Friday, December 30, 2011

2011 టాప్ 15 మహిళలు

12 నెలల కాలం... ఆకాశమంత ఆశావహం... నూతన సంరంభం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తూనే ఉంటుంది. అదే ఉత్సుకతతో జనవరిలోకి అడుగుపెట్టి డిసెంబరులోకి వెళ్లేసరికి తమ తమ రంగాల్లో తళుక్కున మెరిసి చాలామంది ప్రభావశీలురుగా గుర్తుండిపోతారు. అలా ప్రముఖంగా నిలిచిన ఈ మహిళలు 2011 వినీలాకాశంలో తారలై వెలిగారు. 
ఆ పదిహేనుమంది జాడలే టాప్15...

నోబెల్ త్రయం 2011లో మహిళలు సాధించిన అత్యున్నత విజయాల్లో నోబెల్ శాంతి బహుమతిని నెంబర్ వన్‌గా చెప్పుకోవాలి. దీన్ని పంచుకున్న ముగ్గురు మహిళలలో ఇద్దరు ఒకే దేశానికి చెందినవారు కావడం విశేషం. ఒకరు లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ అయితే రెండోవారు లైబీరియా అంతర్యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి ఉద్యమాన్ని నడిపిన లేమా రాబర్టా గోవీ. మూడో శాంతి బహుమతి గ్రహీత 32 ఏళ్ల యెమెన్ దేశస్తురాలైన జర్నలిస్టు, రాజకీయవేత్త తవక్కుల్ కర్మల్. పత్రికాస్వేచ్ఛ, మానవహక్కులు, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి సలే ప్రభుత్వ పతనానికి కారణమైన మహిళ ఆమె.

*** ఇక మన దేశానికొస్తే - ఈ ఏడాది రాజకీయ రంగంలో స్త్రీలకు సంబంధించి చెప్పుకోదగిన విషయాలు మమతా బెనర్జీ గెలుపు, జయలలిత తిరిగి అధికారంలోకి రావడం. కోటలను కూల్చిన మహిళా శక్తి ... పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్లుగా పాలన సాగిస్తోన్న కమ్యూనిస్టుల కంచుకోటను మమతా బెనర్జీ బద్దలు కొట్టారు. తమిళనాడులో అన్నాడిఎంకే పార్టీ విజయఢంకా మోగించడంతో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. పగ్గాలు చేపట్టిన కొన్నాళ్లకే మావోయిస్టు నేత కిషన్‌జీని ఎన్‌కౌంటర్ చేయించడం, మంత్రులను తొలగించడంతో మమతా బెనర్జీ సంచనలం సృష్టిస్తే, నెచ్చెలి శశికళని పార్టీనుంచి తొలగించి జయలలిత తన మార్కు రాజకీయాలకు తెరతీశారు.

అధినేత్రికి అనారోగ్యం... కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం వైపు నడిపించిన యూపీఎ అధినేత్రి సోనియా గాంధీ కేన్సర్ బారిన పడ్డారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు గురైన ఆమె దాదాపు 70 రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని సెప్టెంబరు ఎనిమిదో తేదీన ఆమె భారత దేశానికి తిరిగివచ్చారు.

*** ఐదుగురు ఐశ్వర్యవంతులు ఒకనాడు పురుషుడి 'ఆస్తి'లో భాగంగా ఉండే స్త్రీ ఇవ్వాళ విడిగా తనకంటూ ఒక ఐశ్వర్యవంతుల జాబితాను ఏర్పరచుకుంది. అది వారసత్వంగా వచ్చిందైనా కావచ్చు, సొంతంగా సంపాదించిందైనా కావొచ్చు.

సావిత్రి జిందాల్ దేశ మహిళా ఐశ్వర్యవంతుల జాబితాలో సావిత్రి జిందాల్‌ది మొదటి స్థానం. ప్రపంచ జాబితాలో 44వ స్థానం. భర్త మరణానంతరం జిందాల్ కంపెనీల బాధ్యతల్ని వారసత్వంగా చేపట్టారు. అరవైయేళ్ల వయసులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్నారు. ఇప్పుడు సావిత్రి జిందాల్ 14.4 బిలియన్ డాలర్ల ఆస్తికి యజమానురాలు.

ఇందుజైన్ 3.1 బిలియన్ డాలర్లతో దేశంలోని మహిళా ఐశ్వర్యవంతుల జాబితాలో రెండవస్థానంలో ఉన్నారు ఇందుజైన్. బెన్నెట్, కోల్మెన్ అండ్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఈమె ఈ ఏడాది తన ఆస్తికి 600 మిలియన్ డాలర్లను అదనంగా చేర్చారు.

అను ఆగా థర్మాక్స్ గ్రూప్ అధిపతి అయిన అను ఆగా ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. 1985 నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు అను ఆగా. 1996 లో భర్త మరణించడంతో కంపెనీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో పదవీవిరమణ చేసి ఆ బాధ్యతలను కూతురికి అప్పగించారు. ఇప్పుడు ఈవిడకి ఉన్న ఆస్తి విలువ 1.24 బిలియన్ డాలర్లు.

కిరణ్ మజుందార్‌షా యాభైఏడేళ్ల కిరణ్ మజుందార్‌షా దేశంలోని మహిళా ఐశ్వర్యవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలిగా ఈమె అందరికీ సుపరిచతమే. 1978లో ఈ కంపెనీని బెంగళూరులో ప్రారంభించారు. 900 మిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ఉన్న కిరణ్ 1989లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.

శోభనా భార్టియా హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్‌కు సిఇఓ, ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శోభన మహిళా ఐశ్వర్యవంతుల జాబితాలో ఐదోస్థానంలో ఉన్నారు. ఈమెకున్న ఆస్తి విలువ 895 మిలియన్ డాలర్లు. 1986లో హిందుస్తాన్ టైమ్స్‌లో చేరిన శోభన ఒక జాతీయ వార్తాపత్రికకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న మొదటి మహిళ కావడం విశేషం.

*** సినీ 'వినోదం' సినిమాల్లో నటించే వాళ్ల పట్ల క్రేజ్ ఉంటుంది. వాళ్ల తెర జీవితం నుంచి వ్యక్తిగత జీవితం వరకు ఏం జరిగినా వార్తే అవుతుంది. అందులోనూ మహిళా నటీమణులకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బెట్టింగ్ 'బేబీ'... అందాల సుందరి ఐశ్వర్యారాయ్ ప్రసవం మీడియాకు హాట్ టాపిక్ అయింది. బాబా? పాపా? లేకా ఇద్దరా? అనే విషయంపైనా, 11-11-11 తేదీపైనా వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగింది. చివరకు నవంబరు 16 న ఈ మాజీ ప్రపంచ సుందరికి బుల్లిసుందరి పుట్టింది.

అభి'నవ' తారవో.. పేరు 'డర్టీ' అని పెట్టినా 'డర్టీపిక్చర్ ' సినిమా విద్యాబాలన్‌కు మంచి పేరే సంపాదించి పెట్టింది. 'నో వన్ కిల్డ్ జెస్సికా' తో వచ్చిన పేరును విద్యాబాలన్ 'డర్టీ'తో మరింత పైకి తీసుకుపోయారు. 2011 ది బెస్ట్ మహిళా యాక్టర్‌గా అందరి మన్ననలు అందుకున్నారు.

కత్రినా కైఫ్... అబ్బాయిల గుండెల్లో 'కత్తి'దింపి 'కైపు' ఎక్కించిన హీరోయిన్ ఎవరంటే అందరూ కత్రినా కైఫ్ వంకే చూస్తారు. 'జిందగీ...' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా 'బాడీగార్డ్' వంటి సినిమాల్లో ఐటమ్ పాటల్లోనూ ఆడి పాడి అభిమానులను అలరించారు. అందుకే అందరూ కలిసి ఈ యేటి బ్యూటీ కిరీటం ఆమెకు తొడిగారు.

నీతాలూ... నీ డిజైన్స్ అదిరె... బాలీవుడ్‌ను ఏలుతున్న ఈయేటి టాప్ డిజైనర్ నీతా లుల్లా. హైదరాబాద్‌కు చెందిన ఈ డిజైనర్ ముంబైలో స్థిరపడ్డారు. 'జోథా అక్బర్' సినిమాతో గ్లోబల్ ఫాలోయింగ్ సంపాదించిన నీతా ఇప్పటివరకు 350 హిందీ సినిమాలకు డిజైనర్‌గా పనిచేశారు. రోమ్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో సరికొత్త కలెక్షన్స్ ప్రదర్శించి ఇండియా సత్తా చాటారు.

No comments: