Sunday, June 19, 2011

మా నాన్న.. నేను

"నేను చేసిన తప్పులకు నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. కానీ జీవితాంతం ఏం చేయకూడదో తెలుసుకున్నాను. అదే నాన్న గొప్పతనం''
- మహాత్మా గాంధీ

వేలు పట్టుకుని ప్రపంచాన్ని పరిచయం చేసినా, అడుగులు తడబడుతున్నప్పుడు 'భద్రం' అంటూ చేయి అందించినా, తప్పటడుగులు వేసినప్పుడు రెండు దెబ్బలు వేసి మందలించినా... అది నాన్నకే చెల్లు. ఏ బిడ్డలైనా నాన్న వేసిన బాటలోనే ప్రయాణిస్తారు. ఎంత లేదనుకున్నా ఆయన ప్రభావంతోనే పెరుగుతారు. ఇవాళ తండ్రులందరికీ సెల్యూట్ చేయాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు 'ఫాదర్స్ డే'. ఈ సందర్భంగా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. తండ్రుల జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు పలువురు ప్రముఖులు.. వాటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం...

ఆయన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు..
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ఫలానా పని చేయాలని, ఫలానా చదువే చదవాలని మా నాన్న ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. నాకు ఇష్టమైన రంగాలలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించారు. నేను చిన్నప్పట్నుంచి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నప్పటికీ ఇంటికి దూరంగా ఉన్నాననే భావం కలగనీయకుండా చూసుకునేవారు. నాన్న రాజకీయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సమయంలో నేను క్రికెట్‌లో బిజీగా ఉండేవాడిని. ఆయన మరణానంతరమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

అప్పట్లో నా తమ్ముళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే వయస్సు లేని కారణంగా నేను పోటీ చేయక తప్పలేదు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సేవలను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు. నేను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ఆ సంగతులను చెబుతుంటే సంతోషం కలుగుతుంటుంది. ఇటీవల శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ జిల్లాల ఇన్‌చార్జి మంత్రిగా మా తండ్రి అందించిన సేవలను పలువురు కొనియాడడం నాకెంతో గర్వంగా అనిపించింది.

నాన్నే అమ్మయ్యాడు...
గనులశాఖా మంత్రి గల్లా అరుణకుమారి

మా అమ్మను నేను ఎరుగను. నాకు రెండు సంవత్సరాల వయస్సులోనే ఆమె చనిపోయింది. ఊహ తెలిసిన దగ్గర నుంచీ అన్నీ నాన్నే నాకు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగేవారు. పొద్దుపోయి ఏ రాత్రికో యింటికి వచ్చేవాడు. ఎంత రాత్రి అయినా నన్ను వెతుక్కుని తన దగ్గర పడుకోబెట్టుకుని నిద్రపోయేవాడు. నాన్నమ్మ వంటనేర్చుకోమని తిడుతుంటే... మా నాన్న నన్ను దగ్గరకు తీసుకుని "యేం .. ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన వంట చేసుకే బతకాలా? మా చిన్నమ్మ చేయాల్సిన పనులెన్నో వున్నాయి'' అనేవాడు.

ఒకరోజు మా మామ ఒకరు మా నాన్నతో మాట్లాడుతూ..."రాజా.. నా కొడుకుల్లో వొకరికి నీ కూతుర్ని యివ్వు'' అన్నారు. వెంటనే మా నాన్న నవ్వుతూ "మా అమ్మాయి చేత నీ కొడుకు తాళి కట్టించుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు'' అన్నాడు. ఆడపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. గౌరవం కూడా. రాజకీయాల్లోకి కూడా నాన్న నా చేయి పట్టుకుని నడిపించుకువెళ్ళారు. అయితే ఆ వాతావరణంలో యిమడలేక నేను నిరుత్సాహపడుతూ వుంటే, నవ్వి, రాజకీయం అంటే ఇలాగే వుంటుంది రా అనేవాడు. ఇక్కడ చావులేదు, బతుకూలేదు. చచ్చినవాడు చచ్చినట్టూ వుండడు, బతికినవాడు బతికినట్టూ వుండడు. ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు బతికి లేచి కూర్చుంటాడో తెలియదు. దిగులు పడకూడదు. భయపడకూడదు. అవే అన్నీ సర్దుకుంటాయి. అని ధైర్యం చెప్పేవాడు. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తోంది.

రెండు పడవల ప్రయాణం వద్దన్నారు.... శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్
నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు నాన్న చెప్పిన మాటే ఈ రోజు నాకు మార్గదర్శకమయింది. " నువ్వు రాజకీయాల్లోకి రావాలంటే వ్యాపారాలకు దూరంగా ఉండు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో పనిచేయడానికి ప్రయత్నించు. రెండు పడవలపై ప్రయాణం ప్రమాదం'' అని చెప్పారు. మా నాన్న పుట్టిన గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తుచేసుకుంటారు. నన్ను అక్కున చేర్చుకుంటారు.

ప్రజల్లో ఇంతటి అభిమానం సంపాదించుకోవాలంటే నేను కూడా 'ఫుల్‌టైం జాబ్' చేయాల్సిందే అనుకున్నాను. అప్పటికి నాకు ఒక రెస్టారెంటు ఉంది. మరో కంపెనీకి డీలర్‌గా కూడా పనిచేస్తున్నాను. లాభాల్లో నడుస్తున్న నా వ్యాపారానికి బై చెప్పి వచ్చేశాను. నాన్నతో చాలా చనువుగా ఉండేవాడ్ని. కారణం ఆయన రాజకీయాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో...కుటుంబానికి అంతే ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇంటికి వచ్చాక మాతోనే ఉండేవారు. ఆ విషయంలో నేను నాన్నంత గొప్పవాణ్ని కాలేను. ఎందుకంటే...ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు (నవ్వుతూ...) ఇప్పుడలా కాదు...ఇలా ఇంటికి రాగానే జేబులో ఫోన్ మోగుతుంది. అంతే ఇల్లూ లేదు పిల్లలూ లేరు.

జేమ్స్‌బాండ్ అనేవారు...
జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఎ విష్ణువర్ధన్‌రెడ్డి

నాన్న కారు నెంబరు 4007 అంటే నలుగురు కూతుళ్లు, ఒక జేమ్స్‌బాండ్ అని చెప్పేవారు. ఆయన ఉన్నప్పుడు నా బలం తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఒక్కడ్నే. నాన్నకు పడుకునే ముందు నాతో కాళ్లు నొక్కించుకోవడం అలవాటు. ఆ సమయంలో నాకు బోలెడు కబుర్లు చెప్పేవారు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లి అవసరం, బయటికి వెళ్లినపుడు తండ్రి అవసరం ఏంటో తెలుస్తుంది. మా నాన్న గొప్పతనం ఏంటంటే...తనకి అన్ని విషయాలూ తెలుసు, అయినా నేను చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన విగ్రహం ఎదుట ఏకలవ్యునిగా మిగిలిపోయాను.

ఆయన వేలు విడవలేదు...
రామగుండం ఎంపీ వివేక్

నా డాక్టరేట్ అయిన తర్వాత విదేశాలకు వెళదామనుకున్నా. అప్పుడే - 1990లో - చార్మినార్ ఇండస్ట్రీస్‌కు నాన్న యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని పోరాడుతున్నారు. కాని యాజమాన్యం ఒప్పుకోలేదు. మనమే పరిశ్రమలు పెడదాం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆపారు. ఆ కారణంగానే ఇప్పుడు నేను పారిశ్రామికవేత్తగా ఎదిగాను. నాన్న జ్ఞాపకం అనగానే గుర్తొచ్చేది...రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒకసారి మమ్మల్ని నార్త్ ఇండియా టూర్‌కు తీసుకెళ్లారు. బద్రినాధ్, హరిద్వార్...వంటి ప్రాంతాలు చూపించారు.

మరో విషయం కూడా గుర్తుకొస్తుంది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో భాగంగా పోలీసు ఫైరింగ్ జరిగింది. అప్పుడు నాన్నకు కూడా గాయాలయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. నాన్నను చూడ్డానికి అమ్మతో ఆసుపత్రికి వెళ్లిన జ్ఞాపకం కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇంటా...బయటా అన్ని విషయాల్లో నాన్నను అనుసరించడానికి ప్రయత్నిస్తుంటాను. ఆయనలా ఉండాలంటే చాలా కష్టం. నా వ్యక్తిగత ప్రగతిలో, రాజకీయ అభివృద్ధిలో నాన్న పాత్ర చాలా ఉంది. ఇప్పటికీ ప్రతి విషయంలో ఆయన నన్ను వేలు పట్టి నడిపిస్తున్నట్లే ఉంటుంది.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోమన్నారు..
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి

నేను పన్నెండో తరగతి చదువుకుంటున్నప్పుడు నాన్న ఒక మాట చెప్పారు. " నువ్వు డాక్టర్ చదవాలనుకుంటే ఇప్పటినుంచే కష్టపడి చదువు. రికమండేషన్ల కోసం నా దగ్గరికి రావొద్దు''. అప్పుడు నాన్న రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికాశాఖ మంత్రి. తన పలుకుబడి మా ఎదుగుదలకు ఏ విధంగానూ ఉపయోగపడకూడదనుకునేవారు. స్వయంకృషే శాశ్వతం అనేవారు. ఆయన మాటలు నాలో పౌరుషాన్ని నింపేవి. అలాగే అప్పుడప్పుడు మాపై మాకున్న నమ్మకాన్ని పరీక్షించేవారు. పరీక్షల సమయంలో సినిమాకి రమ్మనేవారు. అమ్మ చాలా పోట్లాడేది. "నిజంగా చదువుని ఒంట బట్టించుకుంటే...సినిమా చూసినా చక్కగా రాయొచ్చు'' అనేవారు. నేను బాగా చదువుతానని ఆయనకు తెలుసు. అయితే ఆ మాట ఎవరి దగ్గరా అనేవారు కాదు. అమెరికాలో ఎమ్ఎస్ చేసినపుడు నాకు 97 శాతం మార్కులు వచ్చాయి.

ఆ కాపీని ఇక్కడికి పోస్టు చేశాను. ఆ మార్కుల లిస్టుని ఇక్కడ అందరికీ చూపించుకుని మురిసిపోయారట. ఒక కొడుకుగా ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకం ఒకటుంది. నేను రాజేంద్రనగర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాన్న కేంద్రమంత్రి. కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన వచ్చినపుడు కాలేజీ స్టూడెంట్ లీడర్‌గా ఆయనకు నేను ఆహ్వానం పలికాను. అది నాకు చాలా గర్వంగా ఉండేది. ప్రజలు మనల్ని నమ్మినంతకాలమే మనం రాజకీయాల్లో ఉండగలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే మనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేవారు.

ప్రేమంతా మనసులోనే... కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
మా కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చనువు చాలా తక్కువగా ఉండేది. భయభక్తులు ఎక్కువ. నాన్న నాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. మా నాన్నతో మా తాత కూడా అలాగే ఉండేవారు. బాగా అవసరమైన విషయాలు తప్పితే...అన్ని విషయాలు నాన్నతో పంచుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాగని అభిమానం లేదని కాదు. ఎంత ప్రేమ ఉన్నా...మనసులోనే ఉంచుకోవాలి. ఆయన ముందర నిలబడి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. నేను చెప్పేది నా చిన్నప్పటి విషయాలు కాదు...నా పెళ్లయిన తర్వాత కూడా అంతే. అన్ని విషయాల్లో నేను ఆయన్నే అనుసరించేవాడ్ని. ఆయనొక మొండిఘటం. అనుకున్న పని అయ్యేవరకూ వదలరు. అదే ఆయన్నించి నేను నేర్చుకున్న అంశం. మనల్ని నమ్మినవారితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా బంధాన్ని తెంచుకోకూడదు అనేవారు. ఇందిరాగాంధి నుంచి రాహుల్ వరకూ ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సంబంధాల్ని నేనూ కొనసాగిస్తున్నాను.

హుందాగా ఉండాలనేవారు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

నేను మూడేళ్ల వయసున్నప్పుడే నాన్న ఎమ్మెల్యే. మాతోబుట్టువులలోనేనే చిన్నదాన్ని కావడంతో అందరికంటే నన్నే ఎక్కువ గారంగా చూసుకునేవారు. ఇప్పటివరకూ చిన్నమాట కూడా అనలేదు. పెళ్లయేదాకా నాకు ఏం కావాలన్నా నాన్నే హైదరాబాదు నుంచి తెచ్చేవారు. ఆళ్లగడ్డలో నేను నాన్నతో కలిసి నడుచుకుంటూ సినిమాకు వెళ్లేదాన్ని. నా పెళ్లయేదాకా ప్రతి పుట్టిన రోజుకూ నాన్న ఎక్కడున్నా వచ్చేవారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాన్న, నా భర్త అప్పటి నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లాను. ఇద్దరం శాసనసభలో ఉన్నపుడు తెదేపా ఎమ్మెల్యేలతోపాటు నేనూ పోడియం వద్దకు వెళ్లడం లాంటివి చేస్తే అలా చేయొద్దని సైగ చేసేవారు.హుందాగా ఉండాలని కోరుకునేవారు. నెలకొకసారైనా ఆయన వద్దకు వెళ్లి కలిసి భోంచేసి వస్తుంటాను. మంచైనా చెడైనా నాన్నకు నేను తప్ప మా కుటుంబంలో ఎవరూ చెప్పలేరు. అంత చనువుంది ఆయనతో నాకు.

మానవత్వం నేర్పారు
పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఈరోజు ఆయన వారసునిగా మీముందు ఉన్నాను కాని చిన్నప్పుడు మా నోట రాజకీయం అనే మాట వినిపించేది కాదు. పెద్ద చదువులు చదువుకుని ఉన్నతమైన వ్యక్తిత్వంతో రాణించాలని కోరుకునేవారు. దానికోసం మాకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేవారు. చదువు పూర్తి అయ్యాక మాకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకోమని చెప్పేవారు. కాని అనుకోకుండా రాజకీయాల్లోకి రావలసినవచ్చింది. ఎప్పుడూ పేదల గురించి ఆలోచించే నాన్నే నాకు స్పూర్తి. ఆయన మాకు మంచి, మానవత్వం నేర్పారు. ప్రతీ సమస్యను మానవీయ కోణంలో ఆలోచించాలని, ప్రతీ వ్యక్తిని మానవత్వంతో అక్కున చేర్చుకోవాలని చెప్పేవారు. నా నియోజకవర్గంలో ప్రజల ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే ఆయన మంచితనమే కారణం.

పోలియో వచ్చినపుడు... నెల్లూరు ఎమ్ఎల్ఎ ఆనం వివేకానందరెడ్డి

నాకు పన్నెండేళ్ల వయసులో పోలియో వల్ల కాలికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. రాయవేలూరులో ఉన్న ఆస్పత్రిలో వైద్యం చేయించారు. నెల్లూరి నుంచి రాయవేలూరికి వెళ్లాలంటే మూడు బస్సులు మారాలి. నాన్నే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవారు. రెండుసార్లు ఆపరేషన్ చేయించారు. చంక దింపకుండా చంటిపిల్లవాడ్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే...నాన్నే కారణం. రాజకీయాల్లో మునిగిపోయి భార్యాపిల్లల్ని పట్టించుకోలేనివారు బోలెడుమంది ఉన్నారు. కాని నాన్న అలా కాదు...'నేను ఏం చేసినా మీకోసమే కదా' అని ప్రతీ తండ్రి అనే మాటను ఆయన నిజం చేశారు.

ఆ ప్రశ్నని మరచిపోలేను....
మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి

నాన్న ఎమ్ఎల్ఎగా ఎన్నికైన సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. మనం చదువులో కొంచెం వీక్(నవ్వుతూ...) ఇంటర్‌లో 49 శాతం మార్కులే వచ్చాయి. అగ్రికల్చర్ బిఎస్‌సి సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను. నాన్న మార్కులు చూశారు. "ఈ మార్కులు చూపించి ఎవడి కాళ్లు పట్టుకోమంటావు'' అని అరిచారు. నా నోట మాట లేదు. చప్పుడు చేయకుండా వెళ్లి బీకామ్‌లో చేరాను. తరువాత లా చేశాను. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ ఆయన మాకు చెప్పింది, నేర్పింది, ఆచరించి చూపింది ఒకటే. నిజాయితీ. అదే నిలబెడుతుంది. నిజాయితీ లేకుండా ఎంత కష్టపడ్డా బూడిదపాలే అని చెప్పేవారు.

మంచి స్నేహితుడు...రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి
ఏరాసు ప్రతాపరెడ్డి

మా నాన్న ఏరాసు అయ్యపురెడ్డి మంచి న్యాయవాది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసులను డీల్ చేసేవారు. నన్ను చిన్నప్పుడు బూసెమ్మ మడుక్కు ఈత కొట్టడానికి తీసికెళ్లేవాడు. ఎల్‌కేజీ, యూకేజీలో నాన్న నన్ను హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అది జాగీర్దారులు, జమీందారులు తమ పిల్లలను చదివించుకునే స్కూలు. ఒకరోజు నాన్న స్కూలుకు వచ్చి అక్కడ సరిగా ఇమడలేకపోతున్నానని తెలుసుకుని..ఈ బడీవద్దు..

గిడీ వద్దని మా ఊరు గడివేముల మండలం గడిగరేవులకు తీసుకొచ్చేశారు. కర్నూలు స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. కానీ నేను చదివిన బడికి ఇక్కడి బడులకు తేడా ఉందని కర్నూలులో చదవనని మారాం చేశాను. ఇంట్లోనే ప్రైవేటుగా చెప్పించారు. ఒకసారి కాలేజిలో కాలికి దెబ్బ తగిలింది. నాన్న వెంటనే రూ. 3500 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనిచ్చారు. ఆయనలా లాయరునయ్యాను. ఆయన మాదిరే ఆ శాఖకు మంత్రినయ్యాను.

నాన్నకు సెక్యూరిటీగా...
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

ముప్పైఏళ్ల క్రితం హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నాన్నపై మా శత్రువర్గం వారు హత్యాయత్నం చేశారు. 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆయన కేకలకు ఇంట్లో ఉన్న అమ్మ, నేను పరుగెత్తుకుంటూ వెళ్లాం. రక్తంమడుగులో ఉన్న నాన్నను చూసి చాలా భయపడ్డాను. భుజానికెత్తుకు ందామని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. మాకు దక్కుతాడని అనుకోలేదు. ఐఎఎస్ అవ్వాలన్న నా ఆశ...అక్కడే చచ్చిపోయింది. చదువు మానేసి ఆయనకు సెక్యూరిటీ గార్డుగా మారిపోయాను.

ఇప్పటికీ నాన్న గురించి ఆలోచిస్తే...నాకు మొదట గుర్తుకు వచ్చే విషయం ఇదే. అదే నా బలహీనత, అదే బలం కూడా. కాంగ్రెస్‌లో నాన్నపై కక్షసాధింపు చర్యలు భరించలేక 1994లో తెలుగుదేశం పార్టీలో చేరాను. అమ్మానాన్నలను చూడాలనుకున్నప్పుడల్లా కర్నూలు వెళ్లిపోతాను. నాన్నతో కూర్చుని రాజకీయాలు మాట్లాడుతుంటే సమయమే తెలియదు.

No comments: