అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండటమే మన కర్తవ్యం. 
http://drjeffadams.com/wp-content/uploads/2008/07/dream-big.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు! కలతో, కృషితో నాస్తి దుర్భిక్షమ్!
- ఎజి కృష్ణమూర్తి

Sunday, September 12, 2010

జయహో విజయ గాధలు: ధీరూభాయ్‌లు కావాలి..

కుబేరులున్న బీద దేశం మనది...
స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా..
ఎందువల్లనంటారు ? కొందరి దృష్ట్యా మనకు అంటే మన దేశ ప్రజలకు మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం వల్లనని !
చట్టాలున్నాయి.. అమలు కావు.. చట్టాలు కూడా అందరికీ సమానం కావు.

మూర్ఖత్వం దేశంలో నాలుగు చెరగులా రాజ్యమేలుతుంది.
సంఘం మీద, తోటి మానవుల మీద గౌరవం శూన్యం. సభ్యత, నాగరికత కోసం భూతద్దాలతో వెతకాలి. పొరుగు దేశాల్లో ఎంతో సభ్యత, సంస్కారంతో మసలే భారతీయులు కూడా. స్వదేశం రాగానే అసభ్యత, అనాగరికత ప్రదర్శిస్తారు. చెత్త చెదారం ప్రతిచోటా వెదజల్లుతారు.

ఎందువల్ల? భయభక్తులు లేకే! అక్కడ విదేశాల్లో క్షణాల్లో పట్టుకుని శిక్షిస్తారు. మరి ఇక్కడో...?
ఎందుకు లెండి అందరికీ తెల్సిన కథాకమామీషుల్ని పదేపదే వల్లె వేసుకోవటం...
కంట్రోల్స్ ఉండాలి. భయముండాలి. నేరాలకు కఠినమైన శిక్షలు వెంటనే అమలు కావాలి. ఇలా ఎన్నెన్నో.. ఇవి లేకనే మనం ఇంకా మిగతా దేశాల కన్నా ఎంతో వెనకబడి ఉన్నాం. చైనా దేశ పురోగతిని ఉదహరిస్తారు వీరు.

ఇవి కొందరి అభిప్రాయాలు, ఆలోచనలు కాగా మరికొందరి దృష్టిలో పేట్రేగిపోతున్న స్వార్థం, లంచగొండితనం మన దేశ భవిష్యత్తును చావుదెబ్బకొడుతున్నాయని. వీరు ఇచ్చే ఉదాహరణ ఆనాటి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మన దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న సమయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు..

"అధికారం రోగ్సు (మోసగాళ్లు), రాస్కెల్స్ (దుష్టులు, పోకిరివాళ్లు), ఫ్రీ బూటర్స్ (దోచుకునే వాళ్లు, కొల్లగొట్టేవాళ్లు) హస్తగతమౌతుంది. భారత దేశంలోని నాయకులందరూ 'లో కేలిబర్'- తక్కువ మేధాశక్తి, బలహీన వ్యక్తిత్వాలు గల వారుగా ఉంటారు. తీయని పలుకులు, బుద్ది హీనత్వం వారి సొంతం. అధికారం కోసం తమలో తాము యుద్ధాలు చేసుకుంటారు. ఫలితంగా రాజకీయ అంతర్యుద్ధాలతో దేశం నష్టపోతుంది..''
నేడు జరుగుతున్న కథే ఇది. మనమంతా కష్టపడి చర్చిల్ మాటలను నిజం చేసుకుంటున్నాం. రాజకీయ అంతర్యుద్ధాలు, ముఠాతత్వాలు, అలసత్వం, స్వార్ధం ఎలాంటి భయభక్తులు, కంట్రోల్సు లేకపోవటం దేశాన్ని భ్రష్టు పట్టించి, పలు దేశాల కన్నా, సహజ సంపదలున్నా మనమింకా బీదరికం, రోగాల్తో కొట్టుమిట్టాడి పోతున్నాం.

ఈ చీకట్లో కాంతి పుంజాల్లాంటి వారు నేటి యువత. వారు చూపిస్తున్న అసాధారణ చొరవ, ప్రజ్ఞాపాటవాలు. మనం సాధిస్తున్న కాస్తో కూస్తో నేటి ప్రగతికి మూలకారణాలు. నిజానికి ఈ దేశ భవిష్యత్తుకి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలకమైన వారు మన దేశ యువతే.

నేడు దేశం గర్వింప దగ్గ వ్యాపారవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాలకు చెందిన నిపుణులు.. వీరందరూ ఎంతో చిన్నవారే. గతంలో లాగా తలలు పండితేనే విజయాలు వరించాల్సిన అవసరం లేదు నేడు. కొత్త ఉత్పాదనల ఆవిష్కరణలతో, సరికొత్త టెక్నాలజీలతో ఎంతో మంది యువకులు నాలుగు పదుల వయస్సు రాకముందే పేరు ప్రతిష్ఠలు అవి తెచ్చే ధన సంపదలతో తులతూగుతున్నారు దేశ విదేశాల్లో.. ఇవన్నీ స్వార్జితమైనవి.

కష్టపడి సంపాదించుకున్నవి. మనకు మార్గదర్శకమైనవి వీరి ప్రయోగాలు, విజయాలు. వీరెవ్వరూ కుటుంబ పలుకుబడి మీద, పెట్టుబడుల మీద, తరతరాలుగా వస్తున్న వ్యాపారాల పైన, వృత్తుల పైన ఆధార పడకుండా తమ తమ సామ్రాజ్యాలను సృష్టించుకొన్నారు పట్టుదలతో.. గమ్యాలతో రేయింబవళ్లు ఏకం చేసి.. ఇలాంటి వారు వందల్లో, వేలల్లో, లక్షల్లో విజయాలను తమ కైవసం చేసుకుంటుంటే నేటి భారతంలో మనమూ ఆ పని చేయొచ్చు కదా! వారు మనలాగే సామాన్యులే కదా.. స్వశక్తిపై నమ్మకం ఉంచుకుని ముందడుగు వేసిన వారే కదా ! వారూ మనలాగే రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు.. ఇంకా ఇతర శరీర అవయవాలు కలవారే కదా !!!

వారిలో ఎంతమంది మనలాగే అట్టడుగు సమాజం నుంచి లేచివచ్చి ఈ సువిశాలమైన ఆకాశం కింద తమ అస్థిత్వాన్ని నిరూపించుకున్నవారే. తమ ఉనికిని పదిల పరుచుకున్నవారే. వీరిలో ఒకరు మనందరికి ఎంతో సుపరిచయమైన ధీరూభాయి అంబానీ గారు. ఎంతో క్లుప్తంగా వారి గురించి ముచ్చటిస్తాను ఇక్కడ.. ఎందుకంటే వారి గురించి రెండు పుస్తకాలు (ధీరూభాయిజమ్, ఎదురీత), పలు వ్యాసాలు, గతంలో రాయటం జరిగింది.
దేశాభివృద్ధి గురించి, నేటి భారతంలోని వ్యాపార విజయాల గురించి, గమ్యాలతో పట్టుదలతో ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి పోరాడి దేశంలోని లక్షల మందికి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ధీరూభాయి. అందుకని వారి జీవిత విశేషాలు, ఇక్కడ క్లుప్తంగానైనా ముచ్చటించుకోవటం అవసరం.

వారు వ్యాపార రంగ ప్రవేశం చేసినప్పుడు మన దేశంలోని పరిస్థితులు నేటికి పూర్తిగా విరుద్ధం. లైసెన్స్ కోటారాజ్ తీవ్రంగా రాజ్యమేలుతున్న రోజులవి. సామాన్య కోరికలు కూడా ఆకాశంలో నక్షత్రాల్లా అందకుండా పోయిన రోజులవి. అన్నిటికీ కొరతలే పాలడబ్బాల నుంచి ప్లెయిన్‌లో సీటు దాకా.

అన్నిటికీ పరపతి కావాలి. ఫోను కావాలన్నా, స్కూటర్ కావాలన్నా, బ్యాంకులో లోను కావాలన్నా... పరపతి, ఆపై ఓర్పు మెండుగా ఉండాల్సిన కాలమది. ఫోను, స్కూటర్ వగైరాలు గృహ ప్రవేశం చేయాలంటే పది పదిహేను సంవత్సరాల నిరీక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో కలలకు, గమ్యాలకు, పట్టుదలకు చోటేది..!?

నిరీక్షణ, ఓర్పు- రెండే ప్రధాన జీవితావసరాలు ఆ రోజుల్లో. వ్యాపార రంగం నత్తనడకన నడుస్తున్న కాలం. వ్యాపారస్తులంటే అనుమానంతో చూడబడుతున్న సమయం. అటువంటి దేశ కాల పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి తన జీవిత కాలంలోనే, ముప్ఫై ఏళ్ల లోపే అంతర్జాతీయ శ్రేణికి చెందిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ధీరూభాయి.

పాలడబ్బాలకు పరపతి ఉపయోగించాల్సిన దేశంలో, అంతటి వ్యాపార సా మ్రాజ్య స్థాపనలో ఆయన ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొని ఉంటారో ఊ హించుకోండి.అందువల్లే ఆయన మనలాంటి సామాన్యులకు స్ఫూర్తిదాత, మా ర్గదర్శకుడయ్యారు. ఈ దేశంలో సామాన్యులు కూడా గొప్ప కలలు కని వాటిని తమ తమ జీవిత కాలాల్లోనే సాకారం చేసుకునే ధైర్యాన్ని మనలో కలిగించారు.

ధీరూభాయి అంత ఎత్తు ఎదగాలని నేడు కలలు కనే యువకులు లక్షల్లోనే ఉంటారు మనదేశంలో.. మన ఆలోచనా విధానంలో ఈ పెనుమార్పు ఆయన సాధించిన విజయాల వల్లే ఏర్పడింది. ఇన్ని విజయాలు సాధించిన ధీరూభాయి 28 డిసెంబర్ 1932న హీరాచంద్, జమునాబెన్ అంబానీలకు ఐదో సంతానంగా గుజరాత్‌లోని చోర్‌వాడ్‌లో పుట్టాడు.

హీరాచంద్ టీచరు. ఆనాటి పలువురిత ఉపాధ్యాయుల్లాగా బీదవాడు హీరాచంద్. చెప్పుల్లేని కాళ్లు, వంటికి రెండే రెండు జతల బట్టలు, స్కూలు ఫీజు కట్టాలంటే. తనే స్వయంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు. బజ్జీలు చేసి వచ్చిన లాభాలతో స్కూలు ఫీజు కట్టేవాడు చిన్న ధీరూభాయి.

ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాక తన 17వ ఏట కుటుంబాన్ని పోషించటానికి బ్రిటీష్ కాలనీ అయిన ఎడెన్‌కి వెళ్లారు. అడుగులోనే హంసపాదన్నట్లుగా ఏ ప్యాసింజర్ షిప్‌లోనూ సీటు దొరకలేదు. సమయంలో చేరకపోతే ఉద్యోగం మాయమవుతుంది. కార్గో షిప్‌లో ప్రయాణం చేసి గడువులోగా ఎడెన్ చేరుకున్నాడు.

శుద్దమైన బ్రిటీష్ ఇంగ్లీష్ భాష అక్కడి వాడుక భాష. తనకు ఇంగ్లీష్‌తో అంతగా పరిచయం లేదు. మరో సమస్య. ఇలా జీవితాంతం అన్నీ సమస్యలే. తొమ్మిదేళ్ల అనంతరం ఎడెన్ నుంచి బాంబే వచ్చి కొద్దిపాటి మూలధనంతో ఆహార దినుసుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం మొదలు పెట్టారు. ఇతర వ్యాపారులతో సమస్యలు. మెల్లగా ఎదిగి యార్న్ వ్యాపారంలోకి ప్రవేశించి 1966లో తమ సొంత బట్టల తయారీకి మొదలుపెట్టారు.

'విమల్' ఆ వస్త్ర సంపద పేరు. గమ్యం పద్ధతుల మీద పూర్తి నమ్మకం, అవగాహన ఉన్న వ్యక్తి ధీరూభాయి.
ఏ వ్యాపారం చేసినా, అందులో ప్రధమ స్థానం ఆక్రమించాలన్నది గమ్యం.
పద్ధతులు- ఉత్తమ శ్రేణికి చెందిన టెక్నాలజీ, మానవ వనరుల సహాయంతో అత్యుత్తమ ఉత్పాదనలకు పెద్దపీట వేశారు.
వ్యాపారమన్నాక జీవితంలో లాగానే ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులు సహజం.

కనుక వాటి నుంచి పారిపోకుండా, ఎదురొడ్డి పోరాడి విజేత కావాలన్నది మరో వ్యూహం. ఈ ప్రయాణంలో మంచి టీము, వారికి స్ఫూర్తినిచ్చే ఛాలెంజెస్, జీత భత్యాలు సంస్థతో మమేకమయ్యేలా పరిసరాలు, పరిస్థితులు సమకూర్చటం మరో వ్యూహం.

నేను 23 ఏళ్లు వారితో కలిసి పని చేశాను. ఏనాడు నేను ఒక ఉద్యోగస్తుణ్ని 9 నుంచి 5 దాకా పనిచేసి. నెలాఖరున జీతం పుచ్చుకుని అంటీముట్టనట్లు వ్యవహరించలేదు. వారి కుటుంబంలో, వారి కలల్లో, గమ్యాల్లో, కష్టాల్లో ,సుఖాల్లో మాలాంటి వారు భాగస్తులు, ఇది మా కృషి వల్లకాదు. వారి చొరవ వల్లే.

ప్రభుత్వ పరంగా, పోటీ దారుల నుంచి, పత్రికల నుంచి పెను సమస్యలే ఎదురయ్యాయి ధీరూభాయికి . పోరాడారే తప్ప పారిపోవాలనుకోలేదు. విదేశాల్లో సెటిల్ కావటం ఆ రోజుల్లో చాలా ఫ్యాషనబుల్, ధీరూభాయికి కాదు. జీవితాంతం మధ్యతరగతి విలువలు ఎదుటివాడికి సహాయం చేసే తత్వం ధీరూభాయిది. ప్రతిభకు పట్టం కట్టేవారు, మాలాంటి వారంటే బోలెడంత ప్రేమాభిమానాలు. ఎంతో గౌరవించేవారు.
భారతీయ వ్యాపార రంగంలోని పలువరి దిగ్గజాలతో నాకు పరిచయాలున్నప్పటికి ధీరూభాయి లాంటి వ్యాపార వేత్తను, వ్యక్తిని మరెవరిలో చూడలేదు. ధైర్యం.. గమ్యాలు .. వాటిని చేరుకునే విధానాలు.. అన్నీ సుసాధ్యాలేనని నమ్మే పాజిటివ్ వ్యక్తిత్వం.. ఇతరులను నమ్మి, వారికి బాధ్యతలను అప్పగించగలిగిన ధైర్య సాహసాలు.. గొప్ప కలలుకనే ఆత్మస్థైర్యం, వాటిని ఎలాగైనా చేరుకోవాలనే తపన. అసాధ్యమైన కలలంటూ ఏవీ ఉండవనే గాఢ విశ్వాసం.

ధీరూభాయి గారి అస్త్రాలు ఇవన్నీ. అతి సామాన్యుడు, అసామాన్యుడైనాడు కేవలం మూడు దశాబ్దాల్లో, తన జీవిత కాలంలోనే. ఇది అందరికీ సాధ్యమేనని నమ్మి, మనని నమ్మించి, మనలో కలల్ని, గమ్యాల్ని ప్రేరేపించగలిగారు ధీరూభాయి ఇదే ఆయన విజయం. 
-ఎజి కృష్ణమూర్తి